83 movie | గెలుపు ఓటములు ఆటలో భాగమే. పరీక్షలో సహజమే. కానీ కొన్నిసార్లు ఒకే ఒక్క విజయం… మన నమ్మకాన్ని పెంచేస్తుంది. ఆలోచనల తీరును మార్చేస్తుంది. కొత్త అలవాట్లను సృష్టిస్తుంది. సరికొత్త బాటను సిద్ధం చేస్తుంది. 1983 ప్రపంచ కప్ విజయాన్ని ఇప్పటికీ మనం గుర్తు చేసుకోవడానికి కారణం ఇదే! మీరు క్రికెట్ను ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు. కానీ భారతీయుల జీవితాల్లో క్రికెట్కు ఉన్న ప్రాధాన్యాన్ని, ప్రపంచ క్రికెట్ మైదానంలో మన పెద్దన్న పాత్రనూ విస్మరించలేం. అందుకు 83 నాటి విజయమే బీజం అన్నది అందరూ ఒప్పుకొనే మాటే.
అలాగని ఆ గెలుపు గాలివాటుగా రాలేదు. అప్పటి విశ్వ విజేతలను అలవోకగా నేలకూల్చలేదు. ఆ ఘనత వెనుక ఓ నాయకుడి నమ్మకం ఉంది, సమష్టి కృషి ఉంది, ఆత్మీయుల అండ ఉంది… వాటికి కాస్త అదృష్టమూ తోడైంది. మొత్తానికి ఓ మంచి సినిమాలో ఎన్ని మలుపులు ఉన్నాయో… అంతకుమించిన ఘట్టాలు ఉన్నాయి. అందుకే నాటి సందర్భాన్ని చలనచిత్రంగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రం ఎలా ఉండబోతున్నదన్న చర్చ పక్కనపెడితే, 83 గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. విజయానికి ముందు, తర్వాత అన్నంతగా మన క్రీడా చరిత్రను గుర్తుచేసుకోవడానికి కావల్సిన విశేషాలు ఉన్నాయి.
యాదృచ్ఛికమే కావచ్చు. కానీ సరిగ్గా మూడు వందల సంవత్సరాల క్రితం… మన ఉపఖండంలో తొలిసారిగా క్రికెట్ ఆడినట్టు చరిత్రలో నమోదైంది. ఔరంగజేబు మరణం తర్వాత మొగల్ సామ్రాజ్యం, వేగంగా పతనమవుతున్న కాలం అది. ఇటు మరాఠాలు, అటు రాజపుత్రులు బలపడేందుకు యత్నిస్తున్న సమయమది. ఈ అనిశ్చితిని అనువుగా మార్చుకుని తెల్లదొరలు పట్టు బిగిస్తున్నారు. వ్యాపారం సాకుతో ఇంగ్లండు నుంచి మరిన్ని ఓడలు మన తీరాలకు చేరుకుంటున్నాయి. అక్కడ లంగరు వేసిన సైనికులకు ఊసుపోక… తమదేశపు ఆటను మొదలుపెట్టారు. అలా 1721లో మన గడ్డ మీద క్రికెట్ ఆడారు. క్రమంగా ఆట ఎదిగింది, కానీ అందులో భారతీయులకు చోటు ఉండేది కాదు!
19వ శతాబ్దం నాటికి భారతీయులకు కూడా క్రికెట్ అలవాటైంది. దురదృష్టవశాత్తు, ఆటలోనూ జాతిభేదం ఉండేది. పార్సీలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఆంగ్లో-ఇండియన్స్… అంటూ ఎవరికి వారు వేర్వేరుగా ఆడుకునేవారు. అంతేకాదు! ఆంగ్లేయులు ఇష్టపడే క్రీడ కాబట్టి, ఇదో రాచరికపు ఆట అనే నమ్మకం పెరిగింది. రంజిత్ సింగ్, దులీప్ సింగ్ లాంటి రాజులు స్వయంగా క్రికెట్ ఆడటమే కాకుండా తమ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆటకు ప్రోత్సాహం కల్పించేవారు (మనం వినే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వీరి పేరుమీదుగా వచ్చినవే). పటియాలా రాజు అయితే క్రికెట్ మైదానాలు నిర్మించడమే కాకుండా, ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేశాడు.
