Prakruthi Prakash | అదొక మర్రిచెట్టు. 70 ఏండ్ల వయసు ఉంటుంది. భారీ వర్షాలకు కూకటివేళ్లతో పెకిలిపోయింది. మహావృక్షం మోడుగా మారింది. ప్రకృతిని ప్రేమించే ఒక యువకుడిని ఈ సంఘటన కదిలించింది. ప్రాణవాయువునిచ్చే ఆ మహావృక్షానికి ఆయువు పోశాడు.. దొబ్బల ప్రకాశ్ అలియాస్ ప్రకృతి ప్రకాశ్!
చెట్టు.. మనిషికి ప్రాణవాయువును అందిస్తుందని మనకు తెలుసు. కానీ కండ్లముందే ఆ చెట్టు కూలిపోతున్నా పట్టించుకోం. అవసరం లేకున్నా ఎడాపెడా నరికేస్తుంటాం. ఇలాచేస్తే పర్యా
వరణం పరిస్థితి ఏమిటి? మనిషి మనుగడ ఎలా సాధ్యం అవుతుంది? అన్న ఆలోచన డాక్టర్ ప్రకృతి ప్రకాశ్ను లక్ష్యం వైపు నడిపింది. ఓ మహావృక్షానికి ఆయువు పోసేలా చేసింది. మూడునెలల నాటి మాట… భారీ వర్షాలకు సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామ శివారులో.. ఓ పొలంలోని డబ్బు ఏండ్ల మర్రిచెట్టు నేలకూలింది. చూస్తుండగానే మోడుగా మారింది. ఏండ్ల తరబడి ఎండా వానల్లో దాపునిచ్చిన మర్రిమాను నిర్జీవంగా మారడం అందరినీ కలతకు గురిచేసింది. అటువైపు ఎవరు వెళ్లినా మర్రి గురించి బాధపడటం ప్రకాశ్ గమనించాడు. మొన్నటివరకు ఓ మహా
వృక్షంగా ఎంతోమందికి నీడను, ఎన్నో పక్షులకు గూడును ఇచ్చిన మర్రిచెట్టు మోడువారడం అతడిని ఆలోచింపజేసింది. తాను రుద్రంగి వసతి గృహంలో ఉంటూ చదువుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. చెట్టులేకపోతే ప్రకృతికి జరిగే నష్టాన్నీ విశ్లేషించుకున్నాడు. అందరూ ఊడలమర్రికి ఆయువు తీరిందని ఆశ వదులుకున్నారు. ప్రకాశ్ మాత్రం నీళ్లు పోస్తే చిగురిస్తుందన్న ఆశా
భావంతో అడుగు ముందుకేశాడు.
రాజన్న సిరిసిల్ల డీపీఆర్వోలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగి ప్రకాశ్. రోజూ వచ్చీపోయే దారిలో తారసపడే ఈ నిర్జీవ వటవృక్షాన్ని చూడలేక రైతులతో మాట్లాడాడు. మోడువారిన చెట్టుకు తిరిగి ప్రాణం పోసి అక్కడినుంచి మరోచోటుకు తరలిస్తానని చెప్పాడు. దొబ్బల దాస్ అనే రైతు పొలం దగ్గరున్న బావి నీళ్లను వాడుకుంటానని అడిగాడు. దాస్ సరేనన్నాడు. సుమారు రెండునెలల పాటు క్రమం తప్పకుండా ఆ మోడుకు నీళ్లు అందించాడు. ప్రకాశ్ కృషి ఫలించింది. చెట్టు తిరిగి చిగురించడం ప్రారంభించింది. ప్రకాశ్లో ఉత్సాహం పెరిగింది. ఇంకొంతకాలం నీళ్లు పట్టాడు. ఫలితంగా మోడువారిన చెట్టు కొత్త ఆకులతో పచ్చగా దర్శనం ఇవ్వసాగింది. చెట్టు వేళ్లు బయటికి వచ్చాయి. ట్రాన్స్లొకేషన్ ద్వారా చెట్టును మరోచోటికి తరలించాలన్నది ఆలోచన.
సీఎం కేసీఆర్ ‘తెలంగాణకు హరితహారం’ పిలుపును అందిపుచ్చుకున్నాడు ప్రకాశ్. పద్మశ్రీ వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలో పచ్చదనం పెంచేందుకు తనవంతు కృషిచేస్తున్నాడు. బాధ్యతగా వందలాది మొక్కలు నాటుతున్నాడు. చెట్లను పరిరక్షిస్తున్నాడు. వేసవికాలం విత్తనాలను సేకరించి, వర్షకాలంలో డ్రోన్ సాయంతో జిల్లాలోని గుట్టల్లో వాటిని వెదజల్లుతున్నాడు. దీంతో, దొబ్బల ప్రకాశ్ కాస్తా ప్రకృతి ప్రకాశ్గా మారిపోయాడు. ప్రకాశ్ సేవలను గుర్తించిన తమిళనాడులోని ఓ విశ్వవిద్యాలయం సామాజిక సేవా విభాగంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. చెట్టు ఉంటేనే గాలి. గాలి ఉంటేనే మనిషి. మనిషి ప్రపంచంలోకి చెట్టు చొచ్చుకు రాలేదు. చెట్ల ప్రపంచంలోకే మనిషి దౌర్జన్యంగా వచ్చాడు.
తన చేతులతో ప్రాణం పోసుకున్న మర్రిచెట్టును గ్రామంలోని బడికి తరలించాలన్నది ప్రకాశ్ ఆలోచన. ఆ మాను విద్యార్థులకు చక్కటి నీడను ఇవ్వడమే కాకుండా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తుందని ఆయన ఆశ. అనుకున్నట్టుగా చెట్టును తరలించాలంటే కొమ్మల కత్తిరింపు, ఎత్తడం, రవాణా చేయడం, మళ్లీ నాటడం వంటి వివిధ దశలు ఉంటాయి. దీనికోసం ఎంతలేదన్నా రూ.50 వేల వరకు ఖర్చు అవుతుంది. మర్రిచెట్టుకు ప్రాణమైతే పోయగలిగాడు కానీ అంత ఖర్చును వెచ్చించే స్తోమత ప్రకాశ్కు లేదు. పర్యావరణ ప్రేమికులు, దాతలు ఎవరైనా ముందుకువస్తే ఈ 70 ఏండ్ల మహా వృక్షాన్ని ట్రాన్స్లొకేషన్ పరిజ్ఞానంతో తమ ఊరి బడికి తరలించవచ్చని అనుకుంటున్నాడు.
…✍ చింతల నగేశ్కుమార్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Jobs | నిరుద్యోగులకు ఓ ఉపాధ్యాయుడి కానుక.. లైబ్రరీ, వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి మరీ..
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?