2021 యాసంగి సీఎంఆర్ సేకరణ తీవ్ర ప్రహసనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం, దాని పరిధిలోని భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) పూటకో తీరుగా వ్యవహరిస్తుండడంతో క్షేత్రస్థాయిలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రారంభ నుంచే కొర్రీల మీద కొర్రీలు పెడుతూ వచ్చిన ఎఫ్సీఐ తాజాగా ఫోర్టిఫైడ్ రైస్(పోషకాహార బియ్యం) పేరుతో మరో నిబంధన విధించింది. అర్ధాంతరంగా తెచ్చిన నిబంధనతో మరోసారి సీఎంఆర్ సేకరణపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటి వరకు ఇచ్చినది కాకుండా సీఎంఆర్ ఇవ్వాల్సిన మిగిలిన బియ్యంలో సగం ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తేనే మొత్తం బియ్యాన్ని తీసుకుంటామని గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అధికారులు, మిల్లర్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలంటే రైస్ మిల్లుల్లో అందుకు సంబంధించిన యంత్రాలను బిగించాల్సి ఉంటుంది. ఇది అదనపు భారంగా మారడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు కేంద్ర ప్రభుత్వం, ఎఫ్ఐసీ తీరుపై భగ్గుమంటున్నారు.
నల్లగొండ ప్రతినిధి, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : యాసంగి సీజన్లో రాష్ట్రంలోని రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం, ఎఫ్సీఐ కొత్త కొర్రీలతో మోకాలడ్డుతూనే ఉన్నాయి. సీజన్ ప్రారంభంలో సీఎంఆర్ సేకరణలో పరిమితులు విధిస్తూ కొంతకాలం జాప్యం చేసింది. సీఎంఆర్ సేకరణ మొదలయ్యాక… ప్రైవేటు గోదాములను తీసుకోకుండా ఉన్న గోదాములను ఫుల్గా నింపి, అవసరమైన రైల్వే ర్యాక్లను సకాలంలో తెప్పించకుండా బియ్యం లారీలను దిగుమతి చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పరిస్థితి కొంత గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో తాజాగా మరో కొత్త నిబంధన తెచ్చిపెట్టింది. బలవర్ధకమైన బియ్యమే ఇవ్వాలంటూ.. ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తేనే సీఎంఆర్ సేకరిస్తామంటూ ఈ నెల 21న జీఓ జారీ చేసింది. దాంతో సీఎంఆర్ సేకరణలో మళ్లీ తీవ్ర జాప్యం ఏర్పడే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగిలో 62.52 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ను సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు 78 శాతంతో 48.50 లక్షల మెట్రిక్టన్నులను ఎఫ్సీఐ సేకరించింది. మరో 14లక్షల పైచిలుకు మెట్రక్ టన్నుల సీఎంఆర్ను తీసుకోవాల్సి ఉంది. అందుకు మార్చి 31వ తేదీని తుది గడువుగా విధించింది. కానీ 14 లక్షల్లో సగం అంటే 7లక్షల మెట్రిక్ టన్నులను ఫోర్టిఫైడ్ రైస్లా ఇస్తేనే మొత్తాన్ని సేకరిస్తామని మెలిక పెట్టింది. దాంతో అధికారయంత్రాంగం, రైస్మిల్లర్లలోనూ కలకలం మొదలైంది.
ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాలంటే రైస్మిల్లర్లు కొత్త టెక్నాలజీని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి యంత్రాలను ప్రత్యేకంగా కొనుగోలు చేసి బిగించుకోవాలి. రైస్మిల్లుల సామర్థ్యాన్ని బట్టి కనీసం రూ.3 నుంచి రూ. 8లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఒక వేళ వీటిని ఇప్పటికిప్పుడు కొనుగోలు చేద్దామన్నా.. అవసరమైన యంత్రాలు మార్కెట్లో లభించడం కష్టమని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇవన్నీ సమకూర్చుకోవడం సాధ్యం కాదని మిల్లర్లు అభిప్రాయపడుతున్నారు. ఇవి సమకూర్చుకోకపోతే ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దాంతో ఈ నిబంధన మరోసారి సీఎంఆర్ సేకరణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికారుల లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లాలో మొత్తం 110 రైస్మిల్లుల నుంచి సీఎంఆర్ సేకరణ జరుగుతుండగా ప్రస్తుతం కేవలం 10 మిల్లులకు మాత్రమే ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చే సదుపాయం ఉంది. మిగతా వంద మిల్లుల వరకు కొత్తగా యంత్రాలను ఏర్పాటు చేసుకుంటే తప్ప మిగిలిన సీఎంఆర్ సేకరణ సాధ్యం కాదు. దీనిపై రెండు రోజుల కిందట జిల్లా అధికారులు రైస్మిల్లర్స్ అసోసియేషన్తో సమావేశం నిర్వహించి సాధ్యమైనంత త్వరగా ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేయక తప్పలేదు.
