బాన్సువాడ రూరల్, మార్చి 31: రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసును తీసుకున్నారు. మార్చి 3న మొదటి డోసును తీసుకున్న ఆయన రెండో డోసును బుధవారం వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాక్సిన్పై ప్రజలు అపోహలకు పోవద్దని, వ్యాక్సిన్ వేసుకోవడం అన్ని విధాలుగా క్షేమమని అన్నారు. బయోటెక్ వారి కోవ్యాక్సిన్ను తీసుకున్న తనకు ఇప్పటి వరకు ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న టీకాను వేయించుకోవాలని సూచించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజలు బయటికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, లెజిస్లేటివ్ సెక్రటరీ వి.నరసింహాచార్యులు ఉన్నారు.