Mother | కురుక్షేత్ర సంగ్రామం దాదాపు ముగిసింది. దుర్యోధనుడి ప్రేరణతో అశ్వత్థామ పాండవుల అంతానికి పంతం పూనాడు. నిద్రిస్తున్న ఉప పాండవులను నిద్దట్లోనే సంహరించాడు. అభిమన్యుడి భార్య ఉత్తర గర్భిణి. ఆమె గర్భంలో ఉన్న వంశాంకురాన్ని కడుపులోనే తుంచేయాలని అనుకున్నాడు. ఏకంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రభావంతో ఉత్తర తల్లడిల్లి పోయింది. ఆమె గర్భంలో ఉన్న శిశువు అగ్నికీలల మధ్యచిక్కుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ చలువతో ఉత్తర గర్భం నిలబడింది. ఆమె కడుపున పరీక్షితుడు సురక్షితంగా జన్మించాడు. ఇది పురాణ గాథ! ఆనాడంటే ఉత్తర గర్భాన్ని కాపాడేందుకు శ్రీకృష్ణుడు ఉన్నాడు. మరి ఇప్పుడు పుట్టబోయే బిడ్డకు అమ్మే అండాదండా అన్నీ!
అమ్మ కడుపు చల్లగా ఉండాలంటే.. ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలి. పొత్తిళ్లలో పండంటి బిడ్డను ఎత్తుకోవాలంటే.. కాబోయే తల్లి ఒత్తిళ్లను సమర్థంగా అధిగమించాలి. ఎందుకంటే, అమ్మ ఆందోళన చెందితే ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు బెంబేలెత్తిపోతుంది. అమ్మ కంటతడి పెడితే.. పుట్టబోయే బిడ్డా పుట్టెడు దుఃఖాన్ని అనుభవిస్తుంది. అమ్మ నవ్వితే బొజ్జలో ఉన్న బుజ్జాయీ నవ్వులు రువ్వుతుంది. అమ్మ ఆనందిస్తే.. శిశువు స్పందనలు విస్పష్టంగా ఉంటాయి. ‘గర్భ’ ఆలయంలో శిశువు దినదిన ప్రవర్ధమానం చెందాలంటే.. అమ్మ తన ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అందుకు అనువైన వేదిక కల్పిస్తున్నది రామకృష్ణ మఠం వివేకానంద ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్న ‘ఆర్యజనని’. కాబోయే తల్లి జీవనశైలిని ప్రభావితం చేయడం ద్వారా పుట్టబోయే బిడ్డలకు రక్షణ కల్పిస్తున్నది. గర్భిణులు ఏ విధంగా ఉండాలి, ఏమి ఆచరించాలో వివరిస్తున్నదీ కార్యక్రమం. ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వడానికి కావలసిన జ్ఞానాన్ని తల్లికి అందజేస్తున్నది.
శిశువు మహోన్నత వ్యక్తి కావాలంటే.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంస్కారం అందాలి. పిండం రూపంలో ఉన్న బిడ్డ ఏం నేర్చుకోగలడు అన్న సంశయం వద్దు! ప్రహ్లాదుడు తన తల్లి కాయాధు గర్భంలో ఉండగానే నారాయణ మంత్ర ప్రభావానికి లోనయ్యాడు. నారదుడు చెప్పిన శ్రీహరి నామ మహిమను అర్థం చేసుకొని లోకోత్తర భాగవతోత్తముడిగా కీర్తి గడించాడు. సుభద్ర గర్భంలో ఉండగానే అభిమన్యుడు ‘పద్మవ్యూహ’ రహస్యం తెలుసుకున్నాడు. గర్భంలో ఉన్న బిడ్డ ఒక అచేతనమైన మాంసఖండం కాదు. బయట ఉండే పరిస్థితుల ప్రభావం పిండంపై ఉంటుందనడానికి శాస్త్రీయ ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా తల్లి ఆలోచనలు, భావోద్వేగాలు గర్భస్థ శిశువును శాసిస్తాయి అనడంలో సందేహం లేదు. తల్లిలో ఉండే ధనాత్మక వైఖరి పిల్లలకు రక్షణగా నిలిస్తే… ఆమె భయాందోళనలు శిశువు పాలిట శాపాలుగా పరిణమిస్తాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని కాబోయే అమ్మను జాగ్రత్తగా చూసుకోవడం కుటుంబసభ్యులందరూ బాధ్యతగా భావించాలి. తల్లి భావోద్వేగాలకు గురైతే బిడ్డ భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది.
పెళ్లయిన నాటి నుంచి ప్రతి స్త్రీ మూర్తి అనుక్షణం అమ్మనయ్యే అదృష్టం ఎప్పుడెప్పుడు వరిస్తుందా అని ఎదురుచూస్తుంది. ఆ శుభఘడియ రాగానే.. ప్రపంచాన్నే గెలిచేసినంత సంబరపడుతుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి నవమాసాల వ్రతానికి సిద్ధపడుతుంది. తల తిరిగినా, వేవిళ్లు వచ్చినా, మధుమేహం ప్రమాదం పొంచి ఉన్నా.. అన్నిటినీ నిండుమనసుతో స్వీకరించడానికి సిద్ధపడుతుంది తల్లి. నెల నెలకూ శరీరంలో చోటు చేసుకునే మార్పులను సాదరంగా స్వాగతిస్తుంది. రెప్పపాటు కాలం కూడా దించలేని బరువును అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతూ కాలం గడుపుతుంది. ఆచితూచి అడుగులు వేసినా, నిదానంగా మాట్లాడినా, ప్రశాంతంగా నవ్వినా అన్నీ తనలో రూపుదిద్దుకుంటున్న చిన్నారి బాగు కోసమే! ‘సంస్కారవంతులైన, దైవంపై భక్తిశ్రద్ధలు కలిగిన తల్లులు ఉన్న ఇంట్లోనే ఉన్నతమైన వ్యక్తులు జన్మిస్తారు’ అన్న స్వామి వివేకానంద మాట అక్షర సత్యం. బిడ్డ సమగ్ర వికాసానికి గర్భం వేదిక అవుతుంది. బిడ్డ కడుపులో ఉండగా తల్లి నుంచి అందే సంస్కార సంపదపైనే ఆ శిశువు గుణగణాలు ఆధారపడి ఉంటాయి. చరిత్రలో ఉన్నతులైన వ్యక్తులను పరిశీలిస్తే.. వారి తల్లులు అందరూ గొప్ప వ్యక్తిత్వం కలిగినవారని స్పష్టంగా తెలుస్తుంది. దైవంపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం వారికే కాదు, వారి గర్భంలో జన్మించిన శిశువుకూ శ్రేష్ఠతను కలుగజేస్తుంది. శిశువు గర్భంలో ఉన్నప్పుడు భగవత్ ఆరాధన, ప్రార్థనకు సమయం కేటాయించడం చాలా అవసరం. తద్వారా సంస్కారవంతులైన బిడ్డలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. కోల్కతాకు చెందిన భువనేశ్వరీదేవి మహాశివభక్తురాలు. నిరంతరం శివ ధ్యానంలోనే కాలం గడిపేది. అందుకే, ఆమె కడుపున పుట్టిన నరేంద్రుడు వివేకానందుడై ఆధ్యాత్మిక జ్యోతిగా వెలుగొందాడు. ఆయన వేసిన ప్రతి అడుగూ హైందవ ధర్మం ఔన్నత్యానికి దారి చూపింది. జగత్తుకు మార్గనిర్దేశనం చేసే పుత్రుడు కలగాలన్న భువనేశ్వరీదేవి సంకల్పమే నరేంద్రుడి జన్మకు మూలకారణంగా చెప్పవచ్చు.
మనిషిపై సత్త, రజో, తమో గుణాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. సత్త గుణం ప్రశాంతతకు, జ్ఞానానికి ప్రతీక. రజోగుణం కోరిక, తాపత్రయం, అశాంతిని రగిలిస్తుంది. తమోగుణం నిద్ర, మోహం, అలసత్వాన్ని పెంపొందిస్తుంది. ఈ మూడు గుణాలు మనిషి మానసిక, బుద్ధి స్థాయిలను ప్రభావితం చేస్తుంటాయి. ఈ త్రిగుణాల నిష్పత్తిలో మార్పులు మనిషి వివిధ ప్రవర్తనలకు కారణం అవుతాయి. ఇంకాచెప్పాలంటే మనిషి గతిని, అభివృద్ధిని ఇవి నిర్దేశిస్తాయి.
గర్భిణి సత్త గుణాన్ని పెంపొందించుకోవాలి. రజస్తమో గుణాలు పెరిగితే పుట్టబోయే బిడ్డకూ అవే అవలక్షణాలు సంక్రమించే ప్రమాదం లేకపోలేదు. మరి సత్త గుణాన్ని పెంచుకునే మార్గం ఏమిటి? శరీరాన్ని సమస్థితిలో ఉంచుకోవాలి. మంచి ఆలోచనలు పెంపొందించుకుంటూ, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సత్సంగాలలో పాల్గొనడం అవసరం. తద్వారా శిశువుకూ ప్రేరణ కలుగుతుంది. సజ్జన సాంగత్యం దుర్గుణాలను దూరం చేస్తుంది. భక్తి భావనలు పెంచే పాటలు వినడం, పుస్తకాలు చదవడాన్ని ‘స్వాధ్యాయం’ అంటారు. స్వాధ్యాయంతో సహృదయులైన సంతానం కలుగుతుంది. ప్రార్థనల ప్రభావం కూడా అమ్మ కడుపులో ఉండగానే శిశువుపై ఉంటుంది. ఆధునిక విజ్ఞానం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నది.
లయాత్మకంగా సాగే భజనలు, సంకీర్తనలు శిశువులో మంచి కదలికలకు కారణం అవుతాయి. తల్లి నిద్రలో కనే కలలు సైతం గర్భస్థ శిశువును ప్రేరేపిస్తాయి. రజో, తమో గుణాలకు గురైన వారికి పీడకలలు కలుగుతాయి. ఆ కలల తాకిడి శిశువును ఆందోళనకు గురిచేస్తుంది. సత్త గుణం పెంపొందించుకోగలిగితే సుస్వప్నాలు కలుగుతాయి. గుండె గుడిలో ఆధ్యాత్మిక తరంగాలు మార్మోగుతాయి. ఆ శబ్దతరంగాలు శిశువు చెవిని సోకి ప్రశాంతతను కలిగిస్తాయి. శిశువు దైవీసంపత్తితో పుట్టాలంటే, సద్గుణ సంపన్నుడు కావాలంటే తల్లి తనను తాను సంస్కరించుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సాత్వికాహారం తినాలి. కంటి నిండా నిద్రపోవాలి. పరిశుభ్రతను పాటించాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా ఒత్తిడిని జయించాలి. తనను తాను ఒక భక్తురాలిగా మలుచుకోవాలి. ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలి. ఇవన్నీ పాటిస్తే.. కాన్పు తేలిక అవుతుంది. పండంటి బిడ్డకు జన్మనివ్వడమే కాదు, సమాజానికి సంస్కారవంతమైన వ్యక్తిని అందించిన మాతృమూర్తిగా శాశ్వతకీర్తిని పొందుతారు. కడుపులో బిడ్డకు రక్షణ కల్పించే విధానాలు, గర్భంలో ఉండగానే శిశువు ధార్మిక సంస్కారం నేర్పించే కార్యక్రమాలు ‘ఆర్యజనని’ నిర్వహిస్తున్నది. ఇందులో పాల్గొనదలచిన వాళ్లు మరిన్ని వివరాల కోసం https://aaryajanani.org/ వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
గర్భస్థ శిశువుకు గత జన్మ జ్ఞానం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. తల్లి గర్భంలో ఉమ్మనీరులో ఈదుతూ, మలమూత్రాల్లో గింగిరాలు కొడుతున్న శిశువు ‘అయ్యో! గతజన్మలో చేసిన పాపం కారణంగా మళ్లీ పుట్టాల్సి వస్తుంద’ని ఆందోళనకు గురవుతుందట. అదే సమయంలో తనకు జన్మనివ్వబోతున్న తల్లి దైవసేవలో తరిస్తుంటే.. ‘ఏ పుణ్యఫలమో గొప్ప భక్తురాలి కడుపున పుట్టేందుకు దోహదం చేసింద’ని సంతోషిస్తుందట. అయితే, జన్మించిన తర్వాత బొడ్డుపేగు తెగడంతో.. గతజన్మ జ్ఞాపకాలన్నీ మాయమవుతాయి. కానీ, గర్భంలో ఉండగా ఆ తల్లి ఆచరించిన విధులు మాత్రం ఆ బిడ్డకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. ఉన్నతమైన వ్యక్తిగా సంస్కరిస్తాయి. సంస్కృత భాష గొప్పదనాన్ని చాటి చెబుతున్న విదేశీయురాలు గాబ్రియేలా బుర్నెల్ తనకు స్ఫూర్తి అమ్మే అంటుంది.
‘నేను గర్భంలో ఉండగా మా అమ్మ దేవనాగరి లిపి నేర్చుకుందట. ప్రతిరోజూ సంస్కృత శ్లోకాలు, ఉపనిషత్ మంత్రాలు వినేదట. సంస్కృతంపై నా అభిమానానికి అదే కారణం కావొచ్చు’ అని చెప్పుకొచ్చింది బుర్నెల్. సంస్కృత శ్లోకాలను బుర్నెల్ ఉచ్ఛరించే తీరు చూడముచ్చటగా, వినసొంపుగా ఉంటుంది. గర్భస్థ శిశువుకు 14 వారాల నుంచి వినికిడి సామర్థ్యం కలుగుతుంది. ఆ సమయంలో తల్లి పలికే మాటలు ఆ శిశువు చెవికి చేరుతాయి. వాటికి అర్థం తెలియకపోయినా.. ఆ శబ్దాల్లోని తీవ్రత, గాఢత శిశువు కదలికలపై ప్రభావం చూపుతాయి. అందుకే మన పెద్దలు గర్భిణిని మృదువైన సంగీతం వినమంటారు. రామాయణం, భాగవతం, భక్తుల గాథలు, సాహిత్య విలువలు ఉన్న గ్రంథాలు చదవమని ప్రోత్సహిస్తుంటారు. అలా వినడం, చదవడం వల్ల గర్భంలో ఉండగానే శిశువుకు సంస్కారం అలవడుతుంది. అంతేకాదు, భారీ శబ్దాలు ఆమె చెవిన పడకుండా చూసుకుంటారు. ఈ విషయాలన్నిటినీ ‘ఆర్యజనని’ కాబోయే తల్లులకు వివరంగా అర్థం చేస్తుంది. ప్రత్యేక సెషన్లు నిర్వహిస్తూ శిశువు మేలుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తుంది.
గర్భం దాల్చిన స్త్రీమూర్తి తన కడుపులో దైవాంశ పెరుగుతున్నదన్న భావనతో ఉండాలి. ఆ శిశువు తనకు, తన కుటుంబానికి, సమాజానికి, జాతికి వరంగా భావించాలి. పార్వతీదేవి వినాయకుడికి ప్రాణశక్తిని వరంగా ప్రసాదించినట్టు, ప్రతి తల్లి తన గర్భంలో ప్రాణం పోసుకుంటున్న శిశువుకు తన శక్తులను ధారపోయాలి. అందుకు ప్రార్థన సరైన మార్గం. భక్తితో కూడిన ప్రార్థన… భగవంతుడి అనుగ్రహానికి కారణం అవుతుంది. భజనలు భగవంతుడు మనకు సమీపంలో ఉన్నాడన్న భావనను కలుగజేస్తాయి. భజనతో వెలువడే ఆధ్యాత్మిక శబ్ద తరంగాలు గర్భాన్ని చేరి శిశువుకు ఉసురు పోస్తాయి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం భజనలు చేయడం వల్ల, వినడం వల్ల దేహంలోని కణాల సామర్థ్యం పెరిగి ‘డోపమైన్’ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మనసును ఉల్లాసంగా ఉంచుతుంది. హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. తల్లి ఆనందంగా ఉన్నప్పుడు, ఆమె కడుపులో ఉన్న శిశువు మహదానందంగా ఎదుగుతుంది అనడంలో సందేహం లేదు.
మాతృత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే ఆరోగ్యం బాగుండాలి. నెలలు నిండుతున్న కొద్దీ గర్భిణిలో శారీరకంగా సమస్యలు ఎదురవుతాయి. కొన్ని సమస్యలు కాన్పు తర్వాత కూడా వెంటాడుతూ ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే అమ్మదనాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించగలుగుతాం. అది యోగాభ్యాసంతోనే సాధ్యం. గర్భిణి శారీరక సమస్యలకు విరుగుడుగా పనిచేసే యోగాసనాలు ఎన్నో ఉన్నాయి. ప్రాణాయామం, గోముఖాసనం, జాను శీర్షాసనం, వజ్ర త్రికోణాసనం, ఉత్కటాసనం ఇలా ఎన్నో ఆసనాలు తల్లికి, బిడ్డకు రక్షణ కల్పిస్తాయి. నిపుణుల పర్యవేక్షణలో వీటిని సాధన చేయాలి. సొంతంగా ప్రయత్నించడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు.
కడుపులో నలుసు పడిందని తెలిసినప్పటి నుంచి అమ్మ ఆనందం అంతాఇంతా ఉండదు. పుట్టబోయే బిడ్డ రూపాన్ని ముందుగానే ఊహిస్తూ మురిసిపోతుంటుంది. ప్రసవానికి ముందే బిడ్డకు ఏం పేరు పెట్టాలి? ఏ పాఠశాలలో చదివించాలి? భవిష్యత్ ప్రణాళికలు సహా రకరకాల ఆలోచనల్లో మునిగిపోతుంది. పుట్టిన బిడ్డ అంచనాలకు తగ్గట్టుగా ఎదగాలంటే.. గర్భంలో ఉన్నప్పుడే శిశువుతో అచ్చికలాడుతూ మచ్చిక చేసుకోవాలి. మంచి కథలు పైకి చదవాలి. దేశభక్తులు, వీరుల గాథల పుస్తకాలు చదివి వినిపించాలి. శ్రావ్యమైన సంగీతం వినాలి. సంగీత పరిజ్ఞానం ఉంటే.. స్వయంగా తానే భక్తిగీతాలు ఆలపించాలి. ఇలా చేసేటప్పుడు ఒక చేతిని పొట్టపై ఉంచి.. లోపల ఉన్న శిశువుకు వినిపిస్తున్నాన్న భావనతో ఉండాలి. తల్లి మాత్రమే కాదు.. తండ్రి కూడా శిశువు కదలికలను పరిశీలించాలి. నాలుగు మంచి మాటలు చెబుతుండాలి. అన్నిటికీ మించి తల్లి మనసును నొప్పించకుండా ఆనందంగా చూసుకోవాలి.
