– హబ్ అండ్ స్పోక్ కేంద్రంలో మౌలిక వసతులపై సమీక్ష
బీబీనగర్, జూన్ 11 : గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు తీసుకెళ్తున్న ఇందిరా మహిళా శక్తి కుట్టు కేంద్రం (హబ్ అండ్ స్పోక్ సెంటర్)ను గురువారం అధికారులు సందర్శించి పనితీరును పరిశీలించారు. బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో మహిళలు నిర్వహిస్తున్న యూనిఫాం కుట్టు పనులను నిశితంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. సెర్ప్ టెక్నికల్ సపోర్టర్లు దివ్య, సునందన్, ఎన్ఐటీఎం సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ అనంతఫణి, శోభ, అదనపు డీఆర్డీఓ జంగారెడ్డి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు చేపడుతున్న యూనిఫాం స్టిచ్చింగ్ ప్రక్రియను పరిశీలించి, వస్త్రాల నాణ్యత, కుట్టు ప్రమాణాలు, పనుల పురోగతిపై ఆరా తీశారు.
అలాగే కుట్టు కేంద్రంలో నిర్వహిస్తున్న మెజర్మెంట్ రిజిస్టర్లను తనిఖీ చేసి రికార్డుల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. బల్క్ కటింగ్ సెంటర్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, యంత్రాలు, పనివాతావరణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో మహిళలకు అవసరమయ్యే ప్రత్యేక శిక్షణలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై టైలర్లతో ముఖాముఖి చర్చించి వారి అభిప్రాయాలు, అవసరాలను తెలుసుకున్నారు. మహిళలు క్రమశిక్షణతో, నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు నిర్వహించడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ప్రతిభతో ఉపాధి అవకాశాలను సృష్టించుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మహిళా సాధికారత దిశగా ఈ కేంద్రం మంచి ఫలితాలు ఇస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆదాయ వృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణకు ఇలాంటి కుట్టు కేంద్రాలు కీలకంగా మారుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో మరింత అధునాతన శిక్షణలు అందించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మీనా, మండల సమాఖ్య అధ్యక్షురాలు ప్రజావాణి, సీసీ సమత, వీఓ అధ్యక్షురాలు శోభారాణి, వీఓ ఓబీ సభ్యులు, టైలర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.

‘స్వయం ఉపాధితో మహిళల ఆర్థికాభివృద్ధికి అడుగులు’