నెల రోజులుగా గాడిలో పడిందనుకుంటున్న సీఎంఆర్ సేకరణ ఫోర్టిఫైడ్ నిబంధనతో మళ్లీ మొదటి కొచ్చింది. దాంతో వానకాలంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్గా ఇవ్వడంపైనా తీవ్ర ప్రభావం పడనున్నది. నల్లగొండ జిల్లానే పరిశీలిస్తే గత యాసంగిలో మొత్తం 851076 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయగా దాని నుంచి 5,77,027 మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి కానుంది. దీనిని కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్)గా ఎఫ్ఐసీ ద్వారా కేంద్రం సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు 88 శాతంతో 5 లక్షల మెట్రిక్ టన్నులను ఎఫ్సీఐ సేకరించింది. మిగిలిన సుమారు 70వేల మెట్రిక్ టన్నుల బియ్యంలో సగం ఫోర్టిఫైడ్ రైస్గా ఇస్తేనే తీసుకుంటామని స్పష్టం చేసింది. యాసంగిలో సూర్యాపేట జిల్లాలో 35శాతం, యాదాద్రిభువనగిరిలో 29 శాతం సీఎంఆర్ పెండింగ్లో ఉంది. వీటిల్లోనూ సగభాగం ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వకపోతే ఇబ్బందులు తప్పవు. ఇదే జరిగితే వానకాలంలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ చేయడంలో ఇంకా తీవ్ర జాప్యం జరుగనున్నది. తాజాగా ఎఫ్సీఐ పెట్టిన నిబంధనతో సీఎంఆర్ సేకరణ తీవ్ర ప్రహసనంగా మారనున్నదనే విషయం స్పష్టమవుతోంది.
పలు విటమిన్లు, ప్రోటీన్లతో కూడిన గింజలను సాధారణ బియ్యంలో కలిపి ఇవ్వడమే ఫోర్టిఫైడ్ రైస్. 100 కిలోల బియ్యంలో కేజీ ఫోర్టిఫైడ్ గింజలను కలిపి బస్తాలను ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఈ గింజలను సివిల్ సైప్లె కార్పొరేషన్ ద్వారా మిల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే అందించనుంది. అయితే సాధారణ బియ్యంలో ఇవి కలుపాలంటే రైస్మిల్లుల్లో అదనంగా మరో యంత్రాన్ని బిగించాల్సి ఉంటుంది. లేని పక్షంలో మిల్లర్లు ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రంలోని మెజార్టీ రైస్మిల్లుల్లో ఈ వ్యవస్థ లేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి విధానం లేకపోవడంతో రైస్మిల్లర్లు కూడా ఈ విషయమై దృష్టి సారించలేదు. ఉన్నట్టుండి సీజన్ మధ్యలో ఫోర్టిఫైడ్ నిబంధన పెట్టడం మిల్లర్లలో ఆందోళన కలిగిస్తున్నది
ఫోర్టిఫైడ్ రైస్ తప్పనిసరి చేశారు యాసంగి సీఎంఆర్ సేకరణలో ఎఫ్సీఐ ఇటీవలే ఫోర్టిఫైడ్ రైస్ నిబంధనను విధిస్తూ ఈ నెల 21న ఉత్వర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలో ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చే టెక్నాలజీ, అదనపు యంత్రాలు చాలా రైస్మిల్లుల్లో లేవు. వీటిని సమకూర్చుకోవాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పటివరకు సీఎంఆర్ సేకరణకు ఇబ్బందే. ఈ నెల 31 నాటికి యాసంగి సీఎంఆర్ పూర్తి చేయాల్సి ఉంది. తాజా నిబంధనతో సీఎంఆర్ సేకరణపై ప్రభావం తప్పదు. వానకాలం ధాన్యం కూడా సీఎంఆర్కు రెడీగా ఉంది.
-వి.వెంకటేశ్వర్లు, జిల్లా సివిల్సప్లయ్ అధికారి, నల్లగొండ.