Archery World Cup | షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత పురుషుల రికర్వ్ జట్టు సంచలనం సృష్టించింది. 14 ఏండ్ల తర్వాత ఈ టోర్నీలో స్వర్ణం నెగ్గింది. తుదిపోరులో