CM KCR | యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దంపతులు దర్శించుకున్నారు. అంతకు ముందు ప్రగతి భవన్ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకున్నారు. యాదాద్రిగుట్ట చుట్టూ వాహనంలో గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం సీఎం ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకొని, ఈ సందర్భంగా యాదాద్రి అభివృద్ధిపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ఆలయానికి అనుబంధంగా జరిగే నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఫోన్లో ఆదేశించారు.
వైటీడీఏకు 2157 ఎకరాల భూమిని రెవెన్యూశాఖ పూర్తిస్థాయిలో అప్పగిస్తుందని, దాని నిర్వహణను వైటీడీఏ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఈ భూమిలో ఆలయ అవసరాలు, పోలీస్శాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించాలని సీఎం సూచించారు. ఆలయ అర్చకులకు, సిబ్బందికి కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలను కేటాయించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
యాదాద్రిలో ఉన్న విలేకరులకు వైటీడీఏ బయటప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయించి, పట్టాలు పంపిణీ చేయాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు. యాదాద్రి టెంపుల్ టౌన్తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా ఉండాలని సీఎం అన్నారు. దాతలు కాటేజీల నిర్మాణం కోసం ఇచ్చే విరాళాలకు ఆదాయ పన్ను మినహాయింపునకు సంబంధించిన 80జీ అనుమతులు వెంటనే తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.
ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి కావాలని సీఎం అన్నారు. హెలిప్యాడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. యాదాద్రి ఆలయ వైభవానికి అనుగుణంగా వైటీడీఏ సమీపంలో జరిగే ప్రైవేట్ నిర్మాణాలకు, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే అధికారులు అనుమతులివ్వాలన్నారు. వైటీడీఏ పరిధిలో ఉన్న100 ఎకరాల అడవిని ‘నృసింహ అభయారణ్యం’ పేరిట అద్భుతంగా అభివృద్ధి చేయాలని, స్వామివారి నిత్య పూజలు, కల్యాణం, అర్చనలకు అవసరమైన పూలు, పత్రాలు ఆ అరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలసి సీఎం ఆదేశించారు.
50 ఎకరాల్లో అమ్మవారి పేరుమీద ఒక అద్భుతమైన కల్యాణ మండపం నిర్మాణం చేపట్టాలన్నారు. ఆలయం సహా రింగు రోడ్డు మధ్యలో ఏ ప్రాంతంలోనూ ఒక్క చుక్క నీరు నిలబడకుండా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు సహా ఇతర అన్నిచోట్ల ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టీసీ బస్టాండు, స్టామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
250 ఎకరాలలో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి, నాలుగు రకాల ఆధ్యాత్మిక డిజైన్లతో సుందరంగా, అద్భుతంగా నిర్మించాలని, వాటికి ప్రహ్లాద, యాద మహర్షి తదితర ఆలయ చరిత్రకు సంబంధించిన పేర్లను పెట్టాలని సీఎం సూచించారు. ఆలయ ఆదాయం, ఖర్చుల ఆడిటింగ్ వ్యవస్థ అత్యంత పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆలయ నిర్వహణ కోసం నిధులు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు.
మినీ శిల్పారామం తరహాలో ఒక మీటింగ్ హాల్, స్టేజీ, స్క్రీన్ ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు. అనంతరం ఆలయం వద్దకు చేరుకున్న సీఎం దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ గారి కుటుంబం తరఫున వారి మనమడు హిమాన్షు యాదాద్రీశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు సీఎం దంపతులను కుటుంబ సభ్యులను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కిలో బంగారం కోసం చెక్కును అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వామి వారి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం సీఎం కేసీఆర్ దంపతులు తమ కుటుంబం తరఫున ప్రకటించిన కిలో 16 తులాల బంగారానికి సంబంధించిన రూ.52.48 లక్షల చెక్కును సీఎం దంపతులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మనుమడు హిమాన్షు చేతుల మీదుగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఆలయ అధికారులకు అందజేశారు.
అలాగే, యాదాద్రి ఆలయ గోపురానికి బంగారు తాపడం కోసం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కిలో బంగారం కోసం రూ.50.15 లక్షల చెక్కును, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేంరెడ్డి నర్సింహరెడ్డి కిలో బంగారం కోసం రూ. 51లక్షల చెక్కును, ఏనుగు దయానంద రెడ్డి కిలో కిలో బంగారం కోసం రూ.50.04 లక్షల చెక్కును అధికారులకు అందజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయ ప్రాంగణంలో కలియదిరుగుతూ నిర్మాణాలపై పలు సూచనలు చేశారు.
యాదాద్రి పర్యటనలో సీఎం దంపతులతోపాటు, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గొంగిడి సునితా మహేందర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఆశన్నగారి జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సీఎం సెక్రెటరీ భూపాల్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, యాదాద్రి ఈఓ గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఆర్ అండ్ బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎండీ మనోహర్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.