సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రా? మంత్రగాడా అని నిలదీశారు.
కేసీఆర్ను పశుపతిలా ఫామ్హౌస్లో బంధించానని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంటి క్రాంతికిరణ్ గుర్తుచేశారు. ఏ క్షుద్ర విద్య నేర్చుకుని ఆయన్ను బంధించారో చెప్పాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. హరీశ్రావు తిరిగిన ఆలయాలనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్రెడ్డి తిరిగారని అన్నారు. అలా అని రేవంత్ రెడ్డి క్షుద్రపూజలు చేసి ముఖ్యమంత్రి అయ్యారని ఎప్పుడైనా అన్నామా అని నిలదీశారు. రేవంత్రెడ్డి కామాఖ్య ఆలయానికి ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కరువును ఎలా ఎదుర్కోవాలో ఆలోచించకుండా క్షుద్ర పూజలంటూ కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టుపై సంగారెడ్డిలో సీఎం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నిత్యం ప్రజల్లో ఉండే హరీశ్రావును పిచ్చి ఆరోపణలతో దెబ్బతీయాలని చూస్తున్నా అది సాధ్యం కాదన్నారు.