ఆలేరు: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు రైతుల స్థితిగతులనే మార్చాయని అన్నారు. ఆలేరు ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. ఇదివరకు 20 ఎకరాల జాగా ఉన్నా పిల్లను ఇయ్యకపోయేదని, అటెండర్ ఉద్యోగం ఉన్నా ఇచ్చెటోళ్లని అన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయిందన్నారు. తెలంగాణలో భుముల విలువ పెరిగిపోవడంతో ఉద్యోగం లేకపోయినా సరే జాగా ఉంటే పిల్లను ఇస్తున్నరని చెప్పారు.
సీఎం ఇంకా ఏమన్నారంటే.. ‘ఆలేరులో సాగునీటి వసతులు పెరగడంతో హైదరాబాద్కు బతుక పోయినోళ్లు కూడా ఇప్పుడొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నరు. కరువుతో అల్లాడిన తెలంగాణ బాగుపడాంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలని నిర్ణయించినం. అందు కోసం ఏం చేయాలని బాగా ఆలోచించి రైతు బంధు పథకం తీసుకొచ్చినం. కానీ కాంగ్రెసోళ్లు రైతు బంధు పథకం అక్కర్లేదంటున్నరు. రైతు బంధు పథకం ఇస్తే కాంగ్రెస్ది ఏం పోయింది’ అని సీఎం ప్రశ్నించారు.
‘భూముల కిరికిరి లేకుండా ధరణిని తీసుకొచ్చినం. కానీ కాంగ్రెసోళ్లు ఆ ధరణిని కూడా తీసేస్తం అంటున్నరు. ధరణిని ఎత్తేస్తే రైతుబంధు ఎట్లొస్తది. భూముల రిజిస్ట్రేషన్లలో మళ్లీ అక్రమాలు మొదలైతయ్. ఇది ఆలోచించాలని మిమ్మల్ని కోరుతున్నా. ధరణి లేకపోతే అక్రమంగా ఒకరి పేరు మీది భూమి మరొకరి పేరు మీదకు మారుతది. ధరణి ఉంటే మీరు బొటన వేలు పెడితే తప్ప మీ పేరు మీది భూమిని ఇంకెవడూ తన పేరు మీదికి మార్చుకోలేడు’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
‘ధరణిని ఎత్తేయాలి, రైతుబంధు అక్కర్లేదు, 24 కరెంటు అవసరం లేదు అని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి. బాగా ఆలోచించి ఓటేయండి. ఎనకట ఆలేరు నుంచి హైదరాబాద్కు కూలి పనులకు పోయేటోళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మల్లన్నసాగర్ కట్టుకున్నం, త్వరలో బస్వాపూర్ ప్రాజెక్టును నింపుకోబోతున్నం. ఇక ముందు గంధమళ్ల చెరువు ఎప్పుడు చూసినా మత్తడి దుంకనుంది. అతి త్వరలోనే ఆలేరుకు సస్యశ్యామలమైన నీళ్లు రాబోతున్నయ్. చొల్లేరు వాగు, బిక్కేరు వాగు, శామీర్పేట వాగు మీద చెక్ డ్యామ్లు కట్టుకున్నం, ఇంకా 20, 30 చెక్ డ్యామ్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఆలేరు నియోజకవర్గంలో 20 వేల ఎకరాల భూమి మాత్రమే సాగయ్యేది. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో 2.16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. యాదగిరి గుట్ట అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలే. ఇప్పుడు యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నం’ అని సీఎం తెలిపారు.