సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చార్జింగ్ ట్రైసైకిళ్లు, ల్యాప్ ట్యాప్లు, స్మార్ట్ఫోన్లు
ఉన్నత అభ్యాసకులకు టీవీఎస్ జూపిటర్లు
పెద్దపల్లి జిల్లాకు చేరిన 235 చార్జింగ్ బైస్కిల్స్
534 మందికి పైగా లబ్ధిదారులు
నేడు మొదటి దఫా అందించేందుకు ఏర్పాట్లు
పెద్దపల్లి, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు రాష్ట్ర సర్కారు అండగా ఉంటున్నది. అనేక పథకాలతో ధీమా కల్పిస్తూనే, నెలనెలా పింఛన్తో భరోసా ఇస్తున్నది. మానసిక స్థితితోపాటు చేతులు బాగుండి కాళ్లు సరిగ్గాలేక నడవలేని స్థితిలో ఉన్న అసహాయులకు పైసా ఖర్చు లేకుండా చార్జింగ్ ట్రై సైకిళ్లు ఇవ్వబోతున్నది. ఇక ఉన్నత విద్యాభ్యాసం చేసేవారికి జూపిటర్ వాహనాలు, కదల్లేనివారికి బ్యాటరీ వీల్ చైర్లు, విద్యార్థులకు ల్యాప్ టాప్లు, 4జీ స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు, క్యాలిపర్ స్టిక్స్, ఇతర వినికిడి, దృష్టిలోపం కలిగిన వారికి యంత్రాలను ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో కార్యాచరణ పూర్తయింది. గత ఫిబ్రవరిలో పెద్దపల్లిలో జరిగిన అలీమ్ కో (ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ ద్వారా నిర్వహించిన క్యాంపులో అర్హులను గుర్తించారు. అందులో 235 మందికి చార్జింగ్ ట్రై సైకిళ్లు, ఉన్నత విద్యాభ్యాసం చేసే 26 మందికి జూపిటర్ వాహనాలు, 12 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఇండ్లలో ఉండి ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్న 19 మందికి చార్జింగ్ వీల్ చైర్స్ను మంజూరు చేశారు. అలాగే, మరో 30 మందికి కృత్రిమ అవయవాలు, 32 మందికి క్యాలిపర్స్టిక్స్, 180 మందికి వినికిడి యంత్రాలతోపాటు కంటిచూపులేని వారికి మంచి నాణ్యమైన చేతికర్రలను పంపిణీ చేసేందుకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే చార్జింగ్ ట్రైసైకిళ్లు జిల్లా కేంద్రంలోని బాలరక్షా భవన్కు చేరుకున్నాయి. మిగతా జూపిటర్ వాహనాలు, వీల్చైర్స్, కృత్రిమ అవయవాలు, తదితర పరికరాలు మంజూరై ఉండగా, శనివారం మొదటి దఫా పంపిణీ చేయనున్నారు.
వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాట్లు
పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 9 : దివ్యాంగులకు శనివారం సహాయ ఉపకరణాలను అందించేందుకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి పీ లక్ష్మీరాజం తెలిపారు. రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధితో పాటు, ధర్మారం మండలానికి చెందిన దివ్యాంగుల్లో 2021 అలీంకో క్యాంపునకు హాజరైన వారికి మాత్రమే అందించనున్నామని పేర్కొన్నారు. 2019-20లో జరిగిన అలీంకో క్యాంపులో ఎంపికైనవారికి తర్వాత దశలో అందిస్తామని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
భారీగా లింక్డ్ ఇన్ డేటా లీక్.. ఫర్ సేల్ ఇన్ డార్క్నెట్?
రైలు సర్వీసులు తగ్గించం.. రైల్వే బోర్డు