CM KCR | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో రైతుల సంక్షేమం ఇమిడి ఉంటుంది. ఇందుకు తాజా ఉదాహరణ రేషన్కార్డుల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ హామీ. ఇది అమలైతే ఇటు పేదలకు అటు రైతులకు మేలు కలుగనున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 93 లక్షల తెల్ల రేషన్కార్డులు ఉండగా సుమారు మూడు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు.
ప్రతినెలా సన్న బియ్యం పంపిణీకి 1.83 లక్షల టన్నులు కావాలి. ఏడాదికి 21 లక్షల టన్నుల బియ్యం కావాలి. ఇందుకు 30 లక్షల టన్నులకుపైగా ధాన్యం అవసరం. ఈ మొత్తం ధాన్యాన్ని రైతుల నుంచే కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు వానకాలం సీజన్లోనే సన్నాలను సాగు చేస్తున్నారు. వీటిని మిల్లర్లు, వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. సన్నధాన్యానికి మద్దతుకు మించిన ధర పలుకుతున్నది. గత వానకాలంలో మద్దతు ధర క్వింటాలుకు రూ.2,060 ఉండగా మార్కెట్లో రూ.2,300 నుంచి రూ.2,500 వరకు లభించింది.
ఇక సన్న బియ్యం పంపిణీ నిర్ణయం తో ప్రభుత్వం కూడా సన్న ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో మార్కెట్లో సన్న బియ్యానికి మరింత డిమాండ్ పెరగడం ఖాయం. ఏటా సుమారు 35-40 లక్షల టన్నులను ఇతర రాష్ర్టాల వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. మరో 10 లక్షల టన్నులు రైతులు తమ అవసరాలకు ఉంచుకుంటారు. సన్న బియ్యం పంపిణీకి 30 లక్షల టన్నుల ధాన్యం అవసరం. ఈ లెక్కన 70-80 లక్షల టన్నుల సన్న ధాన్యానికి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50-60 లక్షల టన్నుల సన్న ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. ఈ సీజన్లో మద్దతు ధర రూ.2,203 కాగా దీనికి మించి బహిరంగ మార్కెట్లో రూ.3 వేలకుపైగా ధర పలికే అవకాశం ఉన్నదని వ్యాపారులు భావిస్తున్నారు. రైతులకు క్వింటా ధాన్యంపై కనీసంగా రూ.800 వరకు అధికంగా ధర దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రైతుల నుంచి యాసంగిలో దొడ్డు ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్తున్నది. ప్రతిసారీ యాసంగి సీజన్ వరి కోతకు రాగానే కేంద్రం పేచీ పెడుతున్నది. రైతులు వానకాలంలో సన్నాలు, యాసంగిలో దాదాపు దొడ్డు వడ్లు పండిస్తున్నారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ నిర్ణయంతో వాటికి డిమాండ్ పెరిగి, రైతులు దొడ్డు ధాన్యం సాగును బంద్ పెట్టి, సన్నాల సాగుకు మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నది. ఇదే జరిగితే రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీకి అవసరమైన సన్న ధాన్యం లభించడంతోపాటు కేంద్రంతో పంచాయితీ కూడా తెగిపోతుంది. రైతులు సన్నాలు సాగు చేస్తే ఆ ధాన్యం కొనుగోలుకు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. డిమాండ్ అధికంగా ఉండటంతో ఇటు ప్రభుత్వం, అటు మిల్లర్లు, వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తారనే అంచనాలున్నాయి.