Kasi Majili Kathalu Episode 59 ( కాశీ మజిలీ కథలు ) |జరిగిన కథ : వజ్రమాల అనే యువతినికలుసుకున్న పుష్పహాసుడు.. ఆడవేషం ధరించి అమరావతికి ప్రయాణంఅయ్యాడు. అయితే, వారు ప్రయాణిస్తున్న ఓడ అనుకోకుండా యవనద్వీపానికి చేరింది. అక్కడి సైన్యాధికారి వారికి ఆశ్రయం ఇచ్చాడు. ఒకరోజు ఆడవేషంలో నగర సందర్శన చేస్తున్న పుష్పహాసుణ్ని ద్వీప సుల్తాన్ చూసి మోహించాడు. ఆ సుందరాంగిని తీసుకువచ్చి తనతో నిఖా జరిపించాలని ఆదేశించాడు. విషయం తెలుసుకున్న పుష్పహాసుడు.. సుల్తాన్ గారిని పెళ్లాడుతానని చెప్పి కోటకు వెళ్లాడు.
ఆడవేషంలో ఉన్న పుష్పహాసునికి, యవనద్వీపపు సుల్తాన్కు సంప్రదాయం ప్రకారం నిఖా జరిగింది. చక్కగా అలంకరించిన కేళీ గృహంలోకి వాళ్లిద్దరినీ పంపించి, మిగిలినవారు తప్పుకొన్నారు. మందిరానికి నూరుగజాల దూరంలో ఎవ్వరూ ఉండరాదని సుల్తాన్ శాసించాడు. పుష్పహాసుడు తలవంచుకుని ఒక మూల వయ్యారంగా నిల్చున్నాడు. సుల్తాన్ మెల్లిగా అతని చేయిపట్టుకుని తల్పం వద్దకు నడిపించాడు. కుడిచేతితో చిబుకాన్ని ఎత్తి పట్టుకుని.. “మోహనాంగీ! నిన్ను చూసింది మొదలు నేను పడిన పరితాపం దైవానికి ఎరుక. నేనింతకుముందు ఎందరినో పెళ్లాడాను. కానీ, ఎవ్వరూ నన్నింతగా ఆకర్షించలేదు. ఏదీ నీ అధరసుధారసము” అంటూ ముందుకు వంగబోయాడు.
అప్పుడు పుష్పహాసుడు..
“రాజా! నీవంటి మనోహరుణ్ని పొందిన నా అదృష్టాన్ని ఏమని వర్ణించగలను?! కానీ ఒకమాట.. నాకు ఇదివరకే పెళ్లయింది. నా భర్త చనిపోయాడు. ఆయన ఎప్పుడూ నన్ను ఆవేశించి ఉంటాడు. మనం రసపట్టులో ఉండగా ఆయనకేమైనా కోపం వస్తే నా పూచీ లేదు” అని చెప్పాడు గారాలు పోతూ.
ఆ మాటలు సుల్తాన్కు అర్థం కాలేదు.
“అటువంటి పిచ్చి భయాలేం పెట్టుకోకు” అంటూ ముందడుగు వేశాడు.
పుష్పహాసుడు చేయి విడిపించుకుని.. సింహనాదం చేస్తూ వలయాకారంగా ఒక్కసారి తిరిగి, పైన కప్పుకొన్న వస్ర్తాన్ని జారవిడిచి మగవాడిగా మారాడు. ఉన్నట్లుండి ఆ గదిలోకి మరో మగపురుషుడు ఎలా వచ్చాడో సుల్తాన్కు అర్థం కాలేదు. దయ్యం కాబోలనుకుని బిక్క చచ్చిపోయాడు. అతణ్ని నోరు మెదపనీయకుండా చేసి, పిడిగుద్దులతో సత్కరించాడు పుష్పహాసుడు.
సుల్తాన్ గుండెలమీద కూర్చుని, రెండుచేతులూ బిగించి గుద్దుతూ.. “నా పెళ్లాన్ని వదిలేస్తావా లేదా?!” అని మరింత భయపెట్టాడు.
“వదిలేస్తాను. నన్ను నువ్వొదిలేయ్ బాబోయ్” అని సుల్తాన్ బావురుమన్నాడు.
“త్వరగా ఏర్పాట్లు చూడు” అంటూ అతని మీద నుంచి పైకిలేచాడు పుష్పహాసుడు.
సుల్తాన్ బయటికి వెళ్లగానే మళ్లీ బురఖా తగిలించుకున్నాడు. పల్లకీ ఎక్కి వరుణదత్తుని ఇంటికి వచ్చేశాడు.
అప్పటివరకూ ‘రాక్షసుడిలాంటి సుల్తాన్కు భయపడి, అన్నెంపున్నెం ఎరుగని ఆడపిల్లను అప్పగించాం’ అంటూ కలత చెందుతున్న వరుణదత్తుడు, వసంతసేన ఆనందించారు. రెండురోజులు గడిచాయి.
