అతనేం కుబేరుడు కాదు. పెంకుటిల్లే పెద్ద ఆస్తి. రోజూ పాత సైకిలు మీద ఆ పెద్దాయన ప్రయాణిస్తుంటే.. రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు ఆకులూ పూలూ రాల్చుతూ.. ‘పత్రం సమర్పయామి’, ‘పుష్పం సమర్పయామి’ అంటూ అభ్యాగత సేవలు చేస్తాయి. ఆ పచ్చదనమంతా నారాయణ కృషి ఫలితమే. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన పొలాస నారాయణ ( Polasa Narayana ) ఓ నిశ్శబ్ద హరిత ఉద్యమకారుడు.
పొలాస నారాయణ.. దుబ్బాక ( Dubbaka ) మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట వాసి. ఆ వృద్ధుడు తన భార్య లక్ష్మితో కలసి పెంకుటింట్లో జీవనం సాగిస్తున్నారు. బీడీలు చుట్టి నలుగురు పిల్లల్ని పోషించాడు. ముగ్గురు కూతుళ్ల వివాహం చేశారు. అంతలోనే చేతికొచ్చిన కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. ప్రసుత్తం తన బీడి పింఛను డబ్బులు, తన భార్యకు అందే ఆసరా పింఛను పైసలే ఆధారం. కానీ, నారాయణ మొహంలో ఎక్కడా అసంతృప్తి ఉండదు. బాధ కనిపించదు. తెల్లని బట్టల్లో మల్లెపువ్వులా నవ్వుతూ పలకరిస్తాడు. నిజమే, ఆయన కట్టించిన మేడలూ మిద్దెలూ లేకపోవచ్చు. కానీ, ఆయన నాటిన చెట్లున్నాయి. చేతినిండా ధనం లేకపోవచ్చు. కానీ, ఆయన పంచిన పచ్చదనం పుష్కలం.
మూడున్నర దశాబ్దాల క్రితం… పొలాస నారాయణ బీడి కార్మికుడిగా ఉన్నప్పటి సంగతి. ఆగస్టు 15న గ్రామంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తానూ పాల్గొన్నాడు. అప్పుడే, పదిమందికీ ఉపయోగపడే పని చేయాలన్న సంకల్పం కలిగింది. పంద్రాగస్టును మించిన పెద్ద ముహూర్తం ఏం ఉంటుంది? గ్రామంలోని మహంకాళి ఆలయ ఆవరణలో ఓ వేప మొక్కను నాటాడు. అలా ప్రారంభమైన మొక్కలు నాటే కార్యక్రమం.. 36 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. ఆయన నాటిన మొక్కలు మహా వృక్షాలయ్యాయి. దేవాలయాలు, పాఠశాల పరిసరాలు, సంతలు తదితర చోట్ల ఎక్కువగా మొక్కలు నాటుతుంటాడు నారాయణ. నలుగురూ కూడే చోటు కాబట్టి, నీడనిస్తాయన్న ఆశ.
రోజూ ఉదయం సైకిల్కు ఓ పక్క నీళ్ల క్యాన్.. మరో పక్క ఓ సంచిలో పచ్చని మొక్కను పెట్టుకుని బయల్దేరుతాడు నారాయణ. మొక్క నాటగానే, చుట్టూ ముళ్లకంచె ఏర్పాటు చేస్తాడు. నిత్యం నీళ్లు పోసి వస్తాడు. వేసవి మినహా అన్ని కాలాల్లోనూ ఆయన దినచర్య ఇదే. వేసవిలో మాత్రం అప్పటివరకూ నాటిన మొక్కలను బతికించడం మీదే దృష్టి పెడతాడు. ప్రతి మొక్కా పెరిగి పెద్దయ్యేంత వరకూ, కంటికి రెప్పలా కనిపెట్టుకుంటాడు. నారాయణ నాటినవాటిలో రావి, బాదం, వేప, చింత చెట్లు అధికం. పూల మొక్కల్లో మందార, గన్నేరు, స్వస్తిక్ తదితర మొక్కలు ఎక్కువ. ఆలయాల దగ్గర పూలమొక్కలకే ప్రాధాన్యం ఇస్తాడు. దేవుడి పూజకు పనికొస్తాయన్న ఆలోచన. లచ్చపేటతో పాటు దుబ్బాక, రామక్కపేట, ధర్మాజీపేట, చౌదర్పల్లి, చేర్వాపూర్, రామేశ్వరంపల్లి గ్రామాల్లో ఆయన నాటిన మొక్కలు మహా వృక్షాలుగా ఎదిగాయి. ఆ చెట్లలోనే నారాయణ, లక్ష్మి చెట్టంత కొడుకును చూసుకుంటారు. ఒక కొడుకును కోల్పోయినా, వందల బిడ్డలకు ప్రాణం పోశామన్న సంతృప్తి!
అందరూ బాగుంటేనే ..మనం బాగుంటాం. నాకు ఇప్పుడు డబ్బు అయిదేండ్లు. దేవుడు ఇంకా శక్తిని ఇస్తున్నాడు కాబట్టి, ఆరోగ్యంగా ఉన్నాను. డబ్బు ఎంత సంపాదించినంత తృప్తి ఉండదు. పదిమందికి చల్లని గాలిని, నీడను ఇచ్చే మొక్కలు నాటాలన్న నా సంకల్పం పరమాత్మ నిర్ణయమే. సీఎం కేసీఆర్ తెలంగాణలో హరితహారం కార్యక్రమం నిర్వహించటం ఎంతో అభినందనీయం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. నాటిన మొక్కలను సంరక్షించాలి.
– పొలాస నారాయణ, లచ్చపేట
-బాల్రాజు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
ఆ ఐలాండ్లో మహిళలదే రాజ్యం.. వాళ్లదే పైచేయి.. మరి పురుషులు ఏం చేస్తారు?
కార్పొరేట్ కొలువులు.. లగ్జరీ లైఫ్ వదిలేసి అడవిలో కాపురం