ST Reservations | తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడ్డారు. గిరిజన బిడ్డలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుంచి రిజర్వేషన్ల పెంపు అమల్లోకి వస్తుంది. విద్య, ప్రభుత్వోద్యోగ నియామకాల్లో గిరిజనులకు ఈ రిజర్వేషన్లు అమలవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ నెల 17న జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేయడంతో సీఎం కేసీఆర్ మాట కట్టుబడి ఉన్నట్లు నిరూపించుకున్నారు. దీంతో రాష్ట్రంలో గిరిజనుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజనులకు అమలవుతున్న ఆరు శాతం రిజర్వేషన్ల విధానాన్నే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చింది.
రాష్ట్రంలో గిరిజనుల జనాభాకు అనుగుణంగా వారి రిజర్వేషన్ 10 శాతానికి పెంచాలని ఇంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించి.. రాష్ట్రపతి అనుమతి కోసం కేంద్రానికి పంపింది. ఏడేండ్లు దాటినా గిరిజనులకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలుపలేదు. ఈ బిల్లుపై కేంద్రం తన వైఖరిని నానుస్తూ వచ్చింది. దీంతో ఈ నెల 17న జరిగిన ఆత్మీయ సభలో ఇచ్చిన హామీకి అనుగుణంగా సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పలు దశాబ్దాలుగా అణచివేతకు, దోపిడీకి గురైన గిరిజన బిడ్డలకు న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 1994లో 50 శాతాన్ని దాటి 69 శాతానికి పెరిగిపోయిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత 28 ఏండ్లుగా తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లోనే ఉన్నాయి. తమిళనాడులో పెరిగిన రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ద్వారా కేంద్రం.. రాజ్యాంగ బద్ధత కల్పించింది. కానీ, తమ రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని పదేపదే తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా కేంద్రం పెడచెవిన పెట్టింది.
గిరిజన బిడ్డల సమస్యలు, జీవన స్థితిగతులపై అధ్యయనానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లప్ప కమిటీని నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా చెల్లప్ప కమిటీ గిరిజనుల గోడు విన్నది. పలువురు ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించింది. అటుపై గిరిజనుల అభివృద్ధి కోసం వారికి విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు పెంచడం ఒక్కటే పరిష్కార మార్గం అని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఇందిరా సావ్నేయ్ కేసులో రిజర్వేషన్లు 50 శాతం లోపే ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పరిమితి దాటి రిజర్వేషన్లు ఇవ్వవచ్చునని తెలిపింది. సీఎం కేసీఆర్ పలు ఇటువంటి ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నాకే గిరిజన బిడ్డలకు రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించారని అధికార వర్గాల కథనం. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులు అణచివేతకు, దోపిడీకి గురయ్యారు.
Read More :
యాదాద్రి అభివృద్ధికి రూ.43కోట్లు : సీఎం కేసీఆర్