ఇలా క్రికెట్ ఆంగ్లేయులతో మొదలై, జాతుల మధ్య విడివడి, రాజుల చెంతకు చేరుకుంది. కానీ ఓ మంచి ఆటను ఎప్పటికీ కొన్ని వర్గాలకే పరిమితం చేయలేం! సామాన్యుడి చేయిపడ్డాక దాని దిశ తిరగాల్సిందే. క్రికెట్ విషయంలోనూ అదే జరిగింది. మైదానంలో పరుగు, రెండు జట్ల మధ్య పోటీ, వ్యూహ ప్రతివ్యూహాలు… సామాన్యులకు క్రికెట్ పట్ల ఆసక్తిని పెంచాయి. క్రమంగా వాళ్లు దాన్ని సొంతం చేసుకోవడం మొదలుపెట్టారు. పల్వంకర్ బాలు అస్పృశ్యతను దాటుకుని మేటి క్రికెటర్గా రాణించాడు. అంబేద్కర్ను సైతం అబ్బురపరిచేంత పోరాటస్ఫూర్తిని కనబరిచాడు. 1932లో, క్రికెట్ పుణ్యభూమిగా భావించే లార్డ్స్ మైదానంలో… భారత్ తన తొలి టెస్ట్ ఆడటంతో అసలు చరిత్ర మొదలైంది. ఆ జట్టుకు నాయకత్వం వహించిన తెలుగు ఆటగాడు సి.కె.నాయుడు తొలి భారతీయ కెప్టెన్గా నిలిచిపోయాడు.
రోజుల తరబడి సాగే టెస్ట్ క్రికెట్ అంటే జనాలకు కాస్త మొహం మొత్తింది. త్వరగా, చురుగ్గా మెరుపువేగంతో సాగిపోయే ఆట కోసం ఆరాటం మొదలైంది. ఇంగ్లండులోని కౌంటీలు ఒక్కరోజులో ముగిసే పరిమిత క్రికెట్ ఆరంభించాయి. వీటిలో వేర్వేరు జట్ల మధ్య పోటీలూ మొదలయ్యాయి. క్రికెట్ను శాసించే ఐసీసీకి కూడా ఈ పద్ధతి నచ్చింది. పైపెచ్చు, ఈ తరహా క్రికెట్తో ఎక్కువమంది ప్రేక్షకులను స్టేడియానికి రప్పించవచ్చు. అప్పుడప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న టీవీ ప్రసారాలకు కూడా ఇది అనువైన ఫార్మాట్. అలా అంతర్జాతీయ వన్డే క్రికెట్ మొదలైంది. సరిగ్గా 50 ఏండ్ల క్రితం… 1971లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే జరిగింది. మరో మూడేండ్ల తర్వాత కానీ భారత్ వన్డేల్లోకి అడుగుపెట్టలేదు. మనం తలుచుకుంటున్న 1983 నాటికి భారత్ ఓ పసికూన. వైరిజట్లు చిత్తుగా ఓడించి సంబరపడే సాధనం. 83 ప్రపంచకప్లో కాలుమోపే నాటికి మనదేశం 40 వన్డేలు ఆడితే… నాలుగో వంతు కూడా గెలవలేదు. వాటిలో, ఎనిమిది వరుస ఓటములు చవిచూసిన చెత్త రికార్డు కూడా ఉంది. వెంకట రాఘవన్, బిషన్ సింగ్ బేడి, సునీల్ గవాస్కర్ లాంటి ఉద్దండులు నాయకత్వం వహించినా తేడా లేకపోయింది. ఇక తొలి రెండు ప్రపంచ కప్లలో భారత్ ప్రదర్శన గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది!
క్రికెట్కు వన్డే రూపు వచ్చిన దగ్గరినుంచీ ఆదరణ అమాంతం పెరిగిపోయింది. దాంతో ప్రపంచ కప్ మొదలుపెట్టాలని ఐసీసీ భావించింది. క్రికెట్ జట్లలో ఇలాంటి పోటీని నిర్వహించే సామర్థ్యం, అప్పట్లో ఒక్క ఇంగ్లండుకు మాత్రమే ఉంది. ఆ దేశం చొరవ చూపడంతో 1975లో తొలి ప్రపంచ కప్ జరిగింది. ప్రుడెన్షియల్ అనే బీమా సంస్థ స్పాన్సర్ చేయడంతో… ‘ప్రుడెన్షియల్ కప్’ అని పిలుచుకున్నారు. 1975 పోటీల్లోకి అడుగుపెట్టే నాటికి ఇండియా కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడింది కాబట్టి, మనదేశం నుంచి అంత గొప్ప పోటీని ఎవరూ ఆశించలేదు. కానీ ఆ ప్రపంచకప్లో, లార్డ్స్ మైదానం సాక్షిగా మన తొలి ప్రదర్శనను మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, 60 ఓవర్లలో 334 పరుగులు చేసింది. భారీ లక్ష్యమే! కానీ దూకుడుగా ఆడాల్సిన భారత్, వికెట్లు పదిలంగా ఉన్నప్పటికీ నత్తనడకన బ్యాటింగ్ చేయడం… ప్రేక్షకుల ఒళ్లు మండించింది. ఆ మ్యాచ్లో ఓపెనర్గా దిగిన గవాస్కర్ చివరివరకూ ఆడి 174 బంతుల్లో కేవలం 36 పరుగులే చేయడం విచిత్రం. ఆ ప్రదర్శన గురించి ఇప్పటికీ ఎవరి దగ్గరా సరైనా తర్కం లేదు. మొత్తానికి ఆ పోటీల్లో ఒక తూర్పు ఆఫ్రికా మీద గెలుపు తప్ప మరో ఊరట దక్కలేదు. 1979 ప్రపంచకప్లో పరిస్థితి ఇంకా దారుణం. ఆడిన మూడు ఆటల్లోనూ చిత్తుగా ఓడిపోయి లీగ్ దశలోనే నిష్క్రమించింది. 1983 ప్రపంచకప్లో అడుగుపెట్టే నాటికి ఇదీ పరిస్థితి.
ప్రతి నాలుగేండ్లకు ఓసారి జరిగే ప్రపంచ కప్ మళ్లీ అదే ఇంగ్లండులో మొదలైంది. అదే ప్రుడెన్షియల్ కంపెనీ స్పాన్సర్ చేసేందుకు ముందుకొచ్చింది. గత రెండు ప్రపంచ కప్పులనూ గెలుచుకున్న వెస్టిండీస్ ఈసారి కూడా టైటిల్ గెలుచుకుంటుందని అందరూ ధీమాగా ఉన్నారు. అందులోనూ నాటి వెస్టిండీస్ జట్టు ఎలా ఉందనీ! తరాలు మారినా ఇప్పటికీ మరిచిపోలేని ధీరులతో నిండిన బృందం అది. గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్, వివియన్ రిచర్డ్స్, ైక్లెవ్ లాయిడ్ లాంటి బ్యాట్స్మెన్ ఒకవైపు. మైఖెల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్ లాంటి బౌలర్లు మరోవైపు. ఓ నాయకుడి కలల జట్టు అది. మన జట్టు చూస్తేనేమో అందరూ కొత్త పోరగాళ్లు. శ్రీకాంత్, అరుణ్లాల్, రవిశాస్త్రి లాంటి కుర్రాళ్లు అప్పుడప్పుడే ప్రపంచ్ క్రికెట్లోకి అడుగుపెడుతున్నారు. ఆమాటకు వస్తే మన నాయకుడు మాత్రం ఏమంత అనుభవజ్ఞుడని. కెప్టెన్ కపిల్ దేవ్ వయసు కేవలం 24 ఏండ్లే. గవాస్కర్ నాయకత్వం మరీ పేలవంగా సాగడంతో, ఓ మార్పుచేసి చూద్దామనే ఉద్దేశంతో కపిల్కు పగ్గాలు అందించారు. నిజానికి అతను ఇంకా ఆటలో నిలదొక్కుకోనేలేదు. 83 ప్రపంచ్కప్లో అడుగుపెట్టే నాటికి ఆడింది 32 మ్యాచ్లే. వాటిలో 34 వికెట్లు, 608 పరుగులతో అటు బ్యాట్స్మెన్గా కానీ, ఇటు బౌలర్గా కానీ అంత ప్రభావం చూపలేకపోయాడు. కానీ మరో దారి లేకపోయిందేమో. కెప్టెన్సీ తననే వరించింది!