* * *
రేవానగరం నుంచి ద్వీపాంతరవాస శిక్ష పడిన బందీలున్న ఓడ యవనద్వీపానికి చేరుకుంది. ఆ ఓడలోనే గంధర్వదత్త, వసంతతిలకతోపాటుగా పుష్పహాసుడేమో అనే అనుమానంతో బంధితుడైన పురుషుడు కూడా ఉన్నాడు. వారిముఖాలు చూస్తే నేరం చేసినవాళ్లని అనిపించలేదు వరుణదత్తునికి. మిగిలిన బందీలను యవనులకు అప్పగించి వేసి, ఆ ముగ్గురిని మాత్రం తన ఇంటికి తీసుకువచ్చి, ఉద్యానవనంలో దాచి ఉంచాడు.
అమాయకులైన ఆడవాళ్లకు శిక్షపడిందని, వారిని ఉద్యానవనంలో ఉంచానని భార్యతో చెప్పాడు.
“వారి సంగతి నేను కనుక్కుంటాను. దానినిబట్టి ఏం చేయాలో ఆలోచించవచ్చు” అని వసంతసేన చెప్పింది.
అందుకు వరుణదత్తుడు అంగీకరించాడు.
గంధర్వదత్త ముఖం చూడగానే వసంతసేనకు సోదరీభావం కలిగింది.
“అక్కా! నిన్ను చూస్తుంటే నేరం చేసిన దానిలా లేవు. నీకీ దుస్థితి ఎందుకు కలిగింది? నాతో చెప్పు. నా భర్త ఈ దేశంలో గొప్ప అధికారి. ఆయనతో చెప్పి నీకేదైనా సాయం చేయగలను. నీకోసం కాకపోయినా నీతోపాటు ఉన్న వీళ్లిద్దరికైనా న్యాయం జరుగుతుంది” అని బుజ్జగింపుగా అడిగింది వసంతసేన.
అప్పుడు గంధర్వదత్త ఆమెతో.. తాను ధనుంజయుని సోదరినని, వరుణదత్తుని ఇల్లాలినని. తన పేరు గంధర్వదత్త అని.. తన కథనంతా వివరంగా చెప్పింది.
వసంతతిలక.. తాను ధనుంజయుని పరిచారికనని, తన యువరాణిని ఆమె ప్రేమించిన యువకునితో కలపాలని ప్రయత్నిస్తూ ఆమెనుంచి విడిపోయానని, గంధర్వదత్త నేరం చేయలేదని సాక్ష్యం చెప్పినందుకు అన్యాయంగా తనకు శిక్ష విధించారని చెప్పుకొచ్చింది.
పుష్పహాసునిగా అనుమానిస్తున్న వ్యక్తి.. “అమ్మా! నా పేరు పుష్పహాసుడు కాదు. నామీద అన్యాయంగా నేరం మోపారు” అని చెప్పాడు.
వాళ్ల మాటలన్నీ సావధానంగా ఆలకించిన వసంతసేన ఇంట్లోకి వెళ్లింది. భర్తను చేరి, తాను విన్న సంగతులన్నీ ఏకరవు పెట్టింది.
ఆమె మాటలను వింటూనే.. “హా! గంధర్వదత్తా!” అంటూ వరుణదత్తుడు మూర్ఛపోయాడు.
వసంతసేన అనేక ఉపచారాలు చేసింది. ఆమెకు స్త్రీవేషంలో ఉన్న పుష్పహాసుడు సహాయం చేశాడు. కొంతసేపటికి వరుణదత్తునికి తెలివి వచ్చింది.
“నేనెక్కడున్నాను.. నా గంధర్వదత్త ఏది?! నా పుష్పదంతుడేడీ?! నేను వెంటనే నా భార్యను కలుసుకోవాలి” అంటూ బయటికి నడవబోయాడు.
వసంతసేన అతిప్రయత్నం మీద అతణ్ని ఆపింది.
“నాథా! ఎందుకిలా అయిపోతున్నారు?! ఆ గంధర్వదత్త మీ ఇల్లాలా?! ఇంతకాలం మీ గతాన్ని గురించి చెప్పలేదేమి?!” అని ప్రశ్నించింది.
“లేదు వసంతా! ఇంతకాలం నిజంగా నాకేమీ గుర్తులేదు. నువ్విప్పుడు ఆమె పేరు చెప్పగా గుర్తువచ్చింది. దయచేసి నన్ను ఆమె వద్దకు వెళ్లనీ” అని బతిమాలుకున్నాడు వరుణదత్తుడు.
“మీ ఆరోగ్యం సరిగా ఉన్నట్లు లేదు. మీరిక్కడే ఉండండి. నేనే వాళ్లను లోనికి పిలుస్తాను” అని చెప్పి వసంతసేన ఆ ముగ్గురినీ తీసుకువచ్చింది.
గంధర్వదత్త – వరుణదత్తుడు కలుసుకున్నారు. తాము పడిన కష్టాలను ఒకరితో ఒకరు చెప్పుకొని ఊరట పొందారు. గంధర్వదత్తను వసంతసేన ఆదరించింది.
“పిల్లవాడు కూడా మనకు దక్కితే ఎంత బాగుండును” అన్నాడు వరుణదత్తుడు.
సరిగ్గా ఆ సమయంలోనే స్త్రీవేషంలో ఉన్న పుష్పహాసుడు అక్కడికి వచ్చాడు. అదే సమయంలో ఆ గదిలో ఒక దివ్యమైన వెలుగు ప్రసరించింది. అక్కడ ఒక దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఆయన చెంతనే ఒక మంచం కూడా ఉంది. గంధర్వదత్త, వరుణదత్తులు తమ పిల్లవాడితో కలిసి ఆనాటి రాత్రి శయనించిన మంచం అదే!
ఆ దేవదూత ఇలా పలికాడు.. “వరుణదత్తా! నీ ముందున్నది ఆడపిల్ల కాదు. నీ పిల్లవాడే.. పుష్పదంతుడు. అతనే పుష్పహాసుడనే పేరుతో పెరిగాడు. ఇది ముమ్మాటికీ నిజం!”..
ఆ మాటలు వింటూనే పుష్పహాసుడు తన స్త్రీరూపాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు.
“ఆహా.. కుమారా! నిన్ను వెతుక్కుంటూ వచ్చిన మా అన్నయ్యగారి అమ్మాయి లలిత ఏమైపోయిందో కదా!! ఆమె కూడా లభిస్తే మనకు చింత లేకుండా పోతుంది” అన్నది గంధర్వదత్త కళ్లు తుడుచుకుంటూ.
“ఎందుకమ్మా విచారం?! తనూ ఇక్కడే ఉంది. పుష్పహాసునిగా అనుమానించి శిక్షకు గురైన వీరు మరెవరో కాదు.. మీ మేనకోడలే!” అని చెప్పింది వసంత.
లలిత తలపాగా ఊడదీసి.. మేనత్తకు, మేనమామకు ఆనందం కలిగించింది.
“కష్టాలన్నీ గట్టెక్కాయి. అందరం తిరిగి కలుసుకున్నాం” అంటూ వరుణదత్తుడు సంతోషంతో భార్యా సమేతుడై దేవదూతకు నమస్కరించి..
“అయ్యా! మీరెవరు? ఇతనే మా కుమారుడని మీకెలా తెలుసు?! మేము ఆనాడు నిద్రించిన ఆ మంచం మీ దగ్గరికి ఎలా వచ్చింది?! ఈ ఆనంద సమయంలో ఆ మంచంతో సహా ఎందుకు వచ్చారు?!” అని ప్రశ్నించాడు.
అప్పుడు దేవదూత తన కథను చెప్పసాగాడు.
“వరుణదత్తా! మాది అలకాపురి. ఉత్తర దిక్పాలకుడైన కుబేరుని రాజధాని. మా ఊరిలో నూరేళ్లకు ఒకసారి నిధిపూజా మహోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి ఇంద్రుడు, అతని కుమారుడు జయంతునితోపాటుగా ముప్పైమూడుకోట్ల దేవతలు విచ్చేస్తారు. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, గంధర్వులు, యక్షులు అందరూ వస్తారు. నృత్య సంగీతాది వినోదాలు సాగుతాయి. మునులు ప్రసంగిస్తారు. అప్పుడు నవనిధులకు అధినాథుడైన కుబేరుడు భార్యాసమేతుడై.. వచ్చిన వారందరికీ పదిరోజులపాటు అతిథిపూజలు నిర్వహిస్తాడు. ఆ సమయంలో మూడులోకాల్లోనూ చక్కదనానికి ప్రసిద్ధికెక్కిన జంటలను గురించి మా నలకూబరుడు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటాడు. అందమైన జంటలంటే.. మొదటి వరుసలో నలకూబరుడు, జయంతుడు ఉంటారు. రెండో వరుసలో చంద్రుడు, వసంతుడు నిలుస్తారు. మూడోవరుసగా అశ్వినీ దేవతలుంటారు. మన్మథుడు రూపంలేని వాడు కాబట్టి, ఏ వరుసకూ చెందడని పరీక్షకులు నిర్ణయించారు.
అయితే ఈసారి భూలోకం నుంచి కూడా ఒక అందమైన జంటను నిధిపూజకు తీసుకురమ్మని కుబేరుల వారు నన్ను పురమాయించారు. నేను భూలోకమంతా జల్లెడ పట్టినా మానవులలో గొప్ప జంట కనిపించ లేదు. నేను విసిగి మళ్లీ అలకాపురికి తిరిగి వెళ్లబోతుండగా.. నారద మహర్షి ఎదురుపడ్డారు. నేను వారికి నమస్కరించి, నా సమస్యను విన్నవించాను. అప్పుడు వారు..
‘ఓయీ! నువ్వు వింధ్యకూటానికి వెళ్లు. ఆ యువరాజ దంపతులు అందంలో రంభా నలకూబరులను మించినవారు’ అని చెప్పాడు.
ఆనాడు మంచంమీద శయనించి ఉన్న మిమ్మల్ని చూడగానే నారదులవారు చెప్పింది నిజమేనని అనిపించింది. మీ నిద్రకు భంగం లేకుండా మంచంతోసహా మిమ్మల్ని అలకాపురికి తరలించాలని ప్రయత్నించాను.
మంచాన్ని గాల్లోకి ఎత్తి ఎగురుతూ వెళ్లసాగాను. కానీ, నా అజాగ్రత్త వల్ల మీరు ముగ్గురూ గాలితాకిడికి తలోచోట పడిపోయారు. ఆ సంగతి గుర్తించకుండానే నేను అలకాపురికి వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లాక మంచాన్ని కిందికి దింపి చూస్తే మీరు కనిపించలేదు.
ఈ సంగతి కుబేరులవారితో చెప్పలేను. చేసిన పొరపాటు దిద్దుకుందామంటే మీరెక్కడ పడిపోయారో నాకు తెలియలేదు. చివరికి ఈ మంచాన్ని మోసుకుంటూనే, మూడులోకాలూ గాలించసాగాను. నా శ్రమ ఫలించి, ఈవేళ నారదమునీంద్రుల వారి దర్శనం లభించింది.
‘స్వామీ! మీరు చెప్పినట్లే వింధ్యకూట యువరాజ దంపతులను అలకాపురి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నా అశ్రద్ధవల్ల దారిమధ్యలో వారెక్కడో పడిపోయారు’ అని ఆయనతో విన్నవించాను.
అప్పుడాయన దివ్యదృష్టితో చూసి, మీ ముగ్గురూ ఎక్కడెక్కడ పడిపోయారో.. ఎలా జీవిస్తున్నారో నాకు వివరంగా చెప్పారు. మీ కథంతా విన్న నాకు.. నావల్లనే కదా వారికిన్ని కష్టాలు దాపురించాయని బాధ కలిగింది.
నారదమహర్షి నన్ను ఓదార్చి..
‘ఆ వరుణదత్తుడు చిన్నవయసులో ఉండగా ఒకసారి.. పావురాల జంట ఒకటి గూటిలో బిడ్డలతో సహా ఉండగా, మట్టిముద్దను బాణంగా చేసి కొట్టాడు. అప్పుడు వాటిలోని మగపక్షి అతణ్ని శపించింది. ఆ శాపం వల్లనే అతడు భార్యాబిడ్డల నుంచి దూరమైపోయాడు. ఆ శాపం నీరూపంగా ఫలించింది. నీవల్లనే శాపనివృత్తి కూడా కలుగుతుంది’ అని సెలవిచ్చారు.
ఇదీ జరిగిన కథ. అయ్యా! మీరందరూ ఈ మంచంపై కూర్చోండి. మళ్లీ మిమ్మల్ని వింధ్యకూట నగరానికి తీసుకుపోయి, నా దారిన వెళతాను” చెప్పాడు దేవదూత.
.. ఈ కథనంతా విన్న వరుణదత్తుడు, ఆ నగరంలో తన బాధ్యతలన్నీ నెరవేర్చుకుని, బందీలను స్వేచ్ఛగా విడిపించి.. తన వారందరితో కలిసి మంచంపై కూర్చున్నాడు. దేవదూత ఆ మంచాన్ని ఆకాశమార్గంలో తీసుకువెళ్లాడు. చెల్లెలి గురించి, కూతురి గురించి బెంగపెట్టుకున్న ధనంజయుడు వారిద్దరినీ చూసి ఎంతగానో సంతోషించాడు. త్వరలోనే లలితకు, పుష్పహాసునికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
(వచ్చేవారం మరో కథతో.. )
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | యవనద్వీపంలో అందగత్తెలు
Kasi Majili Kathalu | రేవానగరంలో కలకలం
Kasi Majili Kathalu | ఒంటరి ప్రయాణం
Kasi Majili Kathalu | పుష్పహాసుడు
Kasi Majili Kathalu Episode 54 ( కాశీ మజిలీ కథలు ) | సముద్రంలో రహస్యమందిరం