jobs | ఆ గ్రంథాలయంలో కాలుపెట్టగానే ఉద్యోగార్థులకు ఎక్కడలేని ఆత్మ విశ్వాసం వస్తుంది. చుట్టూ ఉన్న పోటీ పరీక్షల పుస్తకాలను చూడగానే.. ‘కష్టపడితే ఉద్యోగం ఖాయం’ అన్న భరోసా కలుగుతుంది. అలా అని, అదేదో ప్రభుత్వ గ్రంథాలయం కాదు. నిరుద్యోగుల కోసం ఓ ఉపాధ్యాయుడి కానుక. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉందీ కొలువుల పుస్తక నిలయం.
పట్టణాలు, నగరాల్లో యువతకు కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీల కొరతా ఉండదు. అదే, గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధం కావడం అంత సులభమైన విషయం కాదు. ఇదో రకంగా ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడమే. ఆ లోటును సరిచేసేందుకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మల్కిరెడ్డి మోహన్రెడ్డి ఏకంగా ఓ లైబ్రరీని స్థాపించాడు. ఇదే మండలం మీర్జాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పనిచేస్తున్నారాయన. త్వరలోనే వివిధ ఉద్యోగాలకు భారీ ఎత్తున నియామకాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన సమయం ఇది. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు తనవంతు సహకారం అందించాలనుకున్నారు మోహన్రెడ్డి. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే, డీఎస్సీ, లెక్చరర్స్, గురుకుల టీచర్స్, అసిస్టెంట్ ఇంజినీర్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ తదితర ఉద్యోగాలకు గురిపెట్టిన యువత కోసం పోటీ పరీక్షల గ్రంథాలను కొనుగోలు చేశారు. నిత్యం ఓ అరవైమంది యువతీ యువకులు ఈ గ్రంథాలయానికి వచ్చి చదువుకొంటున్నారు.
యువతకు స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచడంతో పాటు ‘ఎంప్లాయిమెంట్ న్యూస్’ అనే వాట్సాప్ గ్రూపును ఏర్పాటుచేసి సలహాలు, సూచనలు ఇస్తున్నారు మోహన్రెడ్డి. ఈ బృందంలో 133 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 110 మంది ఉద్యోగార్థులు, మిగతా 23 మందిలో వివిధ రంగాల్లో నిపుణులు గ్రూప్స్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారూ ఉన్నారు. వీరు నిత్యం ఏదో ఒక కొత్త అంశాన్ని చర్చిస్తుంటారు. చదవాల్సిన పుస్తకాలను సిఫారసు చేస్తుంటారు.
‘గ్రామీణ యువతకు కోచింగ్ సెంటర్లలో చేరే పరిస్థితి ఉండదు. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారికి ఎంతో కొంత ఉపయోగపడాలనే లక్ష్యంతోనే మా ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశాను. నిపుణుల సలహాల ప్రకారం స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచాను. ఇక్కడే కూర్చుని చదువుకోవచ్చు. రాబోయే నోటిఫికేషన్లలో హుస్నాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాల యువత ఎక్కువ ఉద్యోగాలు సాధించాలన్నది నా ఆకాంక్ష’ అంటారు మల్కిరెడ్డి మోహన్రెడ్డి. ఈ ప్రయత్నంలో ఆయన సతీమణి మాధవి కూడా ఎంతగానో సహకరిస్తున్నారు. ‘గ్రంథాలయానికి వచ్చే యువతీ యువకులకు కావాల్సిన పుస్తకాలను అందిస్తుంటాను. వీలైనంత ఎక్కువమందికి ఇవి చేరాలన్నది మా సంకల్పం’ అంటారామె.
మోహన్రెడ్డి గ్రంథాలయం యువతలో పట్టుదల పెంచుతున్నది. కొలువు సాధించి తీరాలన్న తపన రగిలిస్తున్నది. ‘గతంలో నేను కేవలం రెండు మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయాను. ఈసారి ఎలాగైనా కొలువు సాధించాలన్న తపనతో ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ మాకు కావాల్సిన పుస్తకాలను సొంత ఖర్చులతో తెప్పిస్తున్నారు. ఈ సహాయం ఎంతో గొప్పది’ అని పట్టుదలగా చెబుతాడు సుంకె రాజశేఖర్.
మోహన్రెడ్డి గ్రంథాలయంలో నాలుగువందల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, భూగోళ శాస్త్రం, జీవశాస్త్రం, జనరల్ నాలెడ్జ్, గణితం, సైకాలజీ, కరెంట్ ఎఫైర్స్, మెంటల్ ఎబిలిటీ.. తదితర అంశాలకు సంబంధించిన ప్రామాణికమైన పోటీ పరీక్షల పుస్తకాలను సేకరించారు. షైన్ ఇండియా, విజేత కాంపిటీషన్స్, ఎంప్లాయిమెంట్ న్యూస్ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే తదితర దినపత్రికలు కూడా వస్తాయి. నమస్తే తెలంగాణ ‘నిపుణ’ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఉద్యోగార్థులు చెబుతున్నారు.
✍ రాజు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వాచ్మన్ నుంచి IIM ప్రొఫెసర్ దాకా.. కేరళ యువకుడి సక్సెస్ స్టోరీ
ఒకప్పుడు స్కూల్ డ్రాప్ అవుట్.. ఇప్పుడు మల్టీ మిలియనీర్.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
మరో పతంజలి పంకజ కస్తూరి నాయర్
కొడుకును కోల్పోయినా.. వందలాది బిడ్డలకు ప్రాణం పోస్తున్నాడు..