OTT | మనిషి తనతో తాను ఎక్కువసేపు గడపలేడు. ఒంటరితనం ఆవహిస్తుంది. ఏకాకినైపోయానన్న భావనతో కుమిలిపోతాడు. అలా అని రోజంతా ఎవరో ఒకరితో మాట్లాడునూ లేడు. అదే జరిగితే యంత్రంగా మారిపోతాడు. అప్పుడప్పుడు, తను ఓ ప్రేక్షకుడిగా ఉండగలగాలి. అది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు. కొత్త విషయాలు తెలుసుకునేందుకు, ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకునేందుకు, వ్యక్తిత్వాలను అంచనా వేసేందుకు, బతుకు తత్వాన్ని ఆకళింపు చేసుకునేందుకు… తన జీవితంలో కొంతభాగం ప్రేక్షకుడిగా ఉండాల్సిందే! అందుకే అనాదిగా దృశ్యపరంగా, శ్రవణరూపంలోనూ రకరకాల మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అవీ కొత్త పోకడలు నేర్చాయి. అలా ఇప్పుడు ఒటీటీల హవా మొదలైంది. స్థూలంగా చూస్తే ఇది ఓ మార్పు మాత్రమే. కానీ వెనక్కి చూసుకుంటే… సమయానికి తగిన మజిలీ ఇది. అందులోనూ ప్రాంతీయ భాషలకు ఆదరణ లభించడం మరో పరిణామం.
ఇప్పటితరానికి వింతగా తోచవచ్చు. కానీ మూడు దశాబ్దాల క్రితం… ఇంట్లో టీవీ ఉండటం అనేది ఓ కలలాంటి విలాసం. నచ్చిన కార్యక్రమం స్పష్టంగా, అంతరాయాలు లేకుండా రావడం మహా అదృష్టం. నిచ్చెనలాంటి యాంటినాలతో ప్రేక్షకులు వైకుంఠపాళి ఆడాల్సి వచ్చేది. క్రమంగా నిచ్చెనల స్థానంలో గొడుగులు వచ్చాయి. కానీ కార్యక్రమాల ఎంపిక అంతంత మాత్రమే. రోజులు గడిచేకొద్దీ చానల్స్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. పాటలకూ, వార్తలకూ, భక్తికీ, సినిమాలకూ, ఆఖరికి కామెడీకి కూడా ప్రత్యేక చానల్స్ అందుబాటులోకి వచ్చాయి. కండ్ల ముందు ఇన్ని తెరలు సాక్షాత్కరిస్తున్నా ఇంకా ఏదో అసంతృప్తి! కుటుంబంతో కలిసి టీవీ ముందు గడుపుతున్నప్పుడు, మనకు నచ్చిన సినిమా ఏదో చూడాలనిపిస్తుంది. జీవితం బోర్ కొట్టేస్తున్న సమయంలో ఉత్కంఠ భరితమైన కథ కావాలనిపిస్తుంది. ప్చ్.. టీవీ మన మనసు మాట వినదే. తనకు నచ్చిన కార్యక్రమాలను.. అదీ సుదీర్ఘమైన ప్రకటనలు రంగరించి అందిస్తుంది. ఇక ఇంటర్నెట్లో వెతుకులాట అంత తేలిక కాదు. ఇందుకు పరిష్కారంగా చాలా రోజుల క్రితమే ఓటీటీ (ఓవర్ ద టాప్) ప్లాట్ ఫామ్లు వచ్చాయి.
