Teachers FRS | పాపన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎఫ్ఆర్ఎస్ (Face Recognition System) ఉపాధ్యాయులకు చుక్కలు చూపెడుతుంది. ఒక్కోసారి బడికి వెళ్లగానే, బడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫొటో దిగడానికి ఎంత ప్రయత్నించినా ఫొటో రాక ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటల15 నిమిషాలకు పాఠశాల వదలగానే ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ఎస్ దిగడానికి ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేదు.
కొంతమంది టీచర్లు (Teachers) ఫొటో దిగడానికి ప్రయత్నించగా వెంటనే యాప్ కట్ కాగా, మరికొందరికి టూ మెనీ లాగిన్స్, మరికొందరికి సర్వర్ ఎర్రర్ అంటూ రాసాగింది. దీంతో ఉపాధ్యాయులు చాలాసేపు ఎఫ్ఆర్ఎస్ దిగడానికి ప్రయత్నించి విఫలమవడంతో కొంతమంది టీచర్లు ఫొటో దిగకుండానే ఇంటికి వెళ్లారు. పాపన్నపేట పాఠశాలలో 25 మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఈ పాఠశాలలోనే ఇలా జరిగితే మండల వ్యాప్తంగా ఇంకెన్ని పాఠశాలల్లో ఇలా ఎఫ్ఆర్ఎస్తో ఇబ్బందులు పడ్డారో. ఇలా జరగకుండా ప్రభుత్వం తగిన పరిష్కారం చూపాలని కోరుతున్నారు.