KC Venugopal : తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఖండించింది. అలాంటి చర్చలు ఎక్కడా జరగలేదని స్పష్టంచేసింది. ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి (Indian Alliance) సమావేశానికి పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhisheik Banerjee) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాతే రెండు పార్టీల విలీనంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఆ సమావేశంలో జాతీయ రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని వేణుగోపాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలను మరింత సమర్థంగా ఎలా లేవనెత్తాలనే అంశంపైనే చర్చ జరిగిందన్నారు. విలీన ప్రతిపాదనగానీ, అలాంటి చర్చలుగానీ అస్సలు జరగలేదని స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్లో ఇటీవల టీఎంసీ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అసమ్మతి పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్తో టీఎంసీ విలీనం కావచ్చన్న ప్రచారం ఊపందుకుంది.
ఇదే అంశంపై టీఎంసీ ఎంపీ సౌగతరాయ్ కూడా స్పందించారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అవసరమని చెప్పారు. అయితే అది కూటమి రూపంలో ఉంటుందా..? విలీనం రూపంలో ఉంటుందా..? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు విలీనంపై టీఎంసీ అధిష్ఠానం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.