చేర్యాల, మే 9: రాహుల్గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా ఆదిబట్లలో ప్లాట్లు ఆక్రమించిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి ఓ కబ్జాకోరు అని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశం ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాత్రి చేర్యాల పట్టణంలో భారీ రోడ్ షో జరిగింది. ఈ సందర్భంగా క్యామ మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్లపాటు ప్రజలకు సుపరిపాలన అందించారని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన 5 నెలల్లోనే రాష్ట్రం ఆగమైందని చెప్పారు. కేసీఆర్ ఎంపీ టికెట్ల కేటాయింపులో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అత్యధిక జనాభా ఉన్న గౌడ, మాదిగ, గొల్లకురుమలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ ఇవ్వలేదని, పార్టీ మారిన దొంగలకు టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేసీఆర్ అడిగితే.. సీఎం రేవంత్రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని, బీఆర్ఎస్ నాయకులు తిట్టడం ప్రారంభిస్తే.. సీఎం బట్టలు ఊడిపోతాయని హెచ్చరించారు. కేసీఆర్ యాదాద్రిని నిర్మించి ఏనాడూ రాజకీయాల కోసం నర్సింహస్వామిని వాడుకోలేదని గుర్తుచేశారు. భువనగిరి ఎంపీలుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్, బూరనర్సయ్య ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమని, సామాన్య కుటుంబానికి చెందిన తనను ఆదరిస్తే ఎమ్మెల్యే పల్లాతో కలిసి ఈ ప్రాంత సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాష్ట్రంలోని ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.