BRS | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు రాజకీయ సమీకరణాల్లో సరికొత్త మార్పునకు కారణం అవుతున్నదా? పార్టీ, అభ్యర్థి సమస్థాయిలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీఆర్ఎస్ అనుసరించిన వ్యూహం ఆ పార్టీకి అడ్వాన్టేజ్గా మారి కాంగ్రెస్, బీజేపీలకు శరాఘాతంగా పరిణమించనున్నదా? టికెట్ల కేటాయింపులో కేసీఆర్ చూపిన వ్యూహచతురత వల్ల రెండు జాతీయ పార్టీలు ఆత్మరక్షణలో పడ్డాయా? అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 లోక్సభ స్థానాల్లో కేసీఆర్ ఈసారి ఆరుగురు బీసీలకు టికెట్లు కేటాయించారు.
చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కాసాని జ్ఞానేశ్వర్ (ముదిరాజ్), నిజామాబాద్ టికెట్ను బాజిరెడ్డి గోవర్ధన్ (మున్నూరుకాపు), జహీరాబాద్ టికెట్ను గాలి అనిల్కుమార్ (మున్నూరుకాపు), సికింద్రాబాద్ టికెట్ను తీగుళ్ల పద్మారావుగౌడ్ (గౌడ్), భువనగిరి టికెట్ను క్యామ మల్లేశ్ (యాదవ), హైదరాబాద్ స్థానాన్ని గడ్డం శ్రీనివాస్యాదవ్ (యాదవ) ఇలా ఆరు స్థానాల్లో ఆరుగురు బలమైన సామాజికవర్గాలకు చెందిన నాయకులకు కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి మూడు అసెంబ్లీ స్థానాల్లో ఒక స్థానాన్ని బీసీలకు కేటాయిస్తామంటూ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రకటించిన రేవంత్రెడ్డి.. ఆ మాట నిలబెట్టుకోకపోవడంతో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా ఈ లోటును భర్తీచేస్తామని కాంగ్రెస్ పార్టీ నమ్మబలికింది. తీరా మూడు స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించింది.
సికింద్రాబాద్ లోక్సభ స్థానాన్ని దానం నాగేందర్ (మున్నూరుకాపు)కు (అదీ బీఆర్ఎస్ నుంచి పిలిచి మరీ), మెదక్ నుంచి నీలం మధు (ముదిరాజ్)కు, జహీరాబాద్ స్థానాన్ని సురేష్షెట్కర్ (లింగాయత్)కు కేటాయించి చేతులు దులుపుక్నుది. ఇక బీజేపీ బీసీలకు ఐదు టికెట్లు ఇచ్చింది. ఇందులో నిజామాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్ స్థానాల్లో అభ్యర్థులుగా ఉన్న ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూశారు. ఈ ముగ్గురిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీయే కావడం విశేషం. మిగిలిన రెండు స్థానాల్లో భువనగిరి నుంచి పోటీచేస్తున్న బూర నర్సయ్యగౌడ్, జహీరాబాద్ నుంచి బరిలో నిలిచిన బీబీ పాటిల్ కూడా పూర్వాశ్రమంలో బీఆర్ఎస్వారే కావ డం గమనార్హం. దీంతో బీజేపీ సొంతంగా బీసీ నాయకులను తయారుచేసుకోలేదని, ఒకవేళ ఉన్నా వారికి అంతపెద్దగా గుర్తింపులేదనే చర్చ సాగుతున్నది. బీజేపీకి పైన లీడర్ బలం లేకపోవడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 60కి పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో గత పదేండ్ల అనుభవాన్ని, ప్రస్తుత టికెట్ల కేటాయింపు విషయంలో కేసీఆర్ చూపించిన దార్శనికత కాంగ్రెస్, బీజేపీల్లో కొరవడ్డ కారణంగా రాష్ట్రంలోని బీసీలు ఏకపక్షంగా బీఆర్ఎస్ వైపు వచ్చేశారని ఉదహరిస్తున్నారు.
తెలంగాణ రైతాంగ సాయుధపోరాట వీరు ల చరిత్ర భవిష్యత్తు తరాలకు వారధిగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కింది. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేలా శాశ్వత చర్య తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ వైపు బీసీలు నిలబడుతున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్, కొండా లక్ష్మణ్బాపూజీ పే ర్లు శాశ్వతంగా నిలిచి ఉండేలా, వారి స్ఫూర్తిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునేలా చేసిన ఘనత కేసీఆర్కు దక్కింది.
రాష్ట్రంలో 1.88 కోట్ల జనాభా ఉన్న బీసీలను కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయే తప్ప ఏనాడూ తమ బాగోగులు పట్టించుకోలేదని బీసీలు ఆ పార్టీలపై ఆగ్రహంతో ఉన్నారు. ఏడున్నర దశాబ్దాలుగా తమ బాగోగులు పట్టించుకోని ఈ రెండు పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాయి. కుల వృత్తులకు జీవం పోసిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ వెంటే తాము ఉంటామని బీసీ సంఘాల ప్రతినిధులు తెగేసి చెప్తున్నారు. తమది రాజకీయ పోరాటం కాదని, ఆత్మగౌరవ పోరాటమని బీసీలు స్పష్టం చేస్తున్న సన్నివేశాలు అనేక చోట్ల దర్శనమిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీని బడుగుల రాష్ట్ర సమితిగా రాష్ట్రంలోని వెనుకబడిన కులాలు కీర్తిస్తున్నాయి. రాష్ట్రంలో గవర్నర్ తరువాత ప్రోటోకాల్ పదవులైన శాసనమండలి చైర్మన్ (స్వామిగౌడ్), శాసనసభ స్పీకర్ (సిరికొండ మధుసూదనాచారి) పదవులే కాకుండా అనేకమందిని ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలు గా చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని బీసీలు గుర్తుచేస్తున్నారు. పార్టీలో అత్యంత కీలకమైన సెక్రటరీ జనరల్ స్థానాన్ని బీసీ వర్గాలకే కేసీఆర్ కేటాయిస్తూ ఆ వర్గాన్ని అందలం ఎక్కించడంలో వ్యూహచతురతను చాటుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసిన తీరే పార్లమెంటు ఎన్నికల్లో విజయదుందుభి మోగించే తొలి మెట్టు అయిందని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ అభ్యర్థులకు వస్తున్న ఆదరణే అందుకు నిదర్శనం అని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.