దాదాపు 13 ఏండ్ల క్రితం… అంటే 2008లోనే మనదేశంలో ఓటీటీ సేవలు మొదలయ్యాయి. రిలయన్స్కు చెందిన బిగ్ఫ్లిక్స్ను దేశంలో తొలి ఓటీటీగా పేర్కొంటారు. కానీ ఇది ప్రేక్షకులకు చేరువ కాలేకపోయింది. 2010 తర్వాత, కాలం కలిసి రావడం మొదలైంది. డేటా చవకగా మారింది. 3జీ, 4జీ సాంకేతికతలతో వేగం పుంజుకుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ఇది ఓటీటీలకు సానుకూలమైన వాతావరణమే! దాంతో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్ లాంటి ప్లాట్ఫామ్స్ యాప్స్ను విడుదల చేశాయి. అయినా జనం వాటికి దూరంగానే ఉండిపోయారు. కేబుల్ టీవీకి నెలనెలా డబ్బులు కడుతూ, మళ్లీ ఒకటి రెండు సినిమాల కోసం భారీ రుసుము చెల్లించాలన్న ఆలోచనే వారికి నచ్చలేదు. అందులోనూ వాటిలో ఇంగ్లిష్ లేదా హిందీ సినిమాలు, సిరీస్ మాత్రమే అందుబాటులో ఉండటం మరో అడ్డంకి. అడపాదడపా నార్కోస్, మెంటలిస్ట్ లాంటి సిరీస్లు ఊరించినా… జనం ఓపిక పట్టారు. కొవిడ్తో అంతా తారుమారైపోయింది!
2017లో ఓటీటీ మార్కెట్ రెండువేల కోట్ల రూపాయలు మాత్రమే. కానీ, కొవిడ్ పుణ్యమా అని చాలా ఓటీటీ సంస్థల ఎదుగుదల 30 నుంచి 140 శాతం వరకు పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి. కొవిడ్ సమయంలో ఓటీటీలు అంతులేని కాలక్షేపాన్ని ఇచ్చాయి. నాలుగు గోడల మధ్య కొత్త ప్రపంచాన్నీ పరిచయం చేశాయి. థియేటర్లు, మాల్స్ మూతబడటంతో పెద్దతెరకు ప్రత్యామ్నాయంగా నిలిచాయి. ‘ఆకాశం నీ హద్దురా’, ‘V’ లాంటి పెద్ద సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేసేంతగా పెరిగింది ఆదరణ. అలా 2021 నాటికి ఓటీటీ వ్యాపారం పదివేల కోట్ల రూపాయలను దాటేసింది. జియో రాకతో బ్రాడ్ బ్యాండ్ మరింత చవకైంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఓటీటీ వేదికలు చందా ధరలను తగ్గించాయి. అలా అన్నీ కలిసొచ్చి… భారతీయులు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు. ఈ వినోద వ్యాపారం 2030 నాటికి 90 వేల కోట్లను చేరుతుందంటారు.
ఓటీటీలు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ అందించే ప్రయత్నం కనుక చేయకపోయి ఉంటే… లాక్డౌన్ తర్వాత చాలా వాటికి తాళాలు పడిపోయేవే. కారణం స్పష్టం. అలవాటు చొప్పునో, దర్పం కోసమో మనం ఏ భాషలో అయినా మాట్లాడవచ్చుగాక! కానీ మనసు మాత్రం మాతృభాషలోనే ఆలోచిస్తుంది. మనదైన జీవన విధానానికి త్వరగా స్పందిస్తాం. అమ్మభాషను స్వచ్ఛంగా ఆస్వాదిస్తాం. అందుకే, రాబోయే కాలంలో ఆన్లైన్లో మాతృభాషే రాజ్యమేలుతుందని గూగుల్ 2017లోనే అంచనా వేసింది. ఇంగ్లిష్, హిందీలకు దీటుగా బెంగాలీ, తెలుగు, తమిళం, మరాఠీ భాషలు ఇంటర్నెట్లో కనిపిస్తాయని తేల్చింది. 2020లో జరిగిన గూగుల్ సర్వేలో 90 శాతం మంది ప్రజలు తమ మాతృభాషలోనే అంతర్జాలాన్ని శోధించేందుకు ఇష్టపడుతున్నారని తేలింది. ఈ స్వభావాన్ని గమనించిన ఓటీటీలు ప్రాంతీయతకు ప్రాధాన్యత పెంచాయి. ‘మూడేండ్ల క్రితం ఓటీటీలలో స్థానిక కంటెంట్ 20 శాతం మాత్రమే ఉండేది. ఇప్పుడది 60 శాతానికి చేరుకుంది’ అంటారు మార్కెట్ విశ్లేషకులు కరణ్ తౌరని. పైగా ఇప్పుడు దేశంలో ఏ మూల మంచి సినిమా వచ్చినా, అది సోషల్ మీడియాలో చర్చకు వస్తుంది. ఉదాహరణకు ‘ద గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమానే తీసుకోండి. మొదట్లో ఈ చిత్రాన్ని పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ పట్టించుకోలేదు. విమర్శకుల నుంచి మంచి స్పందన రాగానే అమెజాన్ వెనక్కి వచ్చి ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక భాషల్లో వీలైనంత ఎక్కువ కంటెంట్ అందేలా అవి ప్రయత్నిస్తున్నాయి.
