కూసుమంచి, ఏప్రిల్ 25 : రైతుల సమస్యలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, రైతుబిడ్డగా మీ ముందుకొచ్చానని, పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరిస్తానని, మీ తరఫున పార్లమెంట్లో పోరాటం చేస్తానని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. కూసుమంచి మండలం పాలేరులో గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోయిన శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ స్థానాలు గెలవకపోయినా నాకు మంచి మెజార్టీ ఇచ్చారని,
అదే స్ఫూర్తితో ఈసారి ఎన్నికల్లో మీ అందరి సమస్యలకు వారధిగా నిలిచేందుకు తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రాష్ట్ర సమస్యలతోపాటు రైతుల సమస్యలపై మాట్లాడే అవకాశం దొరుకుతుందన్నారు. కొత్తగా వచ్చే వారికి ఎన్నికల్లో అవకాశం ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం ఉండదని, మరో 15 రోజులు కష్టపడి పనిచేసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపించాలని నామా కోరారు.
కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, ఇప్పుడు ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదని, ఈసారి 10 నుంచి 12 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.
బీఆర్ఎస్ నాయకులపై ప్రాంతాల్లో కేసులు పెడుతున్నారని, అయినా బెదిరేది లేదని, వారికి పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు విని బీఆర్ఎస్ వారిపై కేసులు పెట్టడం సరికాదని, చట్టప్రకారం అధికారులు పనులు చేయాలే తప్ప కొందరికి తొత్తులుగా మారొద్దన్నారు. నామా గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని కోరారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లోని పొరపాట్లను సమీక్షించుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంతా బాగా పనిచేసి నామాను గెలిపించుకోవాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి అన్నారు. పాలేరు ప్రజలతో మమేకమై.. వారి కష్టసుఖాల్లో ఒకడిగా ఉన్నా.. సరైన విధంగా ఓటర్ల వద్దకు చేరలేకపోయానన్నారు. పాలేరులో నామాకు మంచి మెజార్టీ వచ్చే విధంగా పని చేయాలని ఆయన కోరారు. ఇంకా ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, నాయకులు ఇంటూరి శేఖర్, వేముల వీరయ్య, బజ్జూరి రాంరెడ్డి తదితరులు ప్రసంగించారు. సమావేశంలో పార్టీ నాయకులు, రూరల్, నేలకొండపల్లి పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, పరశురాం, ఆసీఫ్ పాషా, బాలకృష్ణ, రంజాన్, రామచంద్రునాయక్, సైదులు, అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు.