Mother’s day 2022 | అది దుర్గమమైన పర్వతం! అక్కడ ఓ ఆదిమ తెగ. ఓసారి మైదాన ప్రాంతంలోని ఓ గ్రామం మీద దాడి చేసింది. తిరిగి వెళ్తూవెళ్తూ.. ఓ పిల్లవాడిని తమ వెంట తీసుకువెళ్లిపోయింది. ఎలాగైనా ఆ బిడ్డను దక్కించుకోవాలని ఊరి జనమంతా బయల్దేరారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఒక్కరూ అంతెత్తు కొండను ఎక్కలేకపోయారు. నిరాశతో తిరిగి వచ్చేస్తుంటే ఆ పిల్లవాడి తల్లి ఎదురుపడింది. ‘నీ బిడ్డ నీకు దక్కడు. గుండె రాయి చేసుకో!’ అంటూ ఊరడించారు జనం. కానీ, ఆమె చిరునవ్వుతో వెనక్కి తిరిగి.. తన వీపు మీదున్న పిల్లవాడిని చూపింది. కన్న ప్రేమ.. ఆమెతో దుర్గమమైన కొండను ఎక్కించింది, కఠినాత్ముల మనసు కరిగించేలా చేసింది. తన బిడ్డను కంటికిరెప్పలా కాచుకునేందుకు, అవసరమైతే సూపర్మ్యాన్లను మించి సాహసాలూ చేయగలదు అమ్మ!
సృష్టికి మూలమైన మాతృమూర్తిని దేవతగా కొలవడం కొత్తేమీ కాదు. హైందవ సంప్రదాయంలో మాతృ దేవతల ఆరాధన తెలిసిందే. గ్రీకుల దేవత సిబలె, అందుకు రోమన్ ప్రతిరూపమైన మాగ్నా మటర్, మెసొపొటేమియాలో నింటుడ్.. ఇలా మాతృదేవతలను కొలుస్తూ, వాళ్ల పేరుతో ఘనంగా ఉత్సవాలు నిర్వహించేవాళ్లు. సింధు నాగరికత తవ్వకాల్లోనూ మాతృదేవతల రూపాలు బయటపడ్డాయి. కాకపోతే వాళ్ల పేరుతో ఒక ప్రత్యేకమైన రోజంటూ లేదు. ఆ గౌరవాన్ని ఒక్క రోజుకే పరిమితం చేయడం ఎందుకు? అనే ఆలోచనే ఇందుకు కారణం కావచ్చు. కానీ, 20వ శతాబ్దపు ప్రారంభంలో అమ్మల కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకోవాలనే ఆలోచన మొదలైంది.అప్పటినుంచీ ఏటా మే నెలలో రెండో ఆదివారాన్ని ‘అమ్మల దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. మనకు జన్మనిచ్చిన అమ్మ ఎప్పుడు పుట్టింది? ఎన్నేండ్ల క్రితం పుట్టింది? అమ్మకు పిల్లల్ని పెంచేంత శక్తి ఎక్కడినుంచి వచ్చింది? అమ్మ ప్రేమకు ఆధారమైన హార్మోన్లు ఏమిటి..? ఇలా మాతృత్వం చుట్టూ ముడిపడిన అనేకానేక అంశాలను నెమరువేసుకుందాం.
మదర్స్ డే కథ, 1832లో పుట్టిన ‘యాన్ మేరియా రీవ్స్’తో మొదలవుతుంది. అప్పట్లో పసిపిల్లలు రకరకాల వ్యాధుల బారినపడి చనిపోయేవారు. మేరియాకు పదిమంది పైనే పిల్లలు పుట్టినా వాళ్లలో నలుగురు మాత్రమే మిగిలారు. తన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించిన మేరియా.. బాల్యంలో వచ్చే వ్యాధులు, అపరిశుభ్రత వల్ల కలిగే నష్టాల గురించి జనంలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆ లక్ష్యం కోసం ‘మదర్స్ డే క్లబ్స్’ను స్థాపించారు. సరిగ్గా అప్పుడే అమెరికా అంతర్యుద్ధం మొదలైంది. బానిసత్వానికి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య సాగిన ఆ యుద్ధంలో దేశం రెండుగా చీలిపోయింది. ప్రజలూ విడిపోయారు. వారిమధ్య సామరస్యాన్ని పెంచే దిశగా ఈ క్లబ్, ఎవరివైపూ మొగ్గకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. తన వాదనను ప్రచారం చేసింది కూడా! యుద్ధం తర్వాత కూడా ప్రజలను ఏకం చేసేందుకు ఈ సంస్థ చాలా చొరవ చూపించింది. మంచి ఫలితాలనూ సాధించింది. 1905లో మేరియా చనిపోయాక, ఆ తల్లి భావనల జ్ఞాపకార్థం ‘మదర్స్ డే’ సంప్రదాయాన్ని మె కూతురు అన్నా జార్విస్ మొదలుపెట్టారు. మానవాళి శాంతియుతంగా ఉండాలన్నదే ఈ రోజు లక్ష్యం. మొదట్లో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. పైగా తల్లులకు ఓ రోజు, అత్తలకు ఓ రోజు ఏమిటంటూ ఎగతాళి చేశారు. 1914లో అమెరికా ప్రభుత్వం దీన్ని అధికారికంగా అంగీకరించడంతో హడావుడి మొదలైంది. ఈ పరిణామాన్ని గ్రీటింగ్ కార్డ్ కంపెనీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంతో విమర్శలూ మొదలయ్యాయి. మదర్స్ డేను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన అన్నా జార్విస్, ఆ రోజును వాణిజ్యపరంగా మార్చేయడాన్ని చివరి వరకూ వ్యతిరేకిస్తూ వచ్చారు. అలాంటి ఓ నిరసన సందర్భంగా అరెస్ట్ కూడా అయ్యారు. ఇప్పటికి మొదలై శతాబ్ద కాలం దాటిపోతున్నా.. విమర్శలకూ, మాతృత్వం గురించి చర్చలకూ, పనులన్నీ పక్కన పెట్టి కాసేపు అమ్మతో కబుర్లు చెప్పుకొనేందుకు.. ఏకకాలంలో అవకాశం ఇస్తున్నది మదర్స్ డే!
మనిషి అనే జీవి కన్ను తెరిచినప్పటి నుంచే అమ్మతనం ఉంది. కానీ, అది ఎన్ని సంవత్సరాల క్రితం అనే అనుమానం కలిగింది పరిశోధకులకు. వేర్వేరు మతాల్లో ఉన్న విశ్వాసాలను అటుంచి.. శాస్త్రీయంగా దీనికి జవాబు వెతికే ప్రయత్నం చేస్తూ వచ్చారు. జన్యువుల ఆధారంగా తల్లి చరిత్రను కనుగొనేందుకు గత 50 ఏండ్లుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పదేండ్ల క్రితమే ఈ అంచనా ఓ కొలిక్కి వచ్చింది. అమెరికాలోని రైస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు పది రకాలైన జన్యు నమూనాలను ఉపయోగించి ఈ ప్రయోగం చేశారు. మన పునరుత్పత్తికి జన్యువులే మూలం అన్న విషయం తెలిసిందే! మన పుట్టుకను, శరీరాన్ని, ఆరోగ్యాన్ని అవి శాసిస్తాయి. అయితే ఇవి తరం నుంచి తరానికి మారే సమయంలో చిన్నపాటి మార్పులకు లోనవుతాయి. అలా ఎన్నిసార్లు మార్పులు జరిగాయో అంచనా వేయగలిగితే, తల్లి ఆయువు తెలిసిపోతుంది. ఇదేమంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఓ మనిషిలో 20-25 వేల జన్యువులు ఉంటాయి. వాటన్నిటినీ విశ్లేషించడానికి సూపర్ కంప్యూటర్లు కూడా సరిపోవు. అందుకే శరీరంలోని కణాలకు శక్తిని అందించే మైటోకాండ్రియాకు చెందిన జన్యువులను విశ్లేషించి, ఈ సవాలును ఛేదించే ప్రయత్నం చేశారు. వైజ్ఞానిక పరిభాషలో ఈ విధానానికి mitochondrial Eve (mtEve) అని పేరు. ఈ తరహా జన్యువులకు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి.. ఇవి తల్లి నుంచే వస్తాయి. రెండు.. వాటిలో వస్తున్న మార్పును కచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందుకూ కొన్ని సవాళ్లూ లేకపోలేదు. మానవజాతి ఒక్కచోటే ఉండిపోలేదు. ఖండాలు దాటింది. విస్తృతంగా వలసలు వెళ్లింది. తన సంతతిని పెంచుకుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని.. రెండు లక్షల సంవత్సరాల క్రితం తొలి బిడ్డకు జన్మనిచ్చినట్టు తేల్చారు. అప్పటినుంచి అమ్మ బాధ్యత కొనసాగుతూ వస్తున్నది.
కాలం మారుతున్న కొద్దీ పితృస్వామ్యం బలపడింది. పిల్లల్ని కని, వాళ్ల బాగోగులను చూసుకునే బాధ్యత అమ్మ మీదే పడింది. మహిళలను ఇంటికి, వంటింటికి పరిమితం చేయడం మొదలైంది. అంతకుమించిన అణచివేతలూ సాగాయి. వాళ్ల ఆరోగ్యం, అక్షరాస్యత విషయంలోనూ అశ్రద్ధే. వందల ఏండ్ల వివక్షను ఎదుర్కొని మహిళలు ఇప్పుడిప్పుడే తమని తాము నిరూపించుకుంటున్నారు. కానీ పనిచేసే చోట మాత్రం, ఇప్పటికీ పైకి కనబడని వివక్ష ఉందని చెబుతున్నారు. దీనికి ‘మదర్హుడ్ పెనాల్టీ’ అని పేరు కూడా పెట్టారు. పిల్లలు ఉన్న మహిళలు ఉద్యోగం పట్ల తక్కువ నిబద్ధతతో ఉంటారు, వాళ్ల మీద పూర్తిగా ఆధారపడలేం, వాళ్లు అంత కఠినంగా అజమాయిషీ చేయలేరు.. తదితర భావనలు ఆఫీసుల్లో, కార్ఖానాల్లో రాజ్యమేలుతున్నాయి. ఇలా మనకు ఉన్న పూర్వ అభిప్రాయాలతో ఎదుటి వ్యక్తులపట్ల పక్షపాతాన్ని చూపించడానికి ‘స్టేటస్ కేరక్టరిస్టిక్ థియరీ’ అని పేరు. అది అమ్మలపట్ల మరీ ఎక్కువని ప్రతి పరిశోధనా నిరూపిస్తున్నది. ఉదాహరణకు కారెల్, బెనార్డ్ అనే పరిశోధకులు.. ఒకే తరహాలో ఉన్న రెండు రెజ్యూమేలను యాజమాన్యాలకు అందించారు. అర్హత, నైపుణ్యం, సామర్థ్యం విషయంలో రెండూ దేనికవే సాటిగా ఉన్నాయి. కాకపోతే, ఒక రెజ్యూమేపైన ‘ఇద్దరు పిల్లల తల్లి’ అనే వాక్యాన్ని జోడించారు. ఆ ఒక్క వాక్యంతో వారిని తీసుకునే సానుకూలత, మరో దరఖాస్తుతో పోలిస్తే దాదాపు సగం తగ్గిపోయింది. తల్లి అన్న పేరుతో ఇలా కెరీర్ ఒక్కసారిగా తలకిందులైపోయే పరిస్థితిని ‘మెటర్నల్ వాల్’ అని పిలుస్తున్నారు.
జీతభత్యాల నిర్ణయం మీద కూడా మాతృత్వం ప్రభావం చూపుతున్నది. పురుషులతోనే కాదు, సాటి మహిళలకంటే కూడా వారికి తక్కువ వేతనం లభిస్తున్నది. జెర్మీ, జేలన్ అనే పరిశోధకుల ప్రకారం తల్లికి ఒక్కో సంతానానికీ 5 శాతం చొప్పున జీతం తగ్గుతున్నది. ఇక పిల్లలు, కుటుంబ బాధ్యతల కోసం కొన్నాళ్లపాటు వృత్తి నుంచి విరామం తీసుకుని, మళ్లీ పనిలోకి అడుగుపెట్టాలని అనుకునేవారి పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నట్టు తేలింది. ఇది నాణానికి ఒకవైపు! మరోవైపు పిల్లలు ఉన్న తల్లులు చాలా సాత్వికంగా ఉంటారనే అభిప్రాయం ఉంది. ఒకవేళ వాళ్లు కఠినంగా వ్యవహరిస్తే దుర్మార్గులుగా చిత్రీకరించే పరిస్థితీ ఉంది. మొత్తానికి 21వ శతాబ్దంలో కూడా మంచి తల్లి అంటే.. తన పిల్లలను కంటికి రెప్పలా కాచుకోవాల్సిన మనిషి అన్న ముద్ర వేసేశారు. తను రెండు బాధ్యతలనూ సమన్వయం చేసుకోగలదు అని ఎవరూ నమ్మడం లేదు.
అమ్మ అంటే కేవలం జన్మనివ్వడమో, తొలి అడుగులు నడిపించడమో, ఆకలి తీర్చడమో మాత్రమే కాదు.. ఆ అనుబంధంతోనే మన బతుకు బలపడుతుంది. అందుకు కొన్ని సాక్ష్యాలివి..
ప్రపంచంలో వేలాది భాషలున్నాయి. ఒక భాషకు మరో భాషతో పొంతన లేకపోవచ్చు. కానీ, ఒక్క పదం మాత్రం ఇంచుమించుగా ప్రతి భాషలోనూ ఒకేలా ప్రతిధ్వనిస్తుంది. అదే అమ్మ! మా, మాతా, మదర్, మామన్. ఎందుకిలా అన్నదానిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. తవ్వకాల్లో ఒక ఆసక్తికరమైన కారణం బయటపడింది. పసిపిల్లలు చనుబాలు తాగుతూ ముక్కుతో శబ్దాలు చేయడం గమనిస్తాం. క్రమంగా మా, ఆ అనే శబ్దాలు చేస్తారు. ఆకలి వేసినా, అమ్మ రక్షణ కావాలనిపించినా.. ఆ అక్షరాలనే ఉచ్చరిస్తారు. ఆ రెండు శబ్దాలతో వచ్చే పదాలే అమ్మకు ప్రతిరూపంగా మారాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ అన్న భావనకు భాషతో పని కూడా లేదు. అది పిల్లవాడి మొదటి మాట!
పిల్లలను నిద్రపుచ్చుతూనో, వాళ్ల అభద్రతను పారదోలుతూనో సాగే లాలిపాటలు మనకు కొత్తేమీ కాదు. వీటికి ఎంత ప్రాధాన్యం ఉందంటే జానపదం నుంచి భక్తి సాహిత్యం వరకూ లాలిపాటలది విశిష్ట స్థానం. కానీ, ఈ పాటలకు ఊహించనంత ప్రత్యేకత ఉందని అంటున్నారు మయామీ విశ్వవిద్యాలయానికి చెందిన షానన్ అనే పరిశోధకుడు. లాలిపాటల ప్రభావాన్ని గమనించడానికి 70 మంది పసిపిల్లల ముందు లాలిపాటలు పాడుతున్న సందర్భాన్ని రికార్డ్ చేశారు. లాలిపాటతో నిజంగానే బిడ్డలో అలజడి నిదానిస్తున్నట్టు తేలింది. పిల్లవాడు దృష్టి మరల్చినప్పుడల్లా తల్లి అసంకల్పింతంగా తన లయను మారుస్తుందనీ.. దానివల్ల ఇద్దరి మధ్యా అనుబంధం మెరుగుపడుతుందనీ గ్రహించారు. మరో ముఖ్య విషయం! ప్రసవం తర్వాత వచ్చే హార్మోన్ల అసమతుల్యం వల్ల ‘post-partum depression’ అనే కుంగుబాటు కలుగుతుంది. లాలిపాటలు పాడుతూ బిడ్డతో గడుపుతుంటే.. డిప్రెషన్ దూరమవుతున్నట్టు తేలింది.
తల్లి గర్భంలోనే పద్మవ్యూహం గురించి తెలుసుకున్న అభిమన్యుడి కథ చదువుకున్నాం. నిజానికి తల్లి కడుపులో ఉండగానే తన మాటలు, వాటిని ఉచ్చరించే తీరు పిల్లవాడు గ్రహించేస్తాడు. స్వీడిష్ పిల్లల మీద జరిగిన ఓ పరిశోధనలో, తల్లి కడుపులో ఉన్న చివరి పదివారాల నుంచే శిశువులో భాషకు సంబంధించిన అవగాహన మొదలవుతుందట. దాంతో.. తను ఈ లోకంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఏది తన భాష, ఏది కాదు అని గుర్తించగలుగుతాడని మరో పరిశోధన తేల్చింది. ఆరు నెలల పసివయసులోనే మరో భాష మాట్లాడే తల్లిదండ్రులకు దత్తతగా వెళ్లిపోయినా.. 30 ఏళ్ల తర్వాత కూడా తన మాతృభాషను విన్నప్పుడు, దాన్ని సులువుగా ఆకళింపు చేసుకోవడాన్ని ఇంకో పరిశోధన నిరూపించింది. బిడ్డ పుట్టిన వెంటనే అతని మెదడులో భాషను నేర్చుకునే భాగాలు.. తల్లి మాటలతోనే జాగృతం అయినట్లు మరో సందర్భం తేల్చింది.
బిడ్డతో అనుబంధాన్ని పెంచేందుకు, తల్లిలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. బంధాలను దృఢపరిచే ఈ రసాయనాన్ని ‘లవ్ హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఇది సహజంగానే తల్లిప్రేమను బలపరుస్తుంది. ఆయితే తొలి రోజుల్లో తల్లి చూపించే ప్రేమకూ, పిల్లల తెలివితేటలకూ సంబంధం ఉందని తేలడం మరో విశేషం. దీన్ని నిరూపించేందుకు వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా 3-6 ఏండ్ల మధ్య ఉన్న పిల్లలను ఎంచుకున్నారు. వారి ముందు ఒక ఆకర్షణీయమైన బహుమతి ఉంచారు. ఆ పిల్లవాడితో పాటు తల్లిని కూడా ఒక గదిలో ఉంచి ఆమెకు ఒక పని అప్పగించారు. ఒకవైపు ఆ పని పూర్తిచేస్తూనే, మరోవైపు పిల్లవాడు ఆ బహుమతి జోలికి పోకుండా ఉంచడం తనకు ఇచ్చిన సవాలు! ఈ సందర్భంలో ఆమె పిల్లవాడిని ఎంత ప్రేమగా, లాలనగా సముదాయించిందో గమనించారు. దాన్నిబట్టి తల్లీబిడ్డల అనుబంధాన్ని అంచనా వేశారు. నాలుగేళ్ల తర్వాత వీరి మెదడును స్కాన్ చేసినప్పుడు, తల్లి ప్రేమను సమృద్ధిగా పొందినవారిలో హిప్పో కేంపస్ అనే భాగం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. మన జ్ఞాపకశక్తి, నేర్పు, నైపుణ్యాలకు ఈ భాగం చాలా కీలకం.
తల్లి గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ప్రాణాన్నీ, ప్రకృతినీ కొలవగలమా! వాటికి ప్రతిరూపమైన అమ్మ కూడా అంతే. ఒకవేళ ఉరుకులపరుగుల హోరు జీవితంలో పడి తనను పలకరించడం మర్చిపోయినా, మనస్ఫూర్తిగా మాట్లాడే సందర్భం లేకపోయినా.. ఈ మదర్స్ డే రోజు ఓసారి తనని గుర్తుచేసుకుందాం. కాసేపు తనతో గడిపి, నాలుగు మాటలు మాట్లాడదాం. బహుమతులు వ్యక్తిగతం. కానీ, అమ్మకు అన్నిటికంటే పెద్ద బహుమతి, బిడ్డ తనతో కాస్త కాలం గడపడమే.
జీతభత్యాల నిర్ణయం మీద కూడా మాతృత్వం ప్రభావం చూపుతున్నది. పురుషులతోనే కాదు, సాటి మహిళలకంటే కూడా వారికి తక్కువ వేతనం లభిస్తున్నది. జెర్మీ, జేలన్ అనే పరిశోధకుల ప్రకారం తల్లికి ఒక్కో సంతానానికీ 5 శాతం చొప్పున జీతం తగ్గుతున్నది. ఇక పిల్లలు, కుటుంబ బాధ్యతల కోసం కొన్నాళ్లపాటు వృత్తి నుంచి విరామం తీసుకుని, మళ్లీ పనిలోకి అడుగుపెట్టాలని అనుకునేవారి పరిస్థితి మరింత ఘోరంగా ఉన్నట్టు తేలింది.
తల్లి గర్భంలోనే పద్మవ్యూహం గురించి తెలుసుకున్న అభిమన్యుడి కథ చదువుకున్నాం. నిజానికి తల్లి కడుపులో ఉండగానే తన మాటలు, వాటిని ఉచ్చరించే తీరు పిల్లవాడు గ్రహించేస్తాడు. స్వీడిష్ పిల్లల మీద జరిగిన ఓ పరిశోధనలో, తల్లి కడుపులో ఉన్న చివరి పదివారాల నుంచే శిశువులో భాషకు సంబంధించిన అవగాహన మొదలవుతుందట. దాంతో.. తను ఈ లోకంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే ఏది తన భాష, ఏది కాదు అని గుర్తించగలుగుతాడని మరో పరిశోధన తేల్చింది.
పిల్లలకు తల్లి ఓ భద్రతగా, ఆలంబనగా కనిపిస్తుంది. మరి ఆ తల్లికి ఎక్కడినుంచి అంత బలం వస్తుంది? హార్మోన్ల ప్రభావాన్ని పక్కన పెడితే.. కొన్ని విషయాల్లో తనకు లభించే సానుకూలతను బట్టి, ఆమె పిల్లలను జాగ్రత్తగా చూసుకోగలదని చెబుతున్నారు లుదర్ అనే శాస్త్రవేత్త. ఈ రంగంలో దాదాపు 25 ఏండ్ల అనుభవం తర్వాత చెబుతున్న మాటలివి. వేలాదిమంది తల్లులను గమనించిన తర్వాత ఆమె.. బిడ్డను పెంచే క్లిష్టసమయంలో, ఒక నాలుగు పరిస్థితులు వాళ్లకు మానసిక స్థయిర్యాన్ని అందిస్తాయని నిర్ధారించారు.
తను పిల్లలకు ఎలాగైతే షరతులు లేని ప్రేమను అందిస్తుందో.. తనను కూడా అంతే ప్రేమగా చూసుకునే వ్యక్తులు ఉండాలి.
రోజువారీ జీవితంలో ఒకరికి భయపడకుండా.. తనంతట తానుగా స్వేచ్ఛగా ప్రవర్తించగలగడం.
పిల్లల్ని పెంచడం ఓ కొత్త అనుభవం కావచ్చు, దానికి తోడు డిప్రెషన్ లాంటి సమస్యలూ వెంటాడవచ్చు. ఇలాంటి స్థితిలో తన కష్టాలను విని ఓదార్చే తోడు తనకు కావాలి.
పెండ్లి అయ్యాక, అందులోనూ పిల్లలు పుట్టాక స్నేహాలు పలచబడే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా స్నేహాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే.. నేస్తాల రాకపోకలతో, వారి సరదా సంభాషణలతో, ఓదార్పుతో, కాలక్షేపంతో ఎంతటి బాధ్యతైనా అలవోకగా నెరవేర్చేయవచ్చు.
గర్భం దాల్చిన దగ్గరినుంచీ పిల్లలు పుట్టేవరకూ మహిళల్లో శారీరకంగా, మానసికంగా రకరకాల మార్పులు వస్తాయన్న విషయం తెలిసిందే! క్రమంగా ఇవి సద్దుమణుగుతాయి. కానీ, ఒకసారి తల్లి అయిన తర్వాత, మెదడులో ఒక శాశ్వతమైన మార్పు రావడం విశేషం. దీన్నే ‘మామి బ్రెయిన్’ అని పిలుస్తారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మెదడులోని గ్రే మ్యాటర్ కొంత తగ్గుతుంది. దీనివల్ల కొన్ని పేర్లు, అనవసరమైన విషయాలు మర్చిపోతారు. పిల్లలే తొలి ప్రాధాన్యంగా నిలిచేందుకు మెదడు తీసుకునే జాగ్రత్తల్లో ఇదొకటి. చాలామంది మహిళలు ఈ మార్పు గమనించి కంగారుపడతారు. తమలో మతిమరపు పెరిగిపోయిందని బాధపడతారు. నిజానికి దీనివల్ల కీడు కంటే మేలే ఎక్కువ. ఒకవైపు గ్రే మ్యాటర్ తగ్గడంతోపాటు మరోవైపు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం, విశ్లేషణ శక్తి, జాగరూకత, మల్టీటాస్కింగ్.. లాంటి లక్షణాలు మెరుగుపడతాయి. 2019లో జరిగిన ఓ పరిశోధన ప్రకారం.. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత తల్లిలో సమస్యలను ఛేదించి బయటికి వచ్చే నైపుణ్యం పెరుగుతుందని తేలింది.
అమ్మ దృష్టిలో ప్రతి బిడ్డా ఓ విజేతే! కాకపోతే కొందరు లోకాన్ని కూడా మెప్పించగలుగుతారు. చెంఘిజ్ ఖాన్ నుంచి అలెగ్జాండర్ వరకూ వారివారి వ్యక్తిగత జీవితాలను పక్కన పెడితే, వాళ్లంతా విశ్వవిజేతలుగా ఎదగడంలో తల్లి అండే కీలకం. అలెగ్జాండర్ తల్లి ఒలంపియస్, చెంఘిజ్ ఖాన్ అమ్మ హోలన్ అందించిన సలహాలు.. వారి రాజ్యవిస్తరణలో ముఖ్య పాత్ర పోషించాయి. ఎవరి దాకో ఎందుకు భారతీయుల జీవితంలో తల్లి పాత్రను ఎంత చెప్పుకొన్నా తక్కువే! చంద్రగుప్తుడికి మౌర్య అనే పేరును అందించిన ముర, శివాజీని తీర్చిదిద్దిన జిజియాబాయి.. లాంటి పేర్లు ఎన్నో పలకరిస్తాయి. సత్యానికీ, ధార్మికతకూ గాంధీ కట్టుబడటం వెనుక తల్లి పుత్లీబాయి ప్రభావం ఉందని స్వయంగా చెప్పుకొన్నారు. ఈమధ్యకాలంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అబ్దుల్ కలామ్ జీవితకథ కూడా తన తల్లి పరిచయంతోనే మొదలవుతుంది. ఎంతటి పేదరికంలో మగ్గుతున్నా, ఇంటికి వచ్చిన అతిథులకు భోజన మర్యాదలలో ఎలాంటి లోటూ రానిచ్చేది కాదని ఆయన చెప్పుకొస్తారు. ఆమెనుంచే జాలి, కరుణ లాంటి లక్షణాలు అలవర్చుకున్నాననీ.. చిన్నప్పటి నుంచి తను చెబుతూ వచ్చిన కథల ద్వారా సహనాన్ని అలవర్చుకున్నాననీ గుర్తుచేసుకుంటారు.
కార్పొరేట్ రంగంలో అయితే.. యూట్యూబ్ సీయీవో సుసాన్, ఫేస్బుక్ సీయీవో షెరిల్, సొంత వ్యోమనౌకలో అంతరిక్షాన్ని చేరుకున్న తొలి వ్యక్తి రిచర్డ్ బ్రాన్సన్, భూమ్మీదే అతి ధనవంతుడైన ఎలన్ మస్క్.. అందరూ కూడా తమ విజయాలకు, వ్యక్తిత్వాలకు తల్లి ప్రేరణే కీలకం అని స్పష్టంగా ఒప్పుకొన్నవారే!
తల్లి అయిన తర్వాత మహిళలు కెరీర్ పరంగా ఎలాంటి విజయాలు సాధించగలరనే విషయంలో లేనిపోని అనుమానాలు ఉన్నాయి. కానీ, ఈ లోకంలోనే అరుదైన ఘనతలు సాధించిన మహిళలు మాతృమూర్తులే అన్న సత్యమే ఇందుకు తిరుగులేని జవాబు.
♥ మానవచరిత్రలోనే గుర్తుంచుకోదగ్గ శాస్త్రవేత్తలలో ఒకరైన మేరీ క్యూరీ, పిల్లలు పుట్టిన తర్వాతే అరుదైన విజయాలు సాధించారు. భౌతికశాస్త్రం, రసాయనశాస్ర్తాల్లో నోబెల్ అందుకున్నారు. ఆమె ప్రభావంతో కూతురు ఇరీన్ కూడా శాస్త్రవేత్తగా మారి నోబెల్ సాధించారు.
♥ సాహిత్య చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ, సంపద కలిగిన రచయిత్రి జె.కె.రౌలింగ్. భర్త నుంచి దూరమై ఎలాంటి ఉపాధీ లేక, ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో రోజులు గడుపుతున్న సమయంలోనే.. ‘హ్యారీపాటర్’ను సృష్టించారు. తన కూతురు జెస్సికాను చూసుకుంటూ ఆ కష్టాలను దాటేశానని చెబుతారు.
♥ ఒకప్పుడు గూగుల్ ఓ సెర్చ్ ఇంజిన్గానే ఉండేది. దానికి యాడ్ సెన్స్ జోడించి ప్రకటనలు రాబడుతూ వేలకోట్ల డాలర్ల లాభాల బాట పట్టించారు సుసాన్. ఒక చిన్న సంస్థగా ఉన్న యూట్యూబ్ భవిష్యత్తులో ఓ గొప్ప మాధ్యమంగా మారుతుందని ఊహించి, గూగుల్తో దాన్ని కొనిపించారు. ప్రస్తుతం యూట్యూబ్కు సీయీవోగా ఉన్నారు. తనకు ఐదుగురు పిల్లలు.
♥ పెండ్లి చేసుకుంటే కెరీర్ నాశనం అయిపోతుంది అంటూ కోచ్ భయపెట్టినా.. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లవాడిని చూసుకుంటూనే ఆటను కొనసాగించింది. దేశానికి ఒలింపిక్స్ పతకాన్ని అందించింది.. మేరీ కోం. ఒలింపిక్స్ చరిత్రను గమనిస్తే ఇలాంటి తల్లులు ఎంతోమంది కనిపిస్తారు. ఏకంగా 11 పతకాలు సాధించిన అలిసన్ ఫెలిక్స్ ఇందుకు సాక్ష్యం!
దేశంలోనే తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి నుంచి క్షిపణి మహిళగా పేరు తెచ్చుకున్న ఇస్రో శాస్త్రవేత్త టెస్సీ థామస్ వరకూ.. కెరీర్పరంగా అద్భుతాలు సాధిస్తూనే, తమ పోరాటపటిమతో ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న మహిళలు ఎందరో!
“మాతృదినోత్సవానికి ఆర్టీసీ కానుక.. అమ్మలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం”
“Mother’s Day : అమ్మ కోసం నెదర్లాండ్లో ఇద్దరు భారతీయ యువతుల పోరాటం”
Mother’s Day Special : అమ్మ కడుపు చల్లగా
Mother’s day special: అమ్మ కోసం ఐదు బహుమతులు (ntnews.com)