హైదరాబాద్: అమ్మలకు టీఎస్ఆర్టీసీ (TSRTC)అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న తల్లులకు ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది. ఐదేండ్లలోపు చిన్నారులతో కలిసి తల్లులు అన్ని బస్సుల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణించవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అమ్మ అనురాగాన్ని, ప్రేమను వెలకట్టలేమని, ఆ త్యాగమూర్తుల విశిష్ట సేవలను గుర్తుచేసుకుంటూ ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మదర్స్ డే సందర్భంగా ఆర్డినరీ నుంచి ఏసీ వరకు అన్ని బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
ప్రత్యేక సమయాల్లో ఆర్టీసీ రాయితీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే సందర్భంగా ఇలాంటి అవకాశాలు కల్పించారు. నిరుద్యోగ యువతకు కూడా పాస్లలో 20 శాతం రాయితీ అందిస్తున్నారు. అలాగే మాతృదినోత్సవం రోజున ఆర్టీసీ అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు, మాతృమూర్తులు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.