నల్లగొండ : లాక్ డౌన్ మినహాయింపు సమయంలో ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోళ్లు చేయాలని డీఐజీ ఏవీ రంగనాధ్ సూచించారు. శుక్రవారం లాక్ డౌన్ అమలును ఆయన స్వయంగా పరిశీలించారు. నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్, తహసీల్దార్ కార్యాలయం వెనుక వైపు, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ రోడ్, విద్యానగర్, ఆర్టీసీ కాలనీ, పద్మావతి కాలనీతో పాటు మిర్యాలగూడ పట్టణంలో వివిధ ప్రాంతాలను ఆయన పర్యవేక్షించారు.
లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిని గుర్తించి వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ గల్లీలలో షాపులు తెరుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు.