చుంచుపల్లి, మే 28 : అకాల వర్షాల భయంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. పండించిన ధాన్యం ఎక్కడ తడిసి నష్టపోతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ధాన్యాన్ని ఆరబెట్టి తూర్పారబోసి కాటా పెట్టకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే ఉండి ధాన్యాన్ని కాపాడుకుంటున్నారు. గురువారం ఉదయం చుంచుపల్లి మండలం పెనగడప రాంపురం వద్ద పీఏసీఎస్ సంఘం వాళ్లు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కురిసిన గాలివాన రైతులకు మరింత ఆందోళన కలిగించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై కప్పిన పట్టాలపై వర్షపు నీరు నిలవడంతో రైతులు వాటిని తొలగించి మళ్లీ ధాన్యాన్ని ఆరబెట్టే పనిలో నిమగ్నమయ్యారు.
భారీ వర్షాలు కురిస్తే ధాన్యం పూర్తిగా తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే పంట కోతలు పూర్తి చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని త్వరగా కాటా పెట్టి లారీల ద్వారా మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. ఆలస్యం కొనసాగితే వర్షాల కారణంగా ధాన్యం నాణ్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

‘కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు’