హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలకుగాను 48 మంది టీచర్లను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 2021- 22 విద్యాసంవత్సరానికి 48 మందిని ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. హెచ్ఎం క్యాటగిరీలో 10 మంది, స్కూల్ అసిస్టెంట్ క్యాటగిరీలో 20 మంది, ఎస్జీటీ/ టీజీటీ క్యాటగిరీలో 11 మంది, డైట్ లెక్చరర్ క్యాటగిరీలో ఒక్కరు, స్పెషల్ క్యాటగిరీలో ఆరుగురు ఎంపికయ్యారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల టీచర్లతోపాటు డైట్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులను కూడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించే గురుపూజోత్సవంలో వీరికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. రూ.10 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్ అందజేసి సన్మానించనున్నారు.