తల్లిదండ్రుల శరీరం, మనసు నుంచి శిశువు దేహం పుడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం లేకపోతే, తల్లులు శారీరక, మానసిక సమస్యలకు గురైతే రోగగ్రస్తులైన పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది. గర్భిణి దురలవాట్లు కలిగి ఉంటే, గర్భం తప్పిపోవచ్చు. పిల్లలు శారీరక, మానసిక వైకల్యంతో జన్మించవచ్చు. ఒక్కొక్కసారి మృతశిశువు జన్మించే ప్రమాదమూ ఉంది. ఇంట్లో ఎవరికైనా ధూమపానం అలవాటు ఉన్నా సమస్యే! ఇది తల్లి ఆరోగ్యాన్ని, తద్వారా శిశువునూ ఇబ్బందిపెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణి ఉంటే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, ఎదుగుదల లోపించడం వంటి ఇబ్బందులూ ఎదురవుతాయి. కాబట్టి, ఆహారం, ఇతర అలవాట్ల విషయంలో తల్లులు కచ్చితంగా ఉంటేనే పిల్లలకు శ్రేయస్కరం.
సద్గురు జగ్గీవాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్ గర్భిణుల గురించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నది. ‘ప్రెగ్నెన్సీ యోగా’ పేరుతో యోగా సెషన్లు ఏర్పాటు చేస్తున్నది. నిపుణుల పర్యవేక్షణలో 15 సెషన్లు ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సెషన్ గంటన్నర నుంచి రెండు గంటలపాటు కొనసాగుతుంది. ఇందులో ఆహార నియమాలు వివరించడంతో పాటు తేలికైన ఆసనాలు నేర్పుతారు. వాటిని సాధన చేయడం వల్ల తల్లీబిడ్డా ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో పాల్గొనాలంటే isha.sadhguru.org వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ నిర్వహిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సైతం గర్భిణుల కోసం ప్రత్యేక యోగా వర్క్షాప్లు నిర్వహిస్తున్నది. సంస్థ వెబ్సైట్లో (www.artofliving.org) రిజిస్టర్ చేసుకుని వాటిలో పాల్గొనొచ్చు.
🚼 తల్లి పోషకాహారం తీసుకోవాలి. రజోగుణం పెంచే మసాలా వంటకాలకు దూరంగా ఉండాలి. కూరగాయలు, పండ్లు తినాలి. కొవ్వు మితంగా ఉన్న ఆహారం తీసుకోవాలి.
🚼 ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి. తల్లికి తగిన విశ్రాంతి దొరికినప్పుడు శిశువు వృద్ధికారక జన్యువుల విడుదలకు ఆస్కారం ఉంటుంది.
🚼 దాంపత్య జీవితంలో చికాకులకు తావు ఇవ్వకుండా భార్యాభర్తలు సర్దుకుపోవాలి. ముఖ్యంగా భార్య శారీరక స్థితిని గ్రహించి భర్త బాధ్యతతో మెలగాలి.
🚼 గర్భిణికి కుటుంబ సహకారం చాలా అవసరం. ‘నాకు అండగా ఇంతమంది కుటుంబసభ్యులు ఉన్నారు’ అని తల్లి భావిస్తే.. ఆ నమ్మకం ఆమె కడుపులో పెరుగుతున్న
శిశువుకు కూడా రక్షణనిస్తుంది.
🚼 ఇష్టదైవం చిత్రపటాన్ని తరచూ చూస్తూ ఉండాలి. ఆ దైవానుగ్రహం తనకు, తన బిడ్డకు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి.
🚼 స్వార్థపూరితమైన ఆలోచనలను కట్టిపెట్టాలి. సెల్ఫోన్కు వీలైనంత దూరం పాటించాలి. టీవీ చూడటం తగ్గించాలి. భక్తిపాటలు, వేదమంత్రాలు వినాలి.
🚼 అసూయ, చెడు ఆలోచనలు, అపకారధోరణి కలలో కూడా లేకుండా చూసుకోవాలి.
🚼 వైద్యుల సలహా లేకుండా ఎలాంటి ఔషధాలూ తీసుకోకూడదు.
“కొత్తగా అమ్మ అయిన వాళ్లు ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం”