చిన్నగూడూరు, మార్చి 9 : మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి శివారు దుమ్డాతండా ఇసుక ర్యాంపునకు చెందిన ఓ యజమాని ఇసుక రవాణా కోసం స్థానిక ఎస్సైకి రూ.20వేలు ఫోన్పే ద్వారా పంపినట్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంగోత్ బాలకృష్ణకు చెందిన వ్యవసాయ భూమి ఆకేరు శివారులో ఉన్నది. ఇక్కడి నుంచి నిత్యం ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది.
తన ర్యాంపు నుంచి ఇసుక రవాణా జరిగేందుకు ఎస్సై ప్రవీణ్కుమార్ పర్సనల్ ఫోన్ నంబర్కు శుక్రవారం రూ.20వేలు ఫోన్పే ద్వారా పంపించినట్టు స్క్రీన్షాట్ తీసిన మెసేజ్లు సోమవారం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. డబ్బులు ఇస్తేనే ర్యాంపు నుంచి ఇసుక రవాణా కొనసాగుతుందంటూ ఎస్సై తనపై ఒత్తిడి తెచ్చినట్టు బాలకృష్ణ ఆరోపించిన పోస్టులు చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ విషయమై ఎస్సై ప్రవీణ్కుమార్ను వివరణకోరగా ఓ వ్యక్తి ద్వారా తన పర్సనల్ మొబైల్ నంబర్కు ఫోన్పే ద్వారా రూ.20 వేలు వచ్చింది నిజమేనని, ఫోన్పే చూసిన వెంటనే అదే నంబర్కు తిరిగి పంపినట్టు తెలిపారు. డబ్బులు పంపిన వ్యక్తి ఇసుక ర్యాంపు యజమానిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.