మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
లక్షణాలు ఉన్న వారికి కిట్లు అందజేత
ఆదిలాబాద్ రూరల్, మే 8: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించే ఆరోగ్య సర్వేకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. జిల్లా కేంద్రంలోని 33వ వార్డులో మున్సిపల్, వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు చేస్తున్న ఇంటింటా ఆరోగ్య సర్వేను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే సంబంధిత మందులు ఇస్తామని తెలిపారు. ఒకవేళ తగ్గకపోతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వారికి ఇంటి వద్దనే చికిత్స అందిస్తామన్నారు. 45ఏళ్లు దాటిన వారు టీకా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అజయ్, మెప్మా టీఎంసీ భాగ్యలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
భుక్తాపూర్ కాలనీలో..
పట్టణంలోని భుక్తాపూర్లో మున్సిపల్ ఫ్లోర్లీడర్ బండారి సతీశ్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి సర్వే నిర్వహించారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
నార్నూర్, మే 8: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని గాదిగూడ మండల ప్రత్యేకాధికారి శివగణేశ్ పేర్కొన్నారు. గాదిగూడ మండలంలోని మేడిగూడ గ్రామంలో మండల పరిషత్, పంచాయతీ, వైద్య, ఐసీడీఎస్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబంలోని అందరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జ్వరపీడితులకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాదిగూడ వైస్ఎంపీపీ యోగేశ్, ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో సాయిప్రసాద్, హెచ్ఈవో రవీందర్, పంచాయతీ కార్యదర్శి రాములు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బోథ్, మే 8: మండలంలోని పలు గ్రామాల్లో వైద్యారోగ్య, పంచాయతీ రాజ్, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు ఇంటింటా సర్వే చేశారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఉన్నవారి పేర్లు నమోదు చేసుకొని మందులు అందజేశారు. రెండు రోజులుగా చేపట్టిన సర్వేలో వివిధ లక్షణాలతో బాధపడుతున్న 284 మందిని గుర్తించి మందులు అందజేశామని సొనాల పీహెచ్సీ డాక్టర్ నవీన్రెడ్డి తెలిపారు.
పూర్తి వివరాలు నమోదు చేయాలి
ఇంద్రవెల్లి, మే 8: ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కుటుంబాల పూర్తి వివరాలు నమోదు చేయాలని డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుద్ధనగర్లో ఇంటింటా సర్వే చేసి కుటుంబాల ఆరోగ్య వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో సీహెచ్వో రాథోడ్ బాబులాల్, వైద్యసిబ్బంది శ్రీనివాస్, పద్మ పాల్గొన్నారు.
ఇచ్చోడ, మే 8: కామగిరి గ్రామంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తున్న ఇంటింటా ఆరోగ్య సర్వేను జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. జ్వరంతో బాధపడుతున్న ఐదుగురిని గుర్తించి వారికి మెడికల్ కిట్లు అందజేశారు. సర్పంచ్ తొడసం భీంరావ్, అంగన్వాడీ టీచర్ అబేదాబీ, ఆశకార్యకర్త గంగాబాయి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సర్వేకు సహకరించాలి
ఎదులాపురం, మే 8: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలు కొవిడ్ సర్వేకు సహకరించాలని ఖుర్షీద్నగర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ శిల్ప కోరారు. జిల్లా కేంద్రంలోని ఖుర్షీద్నగర్లో ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు, సందేహాలు ఉన్నా వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 7382726029 కు ఫోన్ చేయాలని సూచించారు. పీహెచ్సీ సీవో ప్రశాంత్ దేశ్ పాండే, ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
బేల, మే 8: సాంగిడి, బెదోడ, మణియార్పూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండల ప్రత్యేకాధికారి శంకర్రావు పరిశీలించారు. సర్పంచ్లు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరికొండ, మే 8: రాంపూర్(బీ), రాంపూర్, వాయిపేట్, పొన్న, కుంటగూడ గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మందులు అందజేశారు. ఎంపీడీవో సురేశ్, పంచాయతీ కార్యదర్శి నాగభూషణ్ పాల్గొన్నారు.
నేరడిగొండ, మే 8: మండలంలోని 32 గ్రామ పంచాయతీల్లో 41 టీంలు సర్వే చేపడుతున్నట్లు తహసీల్దార్ శ్రీదేవి తెలిపారు. ఇంటింటికీ తిరుగుతూ టీం సభ్యులు వివరాలు సేకరిస్తూ నమోదు చేసుకుంటున్నారు. ఎవరికైతే జ్వరం ఉన్నట్లు తేలితే వారికి స్క్రీనింగ్ పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నారు.
భీంపూర్, మే 8: గోముత్రి, పలు గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు సర్పంచ్ నిమ్మ వేణుయాదవ్, కార్యదర్శి సందీప్ తెలిపారు. ఈ సర్వేను రెవెన్యూ శాఖ, మండల పరిషత్ అధికారులు, వైద్యాధికారి నీలోఫర్ పరిశీలించారు.
నార్నూర్,మే 8: గాదిగూడ మండలం పిప్రి, సావ్రి, ఝరి గ్రామాల్లో డాక్టర్ పవన్కుమార్ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది ఇంటింటా ఆరోగ్య సర్వే నిర్వహించారు. ఆయన వెంట ఆరోగ్య పర్యవేక్షుడు సంజయ్, నాయకుడు మెస్రం సోము ఉన్నారు.