2018లోనే అమెజాన్ తెలుగులో తన తొలి వెబ్ సిరీస్ ‘గ్యాంగ్స్టర్స్’ను విడుదల చేసింది. జగపతిబాబు, నవదీప్, పోసాని కృష్ణమురళి, శివాజీ లాంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ సిరీస్కు ఆశించినంత ప్రచారం రాకపోయినా ఒక కొత్త ప్రయత్నానికి నాంది పలికింది. ఇదే బాటలో జీ5 ‘చదరంగం’, ‘ఎక్స్పైరీ డేట్’, ‘లూసర్’ లాంటి సిరీస్లతో పోటీలో నిలిచింది. ‘మా వీక్షకులలో దాదాపు 50 శాతం మంది స్థానిక భాషల కార్యక్రమాలను చూస్తున్నారు. అందుకే రాబోయే రోజుల్లో ప్రాంతీయత మీద మరింత పెట్టుబడి పెట్టబోతున్నాం’ అంటున్నారు జీ5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీశ్ కల్రా. తమ దెప్పుడూ అంతర్జాతీయ స్థాయే అన్నట్టు వ్యవహరించే నెట్ ఫ్లిక్స్ కూడా ప్రాంతీయ శక్తిని గుర్తించక తప్పలేదు. దక్షిణాది భాషల్లో తొలిసారిగా ‘పావ కథైగళ్’ పేరుతో నాలుగు ఎపిసోడ్ల తమిళ సిరీస్ను విడుదల చేసింది. ప్రకాష్ రాజ్, సాయిపల్లవి, అంజలి లాంటి మేటి నటులతో తీసిన ఈ సిరీస్కు మంచి పేరు రావడంతో… తెలుగులోనూ ‘పిట్టకథలు’ పేరుతో రూపొందించింది. ఒకప్పుడు వెబ్సిరీస్లో నటించడం లేదా దర్శకత్వం వహించడం అంటే చిన్నచూపుగా ఉండేది. కొందరు నిపుణులు ‘ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్ సిరీస్ జోలికి పోమంటూ’ నేరుగానే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అనురాగ్ కశ్యప్, రాధికా ఆప్టే లాంటివాళ్లు ఓటీటీలకు పరిమితమైనప్పుడు అంతా వింతగా చూశారు. కానీ వ్యాపారం ఎదుగుతున్న కొద్దీ, దాని బ్రాండ్ విలువ కూడా పెరుగుతూ వచ్చింది. ఒకరి తర్వాత ఒకరు ఉద్దండులంతా ప్రవేశించారు. ఇతరులకూ ఓ దారి చూపించారు. అలా ఓటీటీలలో మనదైన సెలబ్రిటీల సందడి ఉండటం… ప్రాంతీయ సేవలకు కలిసొచ్చిన అంశం.
మనదేశంలో మూడు కోట్ల మందికి పైగా మాట్లాడే స్థానిక భాషలు పది ఉన్నాయి. ఇక ప్రపంచమంతా విస్తరించిన భారతీయుల సంగతి చెప్పక్కర్లేదు. బెంగాలీ, తమిళం, తెలుగు మాట్లాడేవారు విదేశాల్లోనూ కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఈ సంఖ్యలను విస్మరించలేం. కోల్కతాకు చెందిన ‘హోయ్చోయ్’ సంస్థ ఈ విషయాన్ని కొంచెం ముందుగానే పసిగట్టింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకు పైగా ఉన్న బెంగాలీలను ఆకట్టుకునేందుకు 2017లోనే ప్రాంతీయ ఓటీటీ ప్లాట్ఫామ్ను మొదలు పెట్టింది. వందలాది సినిమాలతో పాటు విస్తృతమైన వెబ్ సిరీస్తో దూసుకుపోతున్నది. ఒక్క 2021లోనే 25 వెబ్ సిరీస్లను విడుదల చేసింది హోయ్చోయ్. అన్నీ మంచి ఆదరణ పొందాయి. బెంగాలీకే పరిమితమైన ‘అడ్డా టైమ్స్’ కూడా మంచి లాభాలే సంపాదిస్తున్నది. మలయాళ సీమలోనూ ఓటీటీలు మొదలయ్యాయి. ఇందుకు ప్రేక్షకుల ఆదరణ మీద నమ్మకం ఒక్కటే కారణం కాదు. దేశవ్యాప్తంగా, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కేరళవాసుల సంఖ్యా తక్కువేం కాదు. తమవైన సినిమాలు చూపించే యాప్లను వాళ్లు ఆదరిస్తారనే ఆశ. అందుకే కూడె, బి4మూవీస్, మనోరమ మ్యాక్స్ లాంటి యాప్స్ కేవలం మలయాళ చిత్రాలు, సిరీస్ కోసమే రూపొందాయి. మరాఠీ, ఒడియా, గుజరాతీ, పంజాబీ, కన్నడ లాంటి భాషల్లోనూ ఓటీటీ సంస్థలు మంచి వృద్ధినే సాధిస్తున్నాయి. ప్లానెట్ మరాఠీ, ఓహో (గుజరాతీ), ఒలీ ప్లస్ (ఒడియా), హీరోజ్ (పంజాబీ), టాకీస్ (కన్నడ) స్థానిక మార్కెట్ను ఏలుతున్నాయి. ఈ పరిణామం ఎంత వేగంగా ఉందంటే… వినోద మాధ్యమాల పరంగా చిన్న మార్కెట్గా భావించే అస్సామీ భాషలోనూ ఓటీటీలు ప్రవేశించాయి. వారికి ‘రీల్ డ్రామా’ అనే యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇన్ని భాషల గురించి చెప్పుకున్నాక తమిళాన్ని మర్చిపోలేం కదా. నరనరాన సినిమా ప్రేమ ఉన్న తమిళ తంబిలను ప్రత్యేకంగా ఆకట్టుకునేందుకు రీగల్ టాకీస్, ఫ్లిక్స్డా లాంటి యాప్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకే భాషకు మాత్రమే పరిమితమైన యాప్స్. కానీ చాలా ఓటీటీలు ఏదో ఒక ప్రాంతీయ భాషకే పరిమితం కావడం లేదు. ఉదాహరణకు ‘సన్ నెక్ట్స్’ తెలుగు సహా ఆరుభాషల్లో కంటెంట్ అందిస్తోంది. ఏషియా నెట్, ఈరోస్, హంగామా ప్లే, ఆల్ట్ బాలాజీ… ఇలా ఎన్నో ఓటీటీలు ఇంగ్లిష్ జోలికి పోకుండా ప్రాంతీయ భాషలకే పరిమితం అయ్యాయి. ఇదే వాటి విజయ రహస్యం.
తెలుగువారు వినోదప్రియులు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. అందుకు ఓటీటీలూ మినహాయింపు కాదు. ఈ విషయాన్ని గ్రహించాయి కాబట్టే అమెజాన్, జి5 లాంటి సంస్థలు ఆరంభం నుంచే తెలుగు మీద శ్రద్ధపెట్టాయి. 2020 ఏప్రిల్లో సరికొత్త తారాగణంతో రూపొందిన ‘అమృతరామమ్’ ఓటీటీలో నేరుగా విడుదల అయిన తొలి తెలుగు సినిమాగా చెబుతారు. ఆ తర్వాత నవదీప్ నటించిన ‘రన్’ వచ్చింది. ఇక సందిగ్ధత మొదలైంది. లాక్డౌన్ ముగిసి థియేటర్లు తెరిచేవరకూ ఎదురుచూడటమా, లేకపోతే నామమాత్రపు లాభాలకు ఇక్కడే వదలడమా అనే మీమాంస కొనసాగింది. నాని ‘V’ తో ఓటీటీ వైపు గాలి మళ్లింది. ‘నారప్ప’ సక్సెస్తో ఉధృతి పెరిగింది. హిట్, టక్ జగదీష్, మ్యాస్ట్రో, జై భీమ్.. వరుస విజయాలతో తిరుగులేకుండా పోయింది. ఓ బడా తెలుగు ప్రొడ్యూసర్, హీరో సోదరులు తమ రెండు సినిమాలను 70 కోట్లకు పైగా రూపాయలకు ఓటీటీకి అమ్ముకున్నారనే వార్త… లోకల్ కంటెంట్ సత్తా చెబుతున్నది. తెలుగు ఓటీటీ అవకాశాన్ని త్వరగానే అందిపుచ్చుకున్నారు అల్లు అరవింద్. అచ్చంగా తెలుగు కంటెంట్ కోసం ‘ఆహా’ యాప్ను రూపొందించారు. తక్కువ ధరతో, చిన్న బడ్జెట్ సినిమాలతో నిదానంగా అడుగులు వేశారు. ‘ఆహా’లో విడుదల అయిన కలర్ ఫొటో, అర్జున్ సురవరం లాంటి చిత్రాలు మంచి పేరు సంపాదించడంతో సబ్స్క్రిప్షన్లు పెరిగాయి. అదే సమయంలో మలయాళంలో హిట్ అయిన సినిమాలను డబ్ చేసి విడుదల చేయడం మొదలుపెట్టారు. ఈ వ్యూహం ఫలించింది. తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు సరేసరి! గీత సుబ్రహ్మణ్యం, కొత్త పోరడు, కమిట్మెంటల్ లాంటి సిరీస్తోనూ మంచి విజయాలే సాధించింది. దాంతో టాక్ షోస్తో విస్తృతి పెంచింది. సమంత (శామ్ జామ్), రానా (నెం.1 యారి)తో మొదలై ఇప్పుడు ఏకంగా బాలకృష్ణనే (అన్స్టాపబుల్) రంగంలోకి దించింది.
ప్రస్తుతం తెలుగు ఓటీటీ బాగానే వెలుగుతోంది. సెలబ్రిటీలంతా ఇక్కడే కనిపిస్తున్నారు. కాజల్, తమన్నా, అమలాపాల్, శృతి హాసన్, సత్యదేవ్, శ్రీకాంత్, సూర్య… ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సిరీస్తో పలకరిస్తున్నారు. ‘ఆహా’ బాటలోనే మరికొన్ని తెలుగు సంస్థలు ఓటీటీలో అడుగుపెట్టబోతున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 20కి పైగా యాప్స్ తెలుగులో కార్యక్రమాలు అందిస్తున్నాయి కాబట్టి… రాబోయే రోజుల్లో తెలుగు ఓటీటీల మధ్య పోటీ తీవ్రంగానే ఉండబోతున్నది.
130 కోట్లకు పైగా ఉన్న భారతీయ జనాభాలో 25 శాతం మంది మాత్రమే ఓటీటీకి చేరువయ్యారని ఓ అంచనా. అంటే మార్కెట్ను పెంచుకొనే అవకాశం ఉన్నట్టే. కానీ ఇదేమంత తేలిక కాదు. ఒక్కో సినిమా కోసం ఒక్కో యాప్కు చందా కడుతుంటే, జేబులు గుల్లవుతున్నాయనే చిటపటలు వినిపిస్తున్నాయి. థియేటర్లను బతికించేందుకు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే పద్ధతి మానుకోవాలనే హెచ్చరికలూ పెరుగుతున్నాయి. లాక్డౌన్ తర్వాత మళ్లీ మొదలైన పరుగుల జీవితాలతో విరామపు వెసులుబాటు తగ్గిపోయింది. ఇవన్నీ ఎదుగుదలకు అడ్డంకులే! కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం. ప్రేక్షకులకు ఓటీటీ అనే సాధనం అలవాటైంది. మంచికథ ఎక్కడ ఉన్నా, దాన్ని చూడాలనుకునే అభిరుచి పెరిగింది. కాబట్టి సబ్స్ర్కైబర్ల మనసెరిగి, మంచికథలను అందించగలిగితే… లాభాలపరంగా సంస్థలకు, వినోదపరంగా ప్రేక్షకులకూ సంతృప్తి.
ఓటీటీ సేవలు విస్తరిస్తున్న కొద్దీ వాటి కొనుగోలు సామర్థ్యం కూడా పెరిగిపోతున్నది. ప్రేక్షకులు చూస్తారని అనుకుంటే 30-40 కోట్లు చెల్లించేందుకూ అవి సిద్ధపడుతున్నాయి. థియేటర్ల సమస్యతో సతమతమవుతున్న ప్రాంతీయ సినిమాకు ఈ పరిణామం ఊరటే. ఇక చిన్న సినిమాలకు కూడా భరోసాగా నిలుస్తున్నాయి. జోజి (మలయాళం), ఆప్లా మానుస్ (మరాఠి), విలేజ్ రాక్స్టార్స్ (అస్సామీ) లాంటి సినిమాలు… కథ నచ్చితే భాషకు అతీతంగా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాయి. దాంతో వినూత్నమైన కథలను స్వీకరించేందుకు ఓటీటీలు ముందుకు వస్తున్నాయి. స్క్రిప్ట్ బాగుంటే తామే పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధపడుతున్నాయి. సిరీస్లకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. ఉదాహరణకు స్కిడ్ గేమ్ అనే కొరియన్ థ్రిల్లర్ను నెట్ఫ్లిక్స్ సుమారు 150 కోట్లతో నిర్మించింది. దీని మీద ఏడువేల కోట్లకు పైగా లాభం వచ్చిందని అంచనా. ఇందుకు ముఖ్య కారణం… అది కొరియన్ కథ అన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడమే. దీనినిబట్టి ప్రాంతీయ కథల్లో దమ్ముంటే ఇటు స్థానికులనూ, అటు ప్రపంచ పౌరులనూ ఆకట్టుకుంటాయని అర్థమవుతున్నది.
తమిళంలో ఓ అద్భుతమైన సినిమా వచ్చింది. ప్రశంసల వెల్లువతో ఓటీటీలో ఊరిస్తున్నది. ఏం లాభం? ఒక్కముక్క కూడా అర్థం కాదు. మెదడును అంతలా శ్రమపెట్టే ఓపిక చాలామందికి ఉండదు. అందుకే డబ్బింగ్ ద్వారా అరుదైన సినిమాలు, సిరీస్లను ప్రజలకు చేరువ చేసే ప్రయత్నం చేశాయి ఓటీటీలు. ఇతర భాషల నుంచి స్థానికతకు మళ్లే సంధికాలంలో ఈ ప్రయత్నం చాలా ఉపయోగపడింది. ముఖ్యంగా ‘ఆహా’లాంటి వేదికలు ప్రాంతీయేతర సినిమాలను తెలుగు ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నం చేశాయి. ఆండ్రాయిడ్ కుంజప్పన్, నాయాట్టు, ఫోరెన్సిక్, బెల్ బాటమ్, ట్రాన్స్ తదితర సినిమాలు తెలుగు స్వరాలతో దుమ్ము రేపాయి. ఇక సిరీస్లు కూడా వెనక్కి తగ్గింది లేదు. బ్రీత్, ఫ్యామిలీ మ్యాన్, పాతాళ్ లోక్, క్వీన్, ఢిల్లీ క్రైమ్ లాంటి హిందీ సిరీస్తో పాటుగా మనీ హెయిస్ట్ లాంటి అంతర్జాతీయ థ్రిల్లర్స్ కూడా తెలుగులో వినిపించాయి. మీర్జాపూర్ అయితే బూతులతో సహా అనువాదం అయిపోయింది. అనువాదాలు మరింత నాణ్యతగా, జాగ్రత్తగా ఉండాలనే సూచనా లేకపోలేదు. ఉదాహరణకు ఈమధ్య విడుదల అయిన ఒక వంద కోట్ల సినిమాలో ‘మూడు నెలల తర్వాత’ అన్న ైస్లెడ్కు బదులు ‘మూడు నెలల ముందు’ అన్న వాక్యం కనిపించి గందరగోళం సృష్టించింది. ఇక ప్రేక్షకులకు అర్థం అయితే చాలు… అనువాదాల విషయంలో మరీ అంత శ్రమించాల్సిన పనిలేదు అనే దృక్పథమూ కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన మీనాక్షి సుందరేశ్వర్ సినిమాలో తెలుగు మాటలు, మధ్యలో హిందీ పాటలు వినిపించడమే అందుకు ఉదాహరణ! ప్రయోగాలను ఆదరించడానికి ప్రేక్షకుడు సిద్ధంగా ఉంటాడని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలే.
