బూర్గంపహాడ్, ఆగస్టు 03 : గంజాయి అక్రమ రవాణా కేసులో దోషులుగా తేలిని ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి సరిత సోమవారం తీర్పు వెలువరించారు. కేసు వివరాలిలా ఉన్నాయి. 2020 మార్చి 22న బూర్గంపహాడ్ అప్పటి ఎస్ఐ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి భారత్ బంద్ సందర్భంగా సారపాక బస్టాండ్ సెంటర్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హోండా స్కూటీపై అనుమానాస్పదంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులను నిలిపి తనిఖీ చేయగా వారి వద్ద 20 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితులను మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన బీమనపల్లి శ్రీనివాసులు, రావిరాల లక్ష్మినారాయణగా గుర్తించి అప్పటి ఏఎస్ఐ సోమేశ్వరరావు కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి సీఐలు నవీన్, సత్యనారాయణ దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో కోర్టు ఏడుగురు సాక్షులను విచారించి ఇద్దరు నిందితులపై అభియోగాలు రుజువు కావడంతో ఐదేళ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.25 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫణికుమార్ వాదనలు వినిపించగా కోర్టు నోడల్ అధికారి రాఘవయ్య, కోర్టు లైజన్ అధికారి ఎస్.వీరభద్రం, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సీపీ అక్రమ్ కేసు విచారణలో సమన్వయం చేసి సహకరించారు.