న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా రెండో దశ ఉద్ధృతితో దేశం మరోసారి పెను సవాల్ను ఎదుర్కొంటున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మహమ్మారిపై పోరాటంలో ప్రజల జీవనాధారం, ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇటీవల తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితులు మెరుగుపడుతాయన్నారు. లాక్డౌన్ నుంచి దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను చివరి అస్త్రంగానే పరిగణించాలని నొక్కిచెప్పారు.
లాక్డౌన్కు బదులుగా మైక్రో కంటైన్మెంట్ జోన్లపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మంగళవారం జాతినుద్దేశించిన ప్రధాని ప్రసంగించారు. పరిస్థితులు సద్దుమణిగినట్టు కనిపించిన తర్వాత.. తుపానులాగా కరోనా విరుచుకుపడిందన్నారు. అలుపెరుగక పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫార్మా రంగం కృషిచేస్తున్నదని ప్రశంసించారు. దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ప్రధాన సమస్యగా మారిందని, ఈ సవాల్ను అధిగమించేందుకు సమిష్టిగా పనిచేస్తున్నట్టు చెప్పారు. దేశ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడితే మరోసారి కరోనాపై తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
అనవసరంగా బయట తిరగొద్దు..
ప్రస్తుత సంక్షోభ సమయంలో అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. వలస కార్మికులు నగరాలను వదిలి వెళ్లొద్దన్నారు. వారి జీవనోపాధికి రాష్ర్టాలు భరోసా కల్పించాలన్నారు. ప్రజలు అనవసరంగా బయట తిరగొద్దని కోరారు. యువత కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఇప్పటివరకు 12 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు. వచ్చే నెల 1 నుంచి 18 ఏండ్లుపైడినవారికీ టీకా అందిస్తామని తెలిపారు. మనదేశంలో అత్యంత చౌకగా టీకాను అందిస్తున్నామన్నారు. టీకా ఉత్పత్తిని భారీగా పెంచాలని తయారీ సంస్థలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. వాటి ప్రతినిధులతో ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్లో ప్రైవేట్ రంగం కీలకపాత్ర పోషించనున్నదని చెప్పారు.