ratan tata with shantanu naidu | వ్యాపార దిగ్గజం రతన్ టాటాకే టెక్నాలజీ పాఠాలు నేర్పాడంటే ఈ పిల్లగాడు మామూలోడు కాదని ప్రపంచానికి అర్థమైపోయింది. ఇప్పుడు ఆ కుర్రాడే రతన్ టాటాకు అసిస్టెంట్గా, ఆయన ఆఫీస్లో డిప్యూటీ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు, మూడు స్టార్టప్లను విజయవంతంగా నడుపుతున్నాడు ఎనభై మూడేండ్ల రతన్ టాటా జిగిరీ దోస్త్ అయిన శంతను నాయుడు.
ఇద్దరు మనుషుల ఆలోచనలు కలిస్తే, దృక్పథాలు ఒకటైతే.. ఆ సంభాషణ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. టాటా గ్రూప్ చైర్మన్ 83 ఏండ్ల రతన్ టాటా, 28 ఏండ్ల యువకుడైన శంతను నాయుడు మధ్య ముచ్చట్లు కూడా అంతే రసాత్మకంగా ఉంటాయి. వీరిద్దరి బంధాన్ని అర్థం చేసుకున్నవారు ‘ఏజ్.. జస్ట్ ఎ నంబర్’ అని తేల్చేస్తారు. వ్యాపారంతోపాటు సామాజిక సేవలోనూ పరిచయం అక్కర్లేని పేరు రతన్ టాటాది. అలాంటి వ్యాపార దిగ్గజం భుజంపై చేయి వేసి ‘ఇంకేంటి డ్యూడ్! ట్విటర్లో ఏం ట్వీటావు? ఇన్స్టాలో ఫాలోవర్స్ సంగతేంటి?’ అంటూ ఆప్యాయంగా పలకరించేంత చనువు, స్నేహం శంతనుకు ఉంది. రతన్ సేవా కార్యక్రమాలు, ఆయన సోషల్ మీడియా ఖాతాల వెనుక ఈ 28 ఏండ్ల యువకుడి ప్రతిభా నైపుణ్యాలు ఉన్నాయి. కాబట్టే, టాటా పితామహుడి డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఛైర్మన్ ఆఫీస్)గా వ్యవహారాలు చక్కబెడుతున్నాడు శంతన్.
మూగజీవాల సంరక్షణతో మొదలైన ఇద్దరి పరిచయం తర్వాత స్నేహంగా మారింది. సేవా కార్యక్రమాల గురించి తరచూ చర్చించుకునేవారు. ఈమెయిల్స్ ద్వారా అభిప్రాయాలు పంచుకునేవారు. ఇదే సమయంలో రతన్ టాటాకు సోషల్ మీడియాను పరిచయం చేసింది శంతనుబాబే. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, హ్యాష్ ట్యాగ్, ఎమోజీలు వాడటం.. సామాజిక మాధ్యమాలను మెరుగ్గా వినియోగించడంలో ఉండే మెలకువలన్నీ రతన్కు నేర్పించాడు నాయుడు. దానితోపాటుగా వ్యాపార నిర్వహణకు సంబంధించి రతన్కు ఎన్నో విలువైన సలహాలు కూడా అందిస్తూ నమ్మకంగా ఉంటున్నాడు. 2017లో జంతు సంరక్షణ, హక్కుల కోసం పీపుల్ ఫర్ యానిమల్ అనే సంస్థతో కలిసి రూ.100కోట్లతో ఓ హాస్పిటల్ నిర్మాణాన్ని ప్రకటించింది టాటా ట్రస్ట్. త్వరలోనే దాన్ని ప్రారంభించనున్నారు. రతన్ టాటా, శంతను మధ్య భారీగా వయోబేధం ఉన్నా.. అది స్నేహానికి, వ్యాపారానికి ఏమాత్రం అడ్డుకాలేదు. ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని మాట్లాడేంత సాన్నిహిత్యం ఏర్పడింది. మెటోపాస్ కంపెనీ బాధ్యతలను చూసుకుంటూనే, పెద్ద చదువుల కోసం అమెరికా వెళ్లాడు శంతను. ఆ కుర్రాడు చదువుకుంటున్న కార్నెల్ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకలకు రతన్ టాటా కూడా హాజరయ్యారు. ఇండియాకు వచ్చిన తర్వాత రతన్ ఆహ్వానం మేరకు బిజినెస్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాడు.
‘వయసులో చిన్నవాడే అయినా ఆలోచనా ధోరణిలో మాత్రం శంతను పెద్దవాడే’ అంటూ రతన్ టాటా కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. కరోనా కాలంలో ఎన్నో సహాయక కార్యక్రమాలు నిర్వహించారు రతన్ టాటా. ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షించాడు శంతను.
ఒకరోజు, ఆఫీసు నుంచి ఇంటికి వస్తూ.. ఓ కుక్క రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కండ్లారా చూశాడు శంతను. ఆ సంఘటన ఎంతగానో కలచివేసింది. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్నేహితులతో కలిసి రంగురంగుల రేడియం బెల్ట్లను రూపొందించాడు. ఈ బెల్ట్ ధరించిన కుక్క రోడ్డు మీదికి వెళ్లినప్పుడు.. బెల్టులోని రంగులు వాహనాల హెడ్లైట్స్కు మెరిసి
పోతాయి. దీంతో వాహనదారులు నెమ్మది కావడమో, బండిని ఆపేయడమో చేస్తారు. ఫలితంగా, ఆ మూగజీవాలకు ఎలాంటి ప్రమాదం జరగదు. చాలామంది అలాంటి బెల్టులు కావాలన్నారు. అయితే, శంతను దగ్గర వాటి తయారీకి డబ్బు లేదు. తండ్రి సలహా మేరకు నిధుల కోసం టాటా ఇండస్ట్రీస్కు లేఖ రాశాడు. ముంబైకి రమ్మంటూ వాళ్లు ఆహ్వానం పంపారు. వెంటనే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి ఒప్పుకొన్నారు. అలా శంతను ‘మోటోపాస్’ అన్న స్టార్టప్ను మొదలెట్టాడు. ఔత్సాహిక ఆంత్రపెన్యూర్స్ కోసం ‘ఆన్ యువర్ స్పార్క్స్’ అనే కౌన్సెలింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించాడు. ప్రస్తుతం వృద్ధుల కోసం ‘గుడ్ఫెలోస్’ అనే స్టార్టప్ను నిర్వహిస్తున్నాడు శంతను నాయుడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
gauthami jeji | బొల్లి మచ్చలు ఉన్నాయని కుంగిపోలేదు.. మోడలింగ్లో అదరగొడుతుంది..
Vijayalakshmi | చదివింది పదో తరగతే కానీ.. చేసేది కోట్ల బిజినెస్
Anshul Gupta | ఆ 1200 మంది మహిళల వెనుక ఒక్కడు..
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
Gray hair | చిన్నవయసులోనే తల నెరిసిన వారికి ఈమె ఓ ఇన్స్పిరేషన్.. ఎందుకంటే?