Ramaayanam | అన్ని రుతువుల్లోనూ చలికాలమంటే ఇష్టం. వణికించే వాతావరణంలోనూ అలవాటు ప్రకారం ఉదయం ఆరు గంటలకే నిద్రలేచే వాళ్లం. పుష్య మాసపు చలిగాలి ఒంటికి తాకి, చెవులకు సోకి వెళ్తుంటే.. ఒక్కోసారి హాయిగా అనిపించినా, ఎక్కువసార్లు భయపెట్టేది.
మార్గశిరంలో అమ్మ ధనుర్మాస వ్రతాన్ని పాటించేది. తెల్లవారుజామున మూడున్నరకే నిద్రలేచి వెళ్తూ, తను కప్పుకొన్న దుప్పటి తీసి నాకూ, ఇంకొకటి అక్కకూ కప్పేది. పరిచితమైన అమ్మ స్పర్శతో, మరింత వెచ్చగా, హాయిగా.. అమ్మకు దగ్గరగా జరిగి, తన పొట్టలో ముడుచుకుని పడుకున్న అనుభూతి కలిగేది. పదేళ్ల వయసులోనూ మాకు స్వెటర్స్ ఉన్న జ్ఞాపకం లేదు. తల పైనుంచి చెవుల మీదుగా నడుము కిందిదాకా వేలాడేట్టు మెడ దగ్గర ముడివేసి హరికంఠం కట్టేవారు. తెల్లవారుజామునే అన్ని పనులు పూర్తిచేసినా కూడా.. అమ్మలో అలసట కనిపించేది కాదు. నేను, అక్క బడికి వెళ్లేటప్పుడు ఆ నెల రోజులూ బియ్యం, పెసరపప్పు, బెల్లం, మిరియాలు, జీలకర్ర వేసి వండిన పొంగలి తినేవాళ్లం.
లేవగానే పెరడంతా తిరుగుతూ.. ‘హ! హ!’ అనుకుంటూ నోళ్లు తెరిచి, చలికి నోట్లోంచి తెల్లని పొగలు వస్తుంటే ఆనందించేవాళ్లం. అంత చలిలోనూ మా బావినీళ్లు గోరువెచ్చగా ఉండటం ఆశ్చర్యం కలిగించేది. మండువేసవిలో మిట్ట మధ్యాహ్నం పూట బావిలో నీళ్లు చేదితే.. కొత్త కుండలో నీళ్లలా ఎంతో చల్లగా ఉండటం కూడా అబ్బురపరిచేది.
చలికాలం సాయంత్రాలు ఇప్పటికీ నానమ్మ బాగా గుర్తుకొస్తుంది. కొంచెం చీకటి పడగానే ఆమె దక్షిణపు మనసాలలో ఉన్న కుంపటి రాజేసేది. అన్నట్టు, ఈ కుంపటి గురించి కొంత చెప్పాలి. అది బొగ్గుల కుంపటి కాదు. మట్టితోచేసిన పూలకుండీ లాంటిది. దానిలో పిడకలు ఉండేవి. ఇంట్లో ఎప్పటికీ నిప్పు ఆరకుండా ఉండటానికి అన్నమాట. రాత్రి నన్నూ, అక్కనూ ఆ కుంపటి ముందు కూర్చోబెట్టుకునేది నానమ్మ. తన చేతులను కుంపటికి కొంచెం పైన పెట్టి ఆ వెచ్చని చేతులతో మా చెంపలను కాపేది. నానమ్మ గొంతు శ్రావ్యంగా ఉండేది. పాటలు పాడుతూ రోజూ ఒకే కథ చెప్పేది. అయినా వినేవాళ్లం.
* * *
ఓ దేశాన్నేలే రాజుకు ఏడుగురు కూతుర్లు. ఓ రోజు రాణిగారి పూజ కోసం ఏడుగురూ పొన్న పూలు కోసుకుని రావడానికి వెళ్తారు. మిగిలినవాళ్లంతా కలిసి అందరిలోకి ఆఖరి పిల్లను కావాలనే చెట్టు మీద వదిలేస్తారు. అంతలో పులి వచ్చి ఆ పిల్లకేసి గాండ్రించి చూస్తూ ఉంటుంది. పిల్ల ఏడుస్తూ.. ‘దింపనైనా దింపు.. మింగనైనా మింగు’ అంటుంది. ఆ పులికి రెండోదే నచ్చి అదే చేస్తుంది. ఆ మింగడంలో పిల్ల చిటికెన వేలు కిందపడిపోయి, కొన్నాళ్లకు ఓ జంగమయ్యకు దొరుకుతుంది. దాన్ని శొంఠి కొమ్ము అనుకుని ఇంటికి తీసుకెళ్లి భార్యకు ఇస్తే.. ఆమె దాన్ని సర్కటాల కుండలో వేసి మూతపెడుతుంది. ఓ రోజు తలనొప్పికి శొంఠి కొమ్ము అరగదీసి రాయమంటూ భార్యను అడగగా.. ఆమె వెళ్లి చూస్తే, అందులో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. వాళ్లు ఆ పిల్లను పెంచుకుంటారు. జంగమయ్య తన వీపుపై ఆ పిల్లను కట్టుకుని, జోలెలో అడుక్కు తింటూంటే.. ఆ పిల్లే పాటలు పాడుతుంది. రెడీమేడ్ సింగర్ దొరికిందని అతను సంతోషంగా మరింతగా అడుక్కు తింటాడు. ఓ రోజు రాజమందిరం ముందు నుంచి వెళ్తూ ఉండగా.. ఆ పిల్ల గుర్తుపట్టి, సిన్మా క్లయిమాక్స్ సీన్లో హీరోయిన్లా పెద్ద గొంతుతో ‘రావా! మొరవినవా!’ అంటూ దేవుణ్ని నిలదీస్తూ పాడేసరికి, రాణీగారు గుర్తుపట్టి కోట గుమ్మం దాకా పరుగెత్తి, తన కూతుర్ని తాను తెచ్చుకుంటుంది.
ఆ పిల్ల పాడిన పాటేమిటంటే..
‘రాజూకేడుగురు బిడ్డలాం
పొన్న పూలకు పోయినాం
పులిరాజు బుక్కబెట్టే!
జంగమయ్య జోలెగట్టే!
భిక్షాందేహీ!’
* * *
నానమ్మ ప్రతిరోజూ ఈ కథే చెప్పేది. మేము సుమారు ఆరేడేళ్లపాటు ఈ కథను ప్రతి రోజూ ఎడ్డి మొహాలేసుకుని అప్పుడే కొత్తగా వింటున్నట్టు వినేవాళ్లం. రాణిగారి పూలకోసం అడవికి ఆ కూతుళ్లే ఎందుకు వెళ్లాలి? వెనకాల భటులు లేరా? చిటికెన వేలును శొంఠికొమ్ము అనుకోవడం ఏమిటి? దాన్ని కుండలో పెడితే చంటిపిల్ల అవడమేమిటి? అయినా ఆ కుండలో ఊపిరాడక గిలగిలా కొట్టుకు చావక.. గొంతులో మైకు పెట్టుకుని పాడటం ఏమిటి? నేర ప్రవృత్తి గల ఆ అక్కలకు రాజు ఏ శిక్షా విధించలేదా?.. లాంటి విషయాల్లో నిజాలు ఇంకా నిగ్గు తేలాల్సి ఉంది. మాకు ఆ వయసులో ఎలాంటి సందేహాలూ వచ్చేవి కావు. చివర్లో మా కళ్లు మూసుకుపోతుంటే చూసి..“ఇగ పొయ్యి పండుకోండి. రేపు మళ్ల చెప్పుత!” అనేది నానమ్మ. మరునాడు రాత్రి మళ్లీ అదే కథ !!
చలికాలం వస్తే చాలు.. ఆ రోజులన్నీ గుర్తుకొచ్చి, మళ్లీ ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే ఎంతబాగుండేదో అనిపిస్తుంది.
నెల్లుట్ల రమాదేవి ( Nellutla Ramadevi ), రచయిత్రి
Ramaayanam | పోగొట్టుటలో ఉన్న హాయి-2
Ramaayanam | పోగొట్టుటలో ఉన్న హాయి!