థియేటర్లలో విడుదల అయ్యే సినిమాలను పైరసీ చేయడం అంత తేలిక కాదు. హాల్లో తీసిన ‘కెమెరా ప్రింట్’ చూసేందుకు జనం ఇష్టపడేవారు కాదు. ప్రొజెక్టరు నుంచి నేరుగా సినిమాను దొంగిలించవచ్చు కానీ… ప్రింట్ మీద ఉన్న వాటర్ మార్కును చూసి, నేరస్తులను పట్టేయడానికి వీలయ్యేది. ఈ అడ్డంకులను దాటుకుని పైరసీ వర్ధిల్లినా… ఓటీటీలు పైరసీని మరింత సులువు చేసేశాయనే వాదన ఉంది. అది అందరికీ నష్టమే! ఓ అంచనా ప్రకారం పైరసీ వల్ల ఓటీటీ సంస్థలు 30 శాతం ఆదాయాన్ని కోల్పోతున్నాయి. చిన్న సంస్థలకైతే చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి వస్తున్నది. అవి సబ్స్ర్కైబర్లను ఆకట్టుకోవడానికి ప్రతిష్టాత్మకంగా ఏదో ఒక సిరీస్నో, సినిమానో విడుదల చేస్తాయి. ఆ ఒక్క ఆస్తినీ పైరసీ కబ్జా చేసేస్తున్నది. ఉదాహరణకు, హర్షద్ మెహతా జీవితం ఆధారంగా సోనీ ‘స్కామ్ 1992’ అనే సిరీస్ అందించింది. అలాగే బాబీ డియోల్ను దొంగస్వామిగా చూపిస్తూ ఎమ్ఎక్స్ ప్లేయర్ ‘ఆశ్రమ్’ సిరీస్ రూపొందించింది. ఈ రెండూ కూడా అరగంటలోనే ఆన్లైన్లో ప్రత్యక్షం అయ్యాయి. అంతేకాదు! ఒకప్పుడు ఆన్లైన్లో పైరసీ సినిమాలను డౌన్లోడ్ చేసుకోవడానికి టొరెంట్ గురించి పరిజ్ఞానం కావల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు! ఐబొమ్మ లాంటి సైట్లు ఒకే ఒక్క క్లిక్తో, ఓటీటీలో లభ్యం అయ్యే ప్రతి సినిమానీ అందిస్తున్నాయి. టెలిగ్రామ్లోనూ చాలా సినిమాలు అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్ టీవీ రీసెర్చ్ అనే సంస్థ అంచనా ప్రకారం పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2022 నాటికి ఓటీటీ సంస్థలు రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోనున్నాయి. డౌన్లోడ్ను అడ్డుకునే సాంకేతికతతో పాటు కఠినమైన చట్టాలు మాత్రమే ఈ దురవస్థను ఆపగలవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఓటీటీలతో మీ ఇల్లే ఒక మినీ థియేటర్ చేసుకోండి..
Naga Chaitanya: నాగ చైతన్య సినిమాపై రూమర్స్.. ఖండించిన చిత్ర బృందం
ఆ విషయంలో మా అమ్మ చెప్పినా వినను.. ఓపెన్ అయిన రష్మిక
Akhanda: అఖండ సినిమాని ఇంత త్వరగా ఓటీటీలోకి తీసుకురాబోతున్నారా..!