Shijin Paul : దుబాయ్ (Dubai) లోని ఓ కార్ల షోరూమ్ (Car Showroom) లో గ్యాస్ సిలిండర్ (Gas Cylinder) పేలి భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కేరళ (Kerala) కు చెందిన షిజిన్ పాల్ (Shijin Paul) గా గుర్తించారు. తొలుత షోరూమ్ ప్రాంగణంలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బంది బయటకు పరుగులు తీశారు. కొందరు ఆ మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో షిజిన్ మృతిచెందగా మరో ఐదుగురు గాయపడ్డారు.
ఈ ప్రమాదంపై స్పందించిన భారత రాయబార కార్యాలయం.. మృతుడి కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన 27 ఏళ్ల షిజిన్ పాల్.. గత నవంబర్లోనే దుబాయ్కి వెళ్లాడు. కారు షోరూమ్లో మల్టీమీడియా మార్కెటింగ్ స్పెషలిస్టుగా చేరాడు. ఎనిమిదేళ్లుగా ప్రేమించిన అమ్మాయిని 2025 లో వివాహం చేసుకున్న అతడు.. త్వరలోనే తన భార్యను కూడా దుబాయ్కు తీసుకెళ్లాలని అనుకున్నట్లు స్నేహితులు తెలిపారు. ఇంతలోనే దారుణం జరిగిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.