ఆయుర్వేద ఔషధాలు అమ్మడం అంటే.. మాటలు కాదని 35 ఏండ్ల క్రితమే తెలుసుకున్నారు హరీంద్రన్ నాయర్. అందుకు అధ్యయనాలు, ప్రయోగాలు ఎంతో కీలకమని గ్రహించారు. దీంతో పదేండ్ల పాటు ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయుర్వేదం పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో తన తల్లి, కూతురు పేరుతో ఓ బ్రాండ్ను నెలకొల్పి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడతని ఆయుర్వేద సామ్రాజ్యం కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెడుతున్నది. ఆ బ్రాండ్ పేరు ‘పంకజ కస్తూరి’.
కరోనా సమయంలో ఆరోగ్య రంగం ఊపందుకుంది. పోషకాలనిచ్చే ఆహారానికి గిరాకీ పెరిగింది. ‘రోగ నిరోధక శక్తి’ ఉత్పత్తుల మార్కెట్ రివ్వున పైపైకి ఎగిసింది. పంకజ కస్తూరి పేరు.. కస్తూరి పరిమళంలా నలుదిక్కులకూ వ్యాపించింది. ఈ విశ్వసనీయత ఒకరోజులో సాధ్యమైంది కాదు. హరీంద్రన్ నాయర్.. జీవితకాల కృషి!
మహా సామ్రాజ్యం
నేడు ‘పంకజ కస్తూరి’ ఒక వ్యాపార సామ్రాజ్యం. ఆ ఛత్రం కింద మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఫార్మసీ విద్యాసంస్థలు ఉన్నాయి. ఎన్జీవోలనూ నడుపుతున్నారు. హరీంద్రన్ నాయర్ తిరువనంతపురంలోని కట్టక్కడలో జన్మించారు. సామాన్య కుటుంబం. తండ్రి జనార్దనన్ నాయర్ డాక్యుమెంట్ రైటర్. ఆయన నాలుగు దస్తావేజులు రాస్తేనే నాలుగు ముద్దలు కడుపులో దిగేవి. ముగ్గురు పిల్లల్లో హరీంద్రన్ చిన్నవాడు. బాల్యంలో ఎక్కడో పతంజలి మహర్షి విగ్రహాన్ని చూశాడు. ఆ రూపం, ఆ తేజం పసివాడిని ఆకట్టుకున్నాయి. అలా మనసు ఆయుర్వేదం మీదికి మళ్లింది. ఇంటర్ తర్వాత, తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బీఏఎమ్ఎస్ చేశాడు. ఈ కోర్సు అల్లోపతిలో ఎంబీబీఎస్తో సమానం. పట్టా చేతికి రాగానే, ప్రాంతీయ పరిశోధన సంస్థలో పరిశోధకుడిగా ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఓ నలుగురికి ఉపాధి చూపినప్పుడే జీవితానికి సార్థకత. అందులోనూ, ఆయుర్వేద వైద్యాన్ని జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తన మీద ఉందనిపించింది. దీంతో కొలువును వదిలిపెట్టి, ధన్వంతరి ఆయుర్వేదిక్స్ సంస్థను ఏర్పాటు చేశాడు. సంప్రదాయ వైద్యాన్ని బతికించుకోవడానికి ఒకటే మార్గం. తరాల క్రితం ఆగిపోయిన పరిశోధనలను మళ్లీ ప్రారంభించాలి. ఆవిష్కరణలకు ప్రాణంపోయాలనే లక్ష్యంతో దశాబ్దకాలం పరిశోధనల మీదే దృష్టి పెట్టారు.
‘కస్తూరి’ పరిమళం
తల్లి పంకజ, పెద్ద కూతురు కస్తూరి పేర్లమీద ‘పంకజ కస్తూరి’ సంస్థను నెలకొల్పారు హరీంద్రన్. అసలే, ఆయుర్వేదం పట్ల చిన్నచూపు ఉన్న సమయం. తొలి రోజులు కష్టంగా గడిచాయి. క్రమంగా విశ్వసనీయత పెరగడంతో.. లాభాలూ పెరిగాయి. కొత్తకొత్త ఉత్పత్తులను విడుదల చేశారు. ఆస్తమా, కాలేయ రోగాలు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం, గుండె సమస్యలు.. తదితర రుగ్మతలను నిలువరించే మందుల మీద దృష్టిపెట్టారు. ప్రస్తుతం, పంకజ కస్తూరి ఉత్పత్తులు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ దొరుకుతున్నాయి. విదేశాలకు కూడా వెళ్తున్నాయి. పంకజ కస్తూరి హెర్బల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మేనేజింగ్ డైరెక్టర్గా, పంకజ కస్తూరి ఆయుర్వేద వైద్య, ఇంజినీరింగ్ కళాశాలలకు ఎండీగా, పంచకర్మ కేంద్రాలకు సీయీవోగా, హెర్బల్ రీసెర్చ్ ఫౌండేషన్కు వ్యవస్థాపక కార్యదర్శిగా, నాగాలాండ్ ప్రభుత్వానికి ఆయుర్వేద సలహాదారుగా, కేరళ మెడిసినల్ ప్లాంట్ బోర్డు సభ్యుడిగా.. ఎన్నో పదవుల్లో కొనసాగుతున్నారు హరీంద్రన్. పద్మశ్రీ, ఆయుర్వేద రత్నతో పాటుగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి.
కరోనాకు మందు
ఆయుర్వేదాన్ని బతికించే లక్ష్యంతో 2002లో కేరళలో మొదటి ఆయుర్వేద వైద్య కళాశాలను స్థాపించారు నాయర్. అందులోనే 150 పడకల దవాఖాన కూడా ఉంది. ఏటా 250 మంది విద్యార్థులు పీజీ పట్టాలతో బయటికొస్తారు. ఇక్కడ పేదలకు మానవతా దృక్పథంతో ఉచిత వైద్యం అందిస్తారు నాయర్. కొవిడ్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ‘జింజివిర్-హెచ్’ అనే ఔషధాన్ని పరిచయం చేశారు. దీనిని కేంద్ర ఆయుష్ శాఖ కరోనా చికిత్సకు వాడే ఆయుర్వేద మందుల జాబితాలో చోటు కల్పించింది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ఆయుర్వేద రత్నాలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అంటున్నారు డాక్టర్ హరీంద్రన్ నాయర్.