సూర్యాపేట : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన మాజీ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు గుండగాని అనిల్ గౌడ్, చిటుపాక కమలాకర్, కుంభం మల్లయ్య, అశోక్, కటికిరెడ్డి సంపత్ యాదవ్, పిట్టల నరేష్, రావులపల్లి వెంకన్న, అర్.నరేష్, దినేష్, వెంకటేష్, గట్ల లక్ష్మణ్, అనిల్, సతీష్, మురళి, రాజు, ప్రవీణ్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ వేల కోట్ల నిధులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దీంతో ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కడుతుండడంతో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. ఉనికి కోల్పోయిన ప్రతిపక్షాలు రానున్న రోజుల్లో కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు.