అర్వపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో నూతన గ్రామ పంచాయితీగా ఏర్పడిన రామన్నగూడెం అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. ఉమ్మడి గ్రామపంచాయితీలో గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రామన్న గూడెంలో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. రైతుల కోసం రామన్నగూడెం గ్రామ శివారులో సూర్యాపేట-జనగాం రహాదారి వెంబడి రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం చేయడంతో 6 గ్రామాల రైతులకు రామన్నగూడెం గ్రామం వేదికగా మారింది. హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామమంతా పచ్చదనంతో కొత్త శోభ సంతరించుకుంది.
నాడు ఆవాస గ్రామం నేడు ఆదర్శ గ్రామం
2017కు ముందు రామన్నగూడెం గ్రామం జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయితీ పరిధిలో రామన్నగూడెం ఆవాస గ్రామంగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం నూతన గ్రామపంచాయితీల ఏర్పాటులో భాగంగా కొత్త గ్రామపంచాయితీగా ఏర్పడిన రామన్నగూడెం నేడు అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా మారింది. రామన్నగూడెం గ్రామపంచాయితీ పరిధిలో కొత్తగూడెం, చాకలిగూడెం ఆవాస గ్రామాలుగా ఉన్నాయి. నూతన గ్రామపంచాయితీగా ఏర్పాటైన తర్వాత ఆవాస గ్రామాలు సైతం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి.
మిషన్ భగీరథ ద్వారా గ్రామంలో ప్రతి ఇంటికీ కృష్ణా జలాలు అందుతున్నాయి. గ్రామ పంచాయితీ మొట్టమొదటి సర్పంచ్ గా ఎన్నికైన రమావత్ పీరమ్మ శీనయ్యనాయక్ రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ అ నేక అభివృద్ధి పనులను చేపట్టారు. పల్లెప్రగతిలో భాగంగా గ్రామానికి ఒక ట్రాక్టర్తో పాటు వాటర్ ట్యాంకర్ వచ్చింది. దీం తో ప్రతిరోజు ఉదయాన్నే చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తుండడంతో వీధులన్నీ పరిశుభ్రంగా మారాయి.
హరితహారంలో భాగంగా గ్రామశివారులోని సూర్యాపేట-జనగాం రహాదారి వెంబడి నాటిన మొక్కలు పచ్చదనాన్ని పంచుతున్నాయి. నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డు ఏర్పాటు చేసి ప్రతిరోజు సంరక్షణ చర్యలు చేపడ్తున్నారు. గ్రామపంచాయితీ ట్రాక్టర్, వాటర్ట్యాంకర్ ద్వారా మొక్కలకు నీరు సరఫరా చేస్తున్నారు.
గ్రామంలో జరిగిన అభివృద్ది పనులు
22 లక్షల రూపాయల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం
13 లక్షల రూపాయల వ్యయంతో వైకుంఠధామం నిర్మాణం
50 లక్షల రూపాయలతో 3 ఓవర్హెడ్ వాటర్ట్యాంకులు, ఒకటి అండర్గ్రౌండ్ వాటర్ట్యాంకు నిర్మాణం.
3 లక్షల రూపాయలతో రామన్నగూడెం, కొత్తగూడెం గ్రామాలలో బతుకమ్మ వేదికల నిర్మాణం
9 లక్షల రూపాయలతో 3 పల్లె ప్రకృతివనాల ఏర్పాటు
2 లక్షల రూపాయలతో డంపింగ్యార్డు నిర్మాణం