మహబూబ్నగర్ : మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం అయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణాన్ని రెండు జోన్లుగా విభజించి ఒక రోజు ఒక జోన్ కు మరో రోజు ఇంకో జోన్ కు తాగునీటి సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించాలి.
ఈ మేరకు మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, అలాగే గ్రామాల్లో కూడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
జనరల్ దవాఖాన అభివృద్ధిలో భాగంగా సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టాలని, దవాఖానలో నాణ్యతతో కూడిన క్యాంటీన్ ఏర్పాటు చేయాలని, గేట్లను ఆధునీకరించాలని, రోగుల సహాయకులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని, దవాఖాన ప్రహరీ గోడలకు మంచి పెయింటింగ్ వేయించాలన్నారు.
అలాగే దవాఖానకు బోర్డు ఏర్పాటు చేయించాలని, బస్తీ దవాఖానాల ద్వారా నిరంతరం సేవలందించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా నియంత్రణలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే 2 విడతలు పూర్తయినందున సోమవారం నుంచి మూడో విడత సర్వే చేపట్టాలని చెప్పారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్ ను ఆదేశించారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మిషన్ భగీరథ ఎస్.ఈ వెంకటరమణ, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, టీఎస్ఎంఐడీసీ ఈఈ శరత్, తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
కేశవాపురం లిఫ్ట్కు శంకుస్థాపన
కరోనా కట్టడికే టీకాలు : మంత్రి నిరంజన్ రెడ్డి
లాక్ డౌన్ను పరిశీలించిన సీపీ మహేష్ భగవత్
సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సిన్తో కరోనా కట్టడి
సూపర్ స్ప్రెడర్స్ ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి
లాక్ డౌన్ అమలును పర్యవేక్షించిన డీఐజీ రంగనాధ్