మూడో ప్రపంచ్ కప్ పోటీల్లోకి అడుగుపెట్టే నాటికి సహజంగానే భారతీయ జట్టు మీద ఎవరికీ ఆశలు లేవు. అందులో పాల్గొనే జట్టుకు ‘అలా సరదాగా ఇంగ్లండ్ తిరిగేసి రండి!’ అన్న సలహాలే వినిపించాయి. ఆటగాళ్లకు కూడా తాము సెమీ ఫైనల్స్ వరకూ చేరుకుంటామనే నమ్మకం లేదు. అప్పుడే కొత్తగా పెండ్లయిన కృష్ణమాచారి శ్రీకాంత్… సెమీ ఫైనల్స్ సమయానికి అమెరికాకు టికెట్లు బుక్ చేసుకున్నాడు. భార్యతో కలిసి అమెరికాలో హనీమూన్ చేసుకోవాలన్నది తన ఆశ. అటు బీసీసీఐ ప్రవర్తనా ఏమంత ఆశాజనకంగా లేదు. జట్టుకు అండగా కనీసం కోచ్ను కూడా పంపలేదు. ఇక వైద్యుడినేం పంపుతారు. జట్టు వ్యవహారాలు చూసుకునేందుకు మాన్సింగ్ అనే మేనేజరు మాత్రమే బయల్దేరాడు. మనవాళ్లు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా సైతం జట్టుతో కఠినంగా వ్యవహరించింది. లగేజిని తూకమేసి… అదనపు బరువుకు ముక్కుపిండి డబ్బు వసూలుచేసింది. భారత జట్టు ఇంగ్లండులో అడుగుపెట్టే సరికి… మనం ఆ కప్పును గెల్చుకోవడానికి 66:1 అవకాశాలు మాత్రమే ఉన్నాయని స్థానిక బుకీలు తేల్చేశారు.
లార్డ్స్ మైదానానికి ఎదురుగా ఉన్న హోటల్లోనే జట్టు సభ్యుల బస. మేనేజర్ గదిలో జరిగిన సమావేశంలో… ‘మన అత్యుత్తమ ప్రదర్శనను ఇద్దాం’ అంటూ కపిల్ ఇచ్చిన పిలుపు, వారిలో కొత్త ఉత్సాహాన్నేమీ నింపలేదు. టోర్నమెంటుకు ముందు స్థానిక జట్లతో జరిగే పోటీల్లోనూ ఓడిపోయారు. రైతులు, సేల్స్మెన్ లాంటి పౌరులతో కూడిన ‘మైనర్ కౌంటీస్’ అనే జట్టు ముందూ తలవంచారు. ఇలాంటి జట్టు ఎవరికైనా లోకువే కదా! భారత జట్టు ఎలా ఉంది? అసలు తింటున్నదా లేదా? అని పట్టించుకునే నాథుడే లేడు. ఆ మాటకు వస్తే… ఆతిథ్య దేశం నుంచి కూడా అంత శ్రద్ధ కనిపించలేదు. జట్టులోని శాకాహారులకు తగిన ఆహారం సిద్ధం చేయకపోవడంతో, మొదటి రోజు బిస్కెట్లతోనే కడుపు నింపుకోవాల్సి వచ్చింది. ఆంగ్లేయుల పత్రికలు సైతం భారతీయులను అసలు పోటీలోకే తీసుకోలేదు. నాటి మేటి క్రికెట్ పత్రిక విజ్డెన్… ‘భారతీయులు కప్పు గెలుచుకుంటే చెవి కోసుకుంటాం’ అన్న రీతిలో వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల మధ్య భారత్, వెస్టిండీస్తో టోర్నమెంటులో మొదటి మ్యాచ్ ఆడేందుకు బయల్దేరింది. లండన్ నుంచి మాంచెస్టర్కు ఆరుగంటల ప్రయాణం చేసి అలసిపోయిన ఆటగాళ్లు ఓటమికి సిద్ధంగా ఉన్నారు. కపిల్ మాత్రం విశ్వాసంతోనే ఉన్నాడు. బస్సులోనే టీమ్ మీటింగ్ ఏర్పాటుచేసి… ‘ఆమధ్య ఓసారి మనం వెస్టిండీస్ను ఓడించాం కాబట్టి… మరోసారి వాళ్లను ఓడించే ప్రయత్నం చేద్దాం’ అంటూ ప్రోత్సహించే ప్రయత్నం చేశాడు.
జింబాబ్వేతో 17/5 దగ్గర కపిల్ బరిలోకి దిగాల్సి వచ్చింది. అప్పటికి కపిల్ ఆల్రౌండరుగా పెద్ద పేరేమీ తెచ్చుకోలేదు. కానీ ఆదుకోవాల్సిన సమయం వచ్చింది. నాయకత్వానికి గీటురాయి అదే కదా. ఆ రోజు కపిల్ తన విశ్వరూపాన్ని చూపించాడు. నటరాజ భంగిమతో సహా రకరకాల విన్యాసాలతో బౌలర్లను చెండాడాడు. 175 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వన్డేలలో అప్పటికి అదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఆ మాటకు వస్తే… అప్పటివరకూ భారతీయ ఆటగాళ్లు ఎవ్వరూ వన్డేల్లో సెంచరీ కూడా నమోదు చేసుకోలేదు. కపిల్ సాధించిన ఈ 175 పరుగులతో చాలా రికార్డులే నమోదయ్యాయి. వాటిలో కొన్నిటిని దాటడానికి దశాబ్దాలు పట్టింది. ఉదాహరణకు ప్రపంచకప్లో 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన పిన్న వయస్కుడిగా కపిల్ పేరిట ఉన్న రికార్డు చెరిగి పోవడానికి 36 ఏండ్లు పట్టింది. అయితే కపిల్ లక్ష్యం రికార్డు కాదు. జట్టు విజయం! అది సునాయాసంగా సాధ్యమైంది. దురదృష్టం ఏమిటంటే… నాటి మ్యాచ్ను రికార్డ్ చేయలేదు. దీన్ని ఓ ‘సాధారణ మ్యాచ్’గా భావించిన బీబీసీ, ఉద్యోగులు సమ్మెలో ఉన్నారనే సాకుతో దీని జోలికి పోలేదు.
ఫైనల్స్లోకి అడుగుపెట్టిన భారత జట్టును చూసి వెస్టిండీస్ సంతోషించి ఉంటుంది. ముచ్చటగా మూడోసారి కప్ అందుకోవడానికి అడ్డుగా ఇంత తేలికైన జట్టును వారు ఊహించి ఉండరు. పోటీలో ఇంతదూరం వచ్చినా, ఇంకా ఎవరికీ భారత్ మీద నమ్మకం లేకపోయింది. ‘ఒకవేళ ఆ జట్టు గెలిస్తే ..’ అన్న ఆలోచన కూడా లేకపోవడంతో, ఫైనల్స్ వేడుకలు జరిగే లార్డ్స్ ఎమ్సీసీ క్లబ్లోకి వెళ్లేందుకు భారతీయ జర్నలిస్టులకు అనుమతి కూడా ఇవ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే లోకం అంతా భారత్ గెలవదు అనే దృఢ నిశ్చయంతోనే ఉంది. అందుకు అనుగుణంగానే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 183 పరుగులకు ఆలౌట్ అయింది. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల ధాటికి నిర్ణీత 60 ఓవర్లను సైతం ఆడలేకపోయింది. వెస్టిండీస్ ఆడుతూపాడుతూ లక్ష్యఛేదన మొదలుపెట్టింది. ఆ రోజు వివ్ రిచర్డ్స్ మంచి దూకుడు మీదున్నాడు. ముప్పై ఓవర్లకే ఆట ముగించేలా కనిపించాడు. భారతీయ ప్రేక్షకులు క్రమంగా మైదానాన్ని వీడటం మొదలుపెట్టారు. ‘మా ఆయన్ని ఓ అరగంటలో స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పండి. షాపింగ్ చేయాలి’ అంటూ గవాస్కర్ భార్య, బౌండరీ దగ్గర ఉన్న ఫీల్డర్తో కబురు పంపిందని అంటారు. ఆటైనా, జీవితమైనా… చివరి క్షణం వరకూ లక్ష్యంపై నమ్మకం ఉండాల్సిందే! ఆశ ఉంటేనే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగింది. ఫీల్డర్ లేని చోటును ఎంచుకుని మరీ రిచర్డ్స్ కొట్టిన బంతిని… కపిల్ వెనక్కి పరుగు తీస్తూ పట్టుకున్నాడు. గెలుపు తలుపులు ఓరగా తెరుచుకున్నాయి. కసిమీదున్న ఆటగాళ్లకు ఆ మాత్రం సందు చాలు. 140 పరుగులకే వెస్టిండీస్ను చుట్టబెట్టేశారు.
ప్రపంచకప్ గెలుపుతో మనదేశంలో క్రికెట్ ప్రభ ఒక్కసారిగా వెలిగిపోయింది. 1985లో జరిగిన బెన్సన్ అండ్ హెడ్జస్ టోర్నమెంట్ కూడా నెగ్గడంతో, ఆటకు చరిష్మా తోడైంది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను దాటుకుని కార్పొరేట్ రంగం ఎదుగుతున్న తరుణమది. వాటికి క్రికెట్లో కాసుల గలగలలు వినిపించాయి. ఏకంగా 1987 ప్రపంచకప్ నిర్వహించడానికి రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. స్టేడియంలో ప్రకటనలు, టీవీ ప్రసారాలతో రిలయన్స్ కప్ మంచి ఆదాయాన్నే అందుకుంది. గత ఫలితాల దృష్ట్యా కపిల్నే నాయకుడిగా నియమించారు. 87 కప్ సెమీ ఫైనల్స్ వరకూ చేరుకుంది భారత్. కానీ కీలకమైన సమయంలో కపిల్ తన బ్యాటింగ్తో ఆదుకోకపోవడం వల్లే… ఆ మ్యాచ్ ఓడిపోయారనే విమర్శలు వచ్చాయి. తనను కెప్టెన్సీ నుంచి అర్ధంతరంగా తొలగించేశారు. బాగా ఆడితే ఆకాశానికి ఎత్తేసే అభిమానులు, ప్రదర్శన పేలవంగా ఉన్న రోజున పాతాళానికి తొక్కేస్తారనే నిష్ఠుర నిజం ఆ రోజున తనకు అర్థమై ఉంటుంది. 1987లో జట్టు ఓడిపోయినా, అప్పటికే ఆటపట్ల ఆదరణ పెరిగిపోయింది. అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న సచిన్ టెండుల్కర్ తరాన్ని ఆకట్టుకోగలిగింది. ఇక ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే! క్రికెట్ ఇప్పుడు ఎంతలా ఎదిగినా… దానికి 83 విజయం చేసిన సాయం మరిచిపోలేం. ఏ జట్టును ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళికలు లేవు, ఆధునిక సౌకర్యాలు లేవు, అంచనాలూ లేవు… గెలవాలనే తపన తప్ప. అందుకే ఆశ్చర్యకరమైన ఆ విజయం ఆటకు ప్రాణం పోసింది. ఓ తరానికి ప్రేరణగా నిలిచింది.
సాధించనంత వరకూ గెలుపు ఓ కల. చేరుకోనంతవరకూ విజయం ఓ శిఖరం. ఒక్కసారి అది చేత చిక్కితే, దాని స్వభావం అలవాటైతే… గెలుపే ప్రయాణంగా మారిపోతుంది. అదే జరిగింది. జింబాబ్వే మీద అనూహ్యమైన విజయం తర్వాత దిగ్గజ జట్టు ఆస్ట్రేలియాను ఢీకొంది. అలన్ బోర్డర్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న ఆ జట్టును 118 పరుగుల తేడాతో ఓడించింది. ఇక సెమీఫైనల్స్లో ఆతిథ్య జట్టు ఇంగ్లండును ఎదుర్కోవాలి. పాలకులుగా వాళ్లు మనదేశంలో, తమ వినోదం కోసం ఆడిన క్రికెట్ ఇది. భారతీయుల కండ్ల ముందే ఆడుతూ, వారిని దూరంపెట్టిన ఆట ఇది. ఆడేందుకు ముందుకు వచ్చినవారిని జాతులుగా విభజించిన క్రీడ ఇది. అలాంటి ఆటలోనే వారికి ఎదురు నిలిచిన సందర్భం 1983. అయినా ఎవరికీ భారత్ గెలుస్తుందనే నమ్మకం చిక్కలేదు. అలన్ లాంబ్, డేవిడ్ గోవర్, ఇయాన్ బోథమ్ లాంటి ఆటగాళ్లను భారతీయులు దాటలేరనే నిశ్చయించుకున్నారు. మన ఆటగాళ్లు ఈ తీర్మానాలేవీ పట్టించుకోలేదు. బౌలింగ్కు దిగిన వెంటనే, వికెట్లను చెల్లాచెదురు చేసేశారు. ఆ తర్వాత 213 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించారు.
ఓ జట్టులో 11 మందీ హేమాహేమీలు ఉండవచ్చు. అవతలి జట్టు పసికూనలదే కావచ్చు. కానీ విజయం సాధించాలంటే ఎవరైనా సమష్టిగా రాణించాల్సిందే. ఈ పాఠాన్ని తన తొలి మ్యాచ్లోనే తెలుసుకుంది భారత్. టైటిల్ ఫేవరెట్ వెస్టిండీస్నే ఓడించి సంచలనం సృష్టించింది. తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ కూడా గెలవడంతో… కొడిగడుతున్న ఆశలు తలెత్తాయి. కానీ అంతవరకే! మళ్లీ రెండు వరుస ఓటములతో జట్టు వెనకబడిపోయింది. గాలివాటపు గెలుపులనే వెక్కిరింతలు వినిపించాయి. ఇకనుంచి ప్రతి మ్యాచ్ గెలిస్తే కానీ సెమీ ఫైనల్ చేరుకోవడానికి లేదు. ఇలాంటి నేపథ్యంలో తన అయిదో మ్యాచ్ను జింబాబ్వేతో ఆడేందుకు సిద్ధపడింది. జింబాబ్వే అప్పట్లోనూ ఓ చిన్నజట్టే! అలవోకగా గెలవవచ్చన్న ఆశతో బరిలోకి దిగింది భారత్. ఆటలో ఎప్పుడూ ఇతరులను తక్కువగా అంచనా వేయకూడదనే సూత్రాన్ని మాత్రం మర్చిపోయింది. ఫలితం! 17 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి అవమానకరమైన ఓటమికి సిద్ధపడింది.
‘కపిల్ డెవిల్స్’గా పేరొందిన 1983 జట్టు సభ్యుల్లో ప్రతి ఒక్కరిదీ ఓ ప్రత్యేకమైన కథ. మేనేజర్ మాన్సింగ్నే తీసుకోండి. ఓ ఆటగాడిగా తను తరచూ రిజర్వ్ బెంచ్కు పరిమితం కావడం చూసి డీలాపడిపోయాడు. తెలివిగా నిర్వహణ వైపు అడుగులు వేశాడు. ‘మీరు నన్ను బీసీసీఐ అధికారిగా కాదు, సాటి ఆటగాడిగా చూడండి’ అంటూ సభ్యులతో కలిసిపోయి… అరుదైన ప్రోత్సాహాన్ని అందించాడు. ఇక కపిల్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే! ఇంగ్లిష్ మాట్లాడటం కూడా రానివాడు… ఆంగ్లేయుల గడ్డ మీద ప్రపంచకప్ సాధించాడు. ‘ఈ కప్ కపిల్ చలవే!’ అంటూ ైక్లెవ్ లాయిడ్ సైతం మెచ్చుకున్నాడంటే… తన నాయకత్వ ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. ఇప్పటికీ ప్రపంచ కప్ గెలుచుకున్న నాయకులలో అతనే చిన్నవాడు (24 ఏండ్లు). ఇక క్లాస్ బ్యాట్స్
మెన్గా పేరొందిన దిలీప్ వెంగ్సర్కర్, ఫాస్ట్బౌలర్స్ను నిర్భయంగా చిత్తుచేసే దూకుడైన ఓపెనర్గా శ్రీకాంత్, తొలి తరం ఆటగాళ్లకు వన్డే బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్పిన మొహిందర్ అమర్నాథ్, అత్యుత్తమ వికెట్ కీపర్ కిర్మాణి, ఆల్రౌండర్ రవిశాస్త్రి, అనుభవజ్ఞుడైన గవాస్కర్… ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒకరకమైన ప్రత్యేకత కలిగినవారే!
భజరంగీ భాయిజాన్ లాంటి బ్లాక్బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన కబీర్ ఖాన్.. ఈ సినిమాకు ఆలోచన చేశారు. విస్తృతమైన పరిశోధన తర్వాత స్క్రిప్ట్ రూపొందించుకున్నారు. కపిల్ పాత్రలో, రణ్వీర్ ఒదిగిపోయే ప్రయత్నం చేశాడు. మాన్సింగ్గా పంకజ్ త్రిపాఠి, శ్రీకాంత్గా జీవా, కపిల్ భార్య రోమి పాత్రలో దీపిక పదుకొణె.. తదితరులు నటిస్తున్నారు. కపిల్ ప్రేమకథ నిజంగానే సినిమాను తలపించేది కావడంతో.. రణ్వీర్, దీపిక మధ్య ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. నాటి జట్టులో సభ్యులైన బల్విందర్ సింగ్ సంధు, యశ్పాల్ శర్మ స్వయంగా నటులకు శిక్షణ ఇవ్వడం విశేషం. ఇక రణ్వీర్ అయితే ఏకంగా కపిల్ నుంచే తన పాత్రను, ఆటను తెలుసుకున్నాడు. ఇంత పకడ్బందీగా రూపొందించారు కాబట్టి.. 83 చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే ఆశ ఉంది. పూర్తి ఫలితం తెలియాలంలే 24 డిసెంబరు వరకు ఆగాల్సిందే!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
OTT | 2008లోనే భారత్లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్ఫామ్స్తో లాభమా? నష్టమా?
mini bengal | తెలంగాణలో మినీ బెంగాల్.. కట్టుబొట్టూ అంతా ఉత్తరాది స్టైలే !!
తొలి అనుభవం చాలా ప్రత్యేకం : రాజ్ తరుణ్ హీరోయిన్