ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు, ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్య కేసులపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతున్నది. ఈ రెండు కేసుల్లో ప్రమేయం ఉన్న సచిన్ వాజ్ను మార్చి 13న అరెస్ట్ చేసింది. నాటి నుంచి సుమారు నెల రోజుల పాటు ఆయన కోర్టు అనుమతితో ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు.
శుక్రవారంతో తాజా కస్టడీ గడువు ముగియడంతో సచిన్ వాజ్ను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. మరోసారి కస్టడీ కోరని ఎన్ఐఏ, ఆయనను జ్యుడీషియల్ రిమాండ్లో ఉంచాలని కోరింది. మహారాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు, నేతలు డబ్బులు డిమాండ్ చేసిన వైనంపై వాజ్ తమ కస్టడీలో ఉన్నప్పుడు లేఖ రాసినట్లు కోర్టుకు తెలిపింది. బుధవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంలో ఆయన తరుఫు న్యాయవాదికి ఆ లేఖను అందజేశారని పేర్కొంది.
మరోవైపు వాజ్ ప్రాణాలకు ముప్పు ఉన్నందున భద్రత కలిగిన జైలులో ఉంచాలని ఆయన తరుఫు న్యాయవాది కోర్టును కోరారు. ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు సచిన్ వాజ్కు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఎన్ఐఏ దర్యాప్తు రికార్డు సమాచారం కోసం సీబీఐ దరఖాస్తు చేసిన పిటిషన్కు ప్రత్యేక కోర్టు అనుమతించింది.