Madikonda Textile Park | ఇరవై ఏండ్ల కింద వాళ్లంతా సూరత్, భీవండి, ముంబై వలస వెళ్లిండ్రు. కూడబెట్టుడేమోగానీ ‘కూడుపెట్టే దిక్కు’ లేని పరిస్థితి. ఎక్కడైనా చేసేది ఆ నేత పనే. కానీ నమ్ముకున్న పని సగం కడుపు కూడా నింపలేకపోయింది. ఖాళీ డొక్కలతో, కదలని రెక్కలతో నేలకు నెత్తివెట్టి ‘దేవుడే దిక్కు’ అనుకుంటున్న సమయంలో.. ‘నేతన్నల దశ మారుస్తం. టెక్స్టైల్ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తం’ అనే సీఎం కేసీఆర్ ప్రకటన వారిలో ఆశలు చిగురింపజేసింది. సూరత్, భీవండి, ముంబై నుంచి నేతన్నలు సొంతూర్లకు పయనమయిండ్రు.
ఇమామ్ షేక్ది మహబూబాబాద్ జిల్లా తొర్రూర్. 1994లో సూరత్కు వలస వెళ్లి పవర్లూమ్ మెకానిక్గా పనిచేసేవాడు. చేసే పని గిట్టుబాటుగాక సూరత్ నుంచి వరంగల్ వచ్చి మడికొండ టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తుండ్రు. అతడితో పాటు 50 మంది మెకానిక్లు కూడా ఇక్కడికి వచ్చిండ్రు.
కూరపాటి అయిలయ్యది పెనుగొండ. 1977లో సూరత్కు వెళ్లిండు. 40 ఏండ్లకు పైగా సూరత్లో స్థిరపడిన అయిలయ్య ఇన్నేండ్లకు మళ్లా సొంత ప్రాంతానికి వచ్చి యూనిట్ పెట్టుకుండు. ఆయనతో పాటు కొడుకు కూడా ఇక్కడే పనిచేసుకుంటున్నడు.
మామిడి రాజుది హనుమకొండ జిల్లా శాయంపేట. ఇతడు కూడా నలభైయేండ్లు సూరత్లనే ఉన్నడు. సీఎం కేసీఆర్ పిలుపుతో ఇక్కడికి వచ్చిండ్రు. సూరత్లో కండెలు, సాంచలు నడిపిన చేతితోనే ఇక్కడ యూనిట్ పెట్టుకొని సంతోషంగా ఉంటున్నడు.
ఏరుకొండ వెంకటేశ్ది మల్లారెడ్డిపల్లి. 19 ఏండ్ల కింద తమ్ముడు మహేశ్తో కలిసి సూరత్ వెళ్లి పవర్లూమ్ మిషన్ కారిగర్గా పని చేస్తుండె. అవ్వయ్య కండ్ల ముందు లేరనే దిగులు ఉండేది. తెలంగాణలో వస్త్ర పరిశ్రమకు పూర్వవైభవం వస్తుందని తెలిసి మడికొండ వచ్చిండు. రోజుకు రూ. 700 సంపాదిస్తుండ్రు.
అమూల్య బెహరాది ఒడిశా. సూరత్లో పవర్లూమ్స్ కారిగర్గా పనిచేసేది. తర్వాత 24 ఏండ్లు ముంబైలో చేసింది. తెలంగాణలో ఉపాధికి ఢోకాలేదు అని తెలిసి ఏడు నెలల కింద ఇక్కడికి వచ్చింది. ఏడు నెలల్లో ఒక్కసారికూడా సొంతూరికి పోకుండా ఇక్కడ చీరలు నేస్తున్నది.
వీళ్లే కాదు, తెలంగాణ ఏర్పాటు తర్వాత వరంగల్ పరిధిలోని మడికొండ టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తూ సంతోషంగా, సంతృప్తికర జీవనం గడుపుతున్నవాళ్లు వందలమంది ఉన్నారు. ఈ టెక్స్టైల్ పార్క్ 60 ఎకరాల్లో విస్తరించి ఉంది. కార్మికులను యజమానులుగా మార్చాలి అనేది దీని ఉద్దేశం. దీంట్లో భాగంగానే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలో టెక్స్టైల్ యూనిట్లను స్థాపించారు. 364 మందితో కాకతీయ టెక్స్టైల్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటైంది. దేశంలోనే మొదటి పవర్లూమ్ టెక్స్టైల్ పార్కుగా మడికొండ పార్కు నిలిచింది. దీనివల్ల పొట్ట చేత పట్టుకుని సూరత్కు వలసలు పోయే బాధ తప్పింది. వేల కిలో మీటర్ల దూరంలో ఎవరి దగ్గరో పనిచేసే దుస్థితీ లేదు. సూరత్ నుంచి వచ్చి ఎన్నో కుటుంబాలు ఇక్కడే స్థిరపడ్డాయి.
ప్రభుత్వ చేయూతతో సూరత్, భీవండి, ముంబై నుంచి వచ్చినోళ్లంతా ఇక్కడ యూనిట్లు పెట్టుకున్నారు. ఇప్పటివరకు 160 యూనిట్లు ఏర్పాటయ్యాయి. వంద యూనిట్లలో నిత్యం ఉత్పత్తి జరుగుతున్నది. ఒక్కో యూనిట్లో కోటి రూపాయల నుంచి రూ.1.40 కోట్లతో మిషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి యూనిట్లో 16 మిషన్లను స్థాపించే వెసులుబాటు ఉంది. డాబీ, జకార్డు రకం మిషన్లపై బతుకమ్మ చీరలు నేస్తున్నారు. ఒక్కో మిషన్పై ఏకకాలంలో రెండు చీరలు తయారు చేయడం ఇక్కడి మిషన్ల ప్రత్యేకత. టెక్స్టైల్ పార్కులోనే కోములు (దారం ఉండలు)తో వర్ఫింగ్ చేసి చీరలు తయారు చేస్తున్నారు. మాస్టర్, ఆపరేటర్, హెల్పర్, వర్కర్, వాచ్మెన్ వంటి పనులతో ఇక్కడి వారికి ఉపాధి దొరుకుతున్నది. మడికొండ టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి అవుతున్న జకార్డు చీరలకు దేశ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఈ చీరలు ఇప్పుడు మడికొండ నుంచి అన్ని రాష్ర్టాలకు ఎగుమతి అవుతున్నాయి. వస్త్ర పరిశ్రమకు కేంద్రమైన సూరత్కు మడికొండలో తయారైన జకార్డు చీరలను పంపుతున్నారు.
టెక్స్టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుతోపాటు మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కోటా, కాకతీయ టెక్స్టైల్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ వాటా కలిపి రూ.10 కోట్లతో రోడ్లు, డ్రైనేజీ వంటి పనులు పూర్తవుతున్నయి. చైనా నుంచి దిగుమతి చేసుకున్న పవర్లూమ్ మిషన్లు ఇక్కడ ఉన్నయి. ఎంపిక చేసిన డిజైన్ను ఎలక్ట్రానిక్ పరికరంతో పవర్లూమ్ మిషన్కు అనుసంధానం చేస్తరు. సాధారణ జకార్డ్ యంత్రాల్లో డిజైన్ కోసం అట్టముకలను ఏర్పాటు చేసుకొని కాలుతో యంత్రాన్ని తొక్కాల్సి ఉంటుంది. డిజైన్కు అనుగుణంగా లోపల అట్టముకలను పెట్టాలి. చీరపై రెండు మూడు రకాల డిజైన్లు వేయాలంటే అన్ని రకాల అట్టముకలను మిషన్తో అనుసంధానం చేయాలి. ఈ పద్ధతిలో జకార్డు చీర తయారీ కష్టమైన పనిగా ఉంటుంది. కొత్తగా వచ్చిన జకార్డు పవర్ లూమ్లో శ్రమ చాలా తక్కువ. పని త్వరగా పూర్తవుతుంది. డిజైన్లు ఎక్కువగా ఉంటాయి. పెన్ డ్రైవ్ లేదా చిప్ పెట్టి అందులో ఉన్న ఏ డిజైన్ను అయినా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా డిజైన్ను ఎంపిక చేసి బటన్ను నొక్కితే కోరుకున్న డిజైన్తో చీర తయారవుతుంది. ఏ డిజైన్.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెమొరీ కార్డులో పెట్టుకుని మార్చుకోవడానికి వీలుండేలా జకార్డ్ యంత్రాన్ని తయారుచేశారు. ఈ చీరలకు ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉంటున్నది. మంచి ధర వస్తున్నది.
బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలకు ఇచ్చే ‘చీర’తో నేత కార్మికుల ఉపాధికి భరోసా పెరిగింది. బతుకమ్మ చీరలతో వరంగల్ కార్మికులకు ఉపాధి దక్కింది. బతుకమ్మ చీరలను గత ఏడాది మొదటిసారి ఇక్కడ తయారు చేశారు. మడికొండ టెక్స్టైల్ పార్కులోని యూనిట్లకు 12.50 లక్షల మీటర్లు చీరను తయారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశంతో మడికొండ టెక్స్టైల్ పార్కులో రెండు లక్షల చీరలు తయారు చేశారు. కరోనా సమయంలో ఉపాధికి ఇబ్బంది పడుతున్న చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బతుకమ్మ చీరల తయారీలో మడికొండ టెక్స్టైల్ పార్కులోని కార్మికులకు తొలిసారి అవకాశం కల్పించింది. బతుకమ్మ చీరల తయారీ పనులతో ఇక్కడి యూనిట్లో పని చేస్తున్న వెయ్యి మందికి ఉపాధి కలిగింది. పరోక్షంగా మరో నాలుగు వేల మందికి పని దొరికింది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ఇచ్చిన పని తమకు భరోసా పెంచిందని ఇక్కడి కార్మికులు చెబుతున్నారు.
మడికొండతో పాటు వరంగల్ జిల్లాలోని సంగెం- గీసుకొండ మండలాల పరిధిలో మెగా టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నారు. 2017 అక్టోబర్ 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. త్రిసూర్ (తమిళనాడు), సూరత్ (గుజరాత్ ), షోలాపూర్ (మహారాష్ట్ర)లలో తయారయ్యే అన్ని రకాల దుస్తులనూ ఇక నుంచి ఇక్కడే తయారు చేసేలా.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పారును ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. స్పిన్నింగ్, టెక్స్ టైల్, వీవింగ్, నిట్టింగ్ ప్రాసెసింగ్, ఉవెన్ ఫ్యాబ్రిక్, యార్న్ డైయింగ్, టవల్- షీటింగ్, ప్రింటింగ్, రెడీమేడ్ వస్త్రాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనువుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. టెక్స్ టైల్ పారు నిర్మాణం శంకుస్థాపన జరిగిన రోజునే.. వస్త్ర ఉత్పత్తిలో పేరు గాంచిన 14 సంస్థలు రూ.3,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి. భూమిని చదును చేయడం, రోడ్లు, వరద నీటి కాలువలు, మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీరు, కరెంటు, బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. టెక్స్ టైల్ పారు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,87,539 మందికి ఉపాధి కలుగుతుంది. దేశంలోనే
తెలంగాణ ప్రముఖ స్థానంలో నిలవనుంది.
దేశంలోనే తొలి పవర్లూమ్ టెక్స్టైల్ పార్కు మాది. రాష్ట్ర ప్రభుత్వం మా పార్కులో 12.50 లక్షల మీటర్ల బతుకమ్మ చీరల ఉత్పత్తికి గత ఏడాది అవకాశం కల్పించింది. ఉపాధికి భరోసా దొరికింది. పార్కులోని అన్ని యూనిట్లు నడిచేలా వేగంగా పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాకు ఎంతో చేస్తున్నారు.
– సిహెచ్.దర్గస్వామి, కాకతీయ టెక్స్టైల్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్
– పిన్నింటి గోపాల్, ఫొటోలు: గొట్టె వెంకన్న
ఈ పార్కులో అబ్బాయిలకు నో ఎంట్రీ.. అందులో అమ్మాయిలు ఏం చేస్తారంటే..
Malaika Arora | ఫిట్నెస్ బ్రాండ్ అంబాసిడర్లా అనిపించే మలైకా ఆరోరా ఆరోగ్య రహస్యమేంటో తెలుసా
కాళ్లు, కండ్లు లేకపోయినా నలుగుర్ని నడిపిస్తున్నరు.. వైకల్యానికే సవాలు విసురుతున్నరు
Pet Photography | నయా ట్రెండ్.. శునకాలకు కూడా డిఫరెంట్ ఫొటోషూట్