మహబూబ్నగర్ : మహబూబ్నగర్ పట్టణ రూపురేఖలు మార్చి హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దాలన్న తలంపుతో పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
పట్టణ అభివృద్ధిపై సోమవారం ఆయన మహబూబ్ నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు, ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ తదితర అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రూ.3.5 కోట్లలతో ఎంవీఎస్ కళాశాల మైదానంలో నూతన స్టేడియం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న ఫిష్, మీట్ మార్కెట్లో 3 కోట్ల రూపాయలతో మరో మార్కెట్ నిర్మించాలని, రూ.8 కోట్లతో చేపట్టిన స్లాటర్ హౌస్ నిర్మాణ పనులను నెలరోజుల్లో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.
రహదారి విస్తరణలో భాగంగా పట్టణంలో చేపట్టిన రహదారి మధ్యలో 10 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద పెద్ద మొక్కలను రోడ్డు మధ్యలో నాటేందుకు ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద సమీకృత మార్కెట్ నిర్మాణానికి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సమావేశంలో నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.
పట్టణంలో గ్యాస్ క్రిమటోరియం ఉన్నప్పటికీ శ్రీనివాస కాలనీ, పద్మావతి కాలనీలకు వెనకవైపు అనుకొని ఉన్న స్థలంలో పూర్తి ఆధునీకరించిన గ్రేవీ యార్డ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు.
బైపాస్ రహదారి వెంట లైటింగ్ పనులతోపాటు, ఫుట్ పాత్ పనులు, బూత్పూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు తక్షణమే సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
అలాగే హన్వాడ వద్ద 500 ఎకరాల తో చేపట్టిన ఫుడ్ పార్క్ పనులు వేగవంతం, పట్టణంలో నూతనంగా నిర్మించే కాంప్లెక్స్ కారణంగా ట్రాఫిక్ కు ఇబ్బంది ఉండకుండా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన రహదారులపై కూడా ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.
ప్రతి గ్రామంలో ఒక స్టేడియం ఏర్పాటుకు నిర్ణయం. చిన్నదర్పల్లి నుంచి ధర్మాపూర్ వరకు చేపట్టే కొత్త బైపాస్ రోడ్డుకు తుది రూపం ఇచ్చి జాతీయ రహదారులు లేదా ఇతర పథకంలో పూర్తికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
ఇవి కూడా చదవండి..
Kumrambhim Asifabad | అడా ఎస్బీఐ బ్యాంక్లో భారీ చోరీ
యాదాద్రి స్వర్ణతాపడానికి ఎమ్మెల్యే దానం రూ. 55 లక్షల విరాళం
Mulugu | రోడ్ రోలర్ను దహనం చేసిన మావోయిస్టు మిలిటెంట్ అరెస్ట్