ICC T20I Rankings: ఐసీసీ టీ20 క్రికెట్ ర్యాంకింగ్స్లో భారత యువ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. గత కొంతకాలంగా ఈ ఫార్మాట్లో నిలకడగా రాణిస్తున్న టీమిండియా యువ ఆటగాళ్లు ర్యాంకింగులలోనూ దుమ్మురేపుతున్నారు. స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా రెండో టీ20లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన జైస్వాల్.. తాజాగా ఐసీసీ విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్లో ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని టాప్-10 లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఇరగదీస్తున్న యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే ఏకంగా 207 స్థానాలు మెరుగుపరుచుకోవడం విశేషం. బౌలింగ్లో అక్షర్ పటేల్.. 12 స్థానాలు మెరుగుపరుచుకుని టాప్ -10లోకి వచ్చాడు.
అఫ్గానిస్తాన్తో రెండో మ్యాచ్లో 34 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు జైస్వాల్. తద్వారా అతడు 13వ స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకాడు. జైస్వాల్కు ఇదే కెరీర్ బెస్ట్ ర్యాంకు. బ్యాటర్ల జాబితాలో టాప్ -10లో ముగ్గురు భారత్ నుంచే ఉండటం గమనార్హం. 869 పాయింట్లతో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఫిల్ సాల్ట్, మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్, ఎయిడెన్ మార్క్రమ్లు తర్వాత స్థానాల్లో ఉన్నారు. జైస్వాల్ ఆరో స్థానంలో ఉండగా రిలీ రూసో, జోస్ బట్లర్ 7, 8 స్థానాల్లో ఉన్నారు. టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్.. తొమ్మిదో స్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ సిరీస్ కంటే ముందు 265వ స్థానంలో ఉన్న దూబే.. వరుసగా రెండు అర్థ సెంచరీలు చేసి 58వ స్థానానికి చేరుకున్నాడు.
Sri Lanka and India stars command the spotlight in a host of changes in the latest ICC Men’s Player Rankings 📝
Read on 👇 https://t.co/kKr1r8VOm5
— ICC (@ICC) January 17, 2024
బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్ స్పిన్నర్ అదిల్ రషీద్.. 726 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. విండీస్ బౌలర్ అకీల్ హోసెన్, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణలు తదుపరి స్థానాల్లో ఉన్నారు. అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉండగా.. రవి బిష్ణోయ్ ఆరో స్థానంలో నిలిచాడు.