Baby Garden | పార్కులో ఎవరుంటారు? ఆరోగ్యం కోసం పరుగెత్తేవాళ్లు. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేవాళ్లు. ఎక్కువగా మగవాళ్లు.. కొద్దిమంది ఆడవాళ్లు! మగవాళ్లే ఎందుకు ఎక్కువ? ఆడవాళ్లు ఎందుకు తక్కువ? ఆడవాళ్లకు ఆరోగ్యం, ఆనందం అవసరం లేదా? అవసరమే! కానీ, భద్రత కారణంగా కొంతమంది, పోకిరీల భయంతో మరికొంతమంది రావడం లేదు. పార్కులో మగ పురుగుకు కూడా ప్రవేశం లేకపోతే.. ఆ సమస్యే ఉండదుగా? ముంబైలోని ‘బేబీ గార్డెన్ ( Baby Garden )’ అలాంటిదే!
బహిరంగ స్థలాలను ఆడవాళ్లు మాత్రమే ఉపయోగించుకునేలా కట్టడి చేయాలన్న ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నది. చాలా దేశాల్లో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. స్త్రీ విద్య అంతంతమాత్రమే అయిన రోజుల్లో ఆడపిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించారు. ఆ స్ఫూర్తితోనే మహిళలు ఎన్నో రంగాల్లో అడుగుపెట్టారు. ఆటంకాలు దాటుకొని ఉన్నత స్థితికి ఎదిగారు. విద్య, ఉపాధిలో కొంతమేర తగ్గినా.. సామాజిక జీవితంలో మాత్రం ఇంకా వివక్ష రాజ్యమేలుతున్నది. ఈ ఆటంకాన్నీ దాటేందుకు కొన్ని బహిరంగ ప్రదేశాలలో ‘మహిళలకు మాత్రమే ప్రవేశం’ కల్పిస్తూ సామాజిక ప్రయోగాలు చేస్తున్నారు. ముంబై నడిబొడ్డున సెంట్రల్ స్టేషన్ పరిసరాల్లో ఉన్న ‘బేబీ గార్డెన్’ అచ్చంగా అలాంటిదే.
‘పురుషులకు నో ఎంట్రీ’ ప్రయోగం విజయవంతమైంది. స్థానిక మహిళలు ఫిట్నెస్ కోసం, ప్రశాంతత కోసం, నలుగురినీ కలవడం కోసం పార్కుకు వస్తున్నారు. ‘రిలాక్స్గా ఉండటం ఇంట్లో సాధ్యం కాదు. ఇక్కడ మాత్రమే వీలు అవుతుంది. అందుకే ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్లేటప్పుడు ఇక్కడ కాసేపు వ్యాయామం చేస్తాను. కొంతసేపు తీరిగ్గా కూర్చుంటాను’ అంటారు ఓ స్థానికురాలు. ఈ పార్క్లో ప్రవేశం ఉచితం. కాబట్టి పేద మహిళలు కూడా రాగలుగుతున్నారు. బేబీ గార్డెన్ను ప్రారంభించిన తర్వాత స్థానిక మహిళల్లో ఫిట్నెస్ పట్ల అవగాహన పెరిగింది. ఈ పార్క్ మహిళల్లో శారీరక బలాన్నే కాదు ఆత్మబలాన్ని కూడా పెంపొందించింది. ఎంతోమంది ఒంటరి జీవితం నుంచి బయటపడ్డారు. ఈ ప్రయోగం సఫలం కావడంతో.. మరికొన్ని పార్కులలో ‘మహిళలకు మాత్రమే’ ప్రవేశం లభించేలా చట్టం చేస్తామని ముంబై మహానగర పాలక సంస్థ ప్రకటించింది. బేబీ గార్డెన్ లాంటిదే గుర్గావ్లోనూ ఉంది. లైంగిక వేధింపులను తగ్గించేందుకు హర్యానా ప్రభుత్వం దీన్ని ఏర్పాటుచేసింది.
భద్రతే ముఖ్యం..
హరిణీ నాగేంద్ర, అమృతా సేన్ ఇద్దరూ సామాజిక పరిశోధకులే. ఢిల్లీ ప్రజలు బహిరంగ ప్రదేశాలకు.. మరీ ముఖ్యంగా పార్కులకు వచ్చే మీద ఓ అధ్యయనం చేశారు. మహిళలు ఒంటరిగానో, స్నేహి తులతో కలిసో పార్కులకు రావడం చాలా తక్కువని గుర్తించారు. ఎంతోమంది మహిళల అభిప్రాయాలు తెలుసుకున్నాక.. భద్రతే అసలు సమస్య అని తేల్చారు. దీనిపై ‘ద థర్డ్ ఐ’ జర్నల్లో పరిశోధన పత్రాన్ని కూడా ప్రచురించారు. అయితే, పురుషులకు ప్రవేశం లేని కొన్ని బహిరంగ ప్రదేశాలను మాత్రం మహిళలు స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారని గుర్తించారు. మహిళల కోసం మహిళలే నిర్వహిస్తున్న కో వర్కింగ్ ప్లేస్లు, కోలివింగ్ ప్లేస్లు, క్లబ్స్, జిమ్స్కి పెరుగుతున్న ఆదరణే అందుకు ఓ ఉదాహరణ. ఇదే సమయంలో పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళల ఒంటరితనాన్ని పోగొట్టాలంటే, వాళ్లను పార్కులకు రప్పించాలని ముంబై మహా నగర పాలక సంస్థ భావించింది. మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తే వివక్షకు, వేధింపులకు ఆస్కారం ఉండదని గుర్తించి, ‘బేబీ గార్డెన్’ను ఏర్పాటుచేసింది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి సదుపాయాలు కల్పించింది. పిల్లలకు పాలిచ్చేందుకు ఒక గదిని కూడా కేటాయించింది.