Listeners Army | పిచ్చివాళ్లు సమాజం చెక్కిన శిల్పాలు.. అన్నాడో రచయిత. హృదయం లేని ఆ శిల్పాన్ని మనిషిగా మార్చాలోయ్.. అంటున్నది లిజనర్స్ ఆర్మీ. జీవితంలో విసిగిపోయి, మనసు విరిగిపోయి.. ఓదార్పు కరువైనవారి మాటలను మనసారా వింటుంది ఆ బృందం. చెప్పుకొంటే సగం బరువు దిగి పోతుంది! బతుకు బండి గాడిలో పడితే మిగతా సగమూ ఖాళీ అవుతుంది. కాబట్టే, వినడానికి మేమున్నాం.. రారండని పిలుస్తున్నది లిజనర్స్ ఆర్మీ.
వినాయక దగ్వార్ వయసు ఇరవై అయిదు, సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఒక రోజు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు ‘మీ కథ చెప్పండి. నేను ఒక డాలర్ ఇస్తాను’ అనే పోస్ట్ చూశాడు. ఈ ఆలోచన
ఆయనకు బాగా నచ్చింది. కొత్తగానూ అనిపించింది. మన బాధల్నీ కష్టాల్నీ ఓపికగా వినేవాళ్లు లేకపోవడమూ ఓ సంక్షోభమే. మానసిక సమస్యల పట్ల సమాజంలో అవగాహన పెంచడానికి, కుంగుబాటుకు గురైనవారిని ఒడ్డున పడేయడానికి.. ఆయా వ్యక్తుల కథను వినడమే సరైన పరిష్కారమని అనుకున్నాడు. వెంటనే ‘మీ కథ చెప్పండి. నేను పది రూపాయలు మీకు ఇస్తాను’ అంటూ ఒక పోస్ట్ చేశాడు. ఈ ప్రయత్నం ‘లిజనర్స్ ఆర్మీ’ వైపుగా తొలి అడుగు.
తమ బాధలు చెప్పుకొంటే, ఎదుటివాళ్లు ఎక్కడ తప్పుపడతారోనని చాలామంది భయపడిపోతారు. ఈ ఆలస్యం వల్ల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. నిజం చెప్పాలంటే ఇదొక నిస్సహాయత. వినాయక దగ్వార్ కూడా ఒకప్పుడు అలాంటి నిస్సహాయుడే. ఇరవై ఏండ్ల వయసులో డిప్రెషన్కు గురయ్యాడు. ఎవరేం అనుకుంటారో అన్న అనుమానం స్నేహితులు, బంధువుల ముందు నోరు విప్పకుండా చేసింది. ఓ దశలో ఆత్మహత్యకూ ప్రయత్నించాడు. ఆ సమయంలో తన బాధను ఎవరైనా విని ఉంటే బావుండేదని దగ్వార్ ఇప్పటికీ అనుకుంటూ ఉంటాడు. ఆ లోటును ప్రస్తుతం ‘లిజనర్స్ ఆర్మీ’ పూడుస్తున్నది. లిజనర్స్ ఆర్మీ వలంటీర్లు ఎదుటి వ్యక్తి బాధలను శ్రద్ధగా వింటారు. లోతుగా విశ్లేషిస్తారు. తమవైపు నుంచి ఎలాంటి సాయం కావాలో తెలుసుకుంటారు. అవసరం అనుకుంటే సైకాలజిస్టుతో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. బాధలు తెలిసినవాళ్లే మనసు లోతులూ తెలుసుకోగలరు. అంతగా అర్థం చేసుకునే మనుషులు దొరకడం చాలా కష్టం. ఒక్కోసారి పిల్లల బాధలను తల్లిదండ్రులు కూడా గ్రహించలేరు. లిజనర్స్ ఆర్మీ వలంటీర్లలో మానసిక కుంగుబాటు నుంచి బయటపడ్డవాళ్లే ఎక్కువ. మనసు మాట వినే తోడు ఎంత ముఖ్యమో వాళ్లకే తెలుసు. లిజనర్స్ ఆర్మీ వలంటీర్ అయిన జయంత్ గార్గ్ ఒకప్పుడు మానసికంగా కుంగిపోయినవాడే. తనకు బైపోలార్ డిజార్డర్ ఉందని నిర్ధారణ కాగానే కుటుంబ సభ్యులు నానా మాటలన్నారు. అర్థం చేసుకోవాల్సినవాళ్లే అలా స్పందిస్తే ఇక బయటివాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? అంతేకాదు, సరైన డాక్టర్కు చూపించకుండా, భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారట. ఆ సమస్యను ఎలాగోలా అధిగమించి, ఇప్పుడు నొయిడాలో మనస్తత్వ శాస్త్రం చదువుతున్నాడు జయంత్.
2020లో ప్రారంభమైన లిజనర్స్ ఆర్మీలో ప్రస్తుతం 200 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, నాగపూర్, ఔరంగాబాద్ నగరాలకు ఆర్మీ విస్తరించింది. ఎదుటి వారి బాధను ఓపికతో వినాలనుకునే ఎవరైనా లిజనర్స్ ఆర్మీలో చేరవచ్చు. మనసు బరువు దించుకోడానికి, గుండెలోని బాధలు పంచుకోడానికి.. ఎవరైనా ఇక్కడికి రావచ్చు. ‘ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనసులోని మాట చెప్పుకోడానికి ఓ తోడు ఉండాలనేదే మా సంస్థ లక్ష్యం. లిజనర్స్ ఆర్మీ ప్లకార్డులు ప్రదర్శించడం, చెప్పిన వాళ్ల మాటలు వినడంతోనే ఆగిపోదు. భారతీయుల్లో మానసిక ఆరోగ్యంపట్ల అవగాహన పెంచడానికి పనిచేస్తాం. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు మరికొన్ని నగరాలకు లిజనర్స్ ఆర్మీని విస్తరిస్తాం’ అంటున్నారు వినాయక దగ్వార్.
“Engineers Biryani | జాబు వదిలేసి బిర్యానీ అమ్ముకుంటున్న ఇంజినీర్లు”
“Kanna Ooru | ఒక్క జిల్లా నుంచి ఎస్సై జాబులు కొట్టారు.. కన్న ఊరు రుణం తీర్చుకుంటున్నారు”
కార్పొరేట్ జాబ్ వదిలేసి.. రైల్వే స్టేషన్లకు పెయింటింగ్లు వేయిస్తున్నాడు.. ఎందుకో తెలుసా”
కంప్యూటర్లో మనం వాడుతున్న తెలుగు ఫాంట్ క్రియేట్ చేసింది వీళ్లే..”