తుంగతుర్తి : గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడమే పల్లె ప్రగతి లక్ష్యమని జెడ్పీ చైర్ పర్సన్ దీపిక, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో శుక్రవారం ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొక్కలు నాటి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామాల్లో పాత బావులు, కరెంటు సమస్యలు, రోడ్డు, మురికి కాలువలు, వీధి దీపాలు ఏర్పాటు చేసుకొని అధికారుల సహకారంతో సమస్యలను పరిష్కరించుకొని గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, ఎంపీపీ గుంగాని కవిత, తాసిల్దార్ రామ్ ప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.