హుజూరాబాద్ : తెలంగాణలోని రజకుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వారి సంక్షేమం కోసం బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించామని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన రజక ఆశీర్వాద సభలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. అన్ని కులాల కోసం, ఆ వృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. రజకులకు 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో రజకులకు కార్పొరేషన్ లోన్లు ఇస్తామన్నారు. రజకులకు హైదరాబాద్లో 3 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు రూ. 5 కోట్ల నిధులు ఇచ్చి వారి ఆత్మగౌరవం నిలబెట్టామని పేర్కొన్నారు. బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలని, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాం. కానీ ఎలాంటి స్పందన లేదన్నారు. బీజేపీ విధానాల వల్ల రోజురోజుకు నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి అని మంత్రి హరీశ్రావు తెలిపారు.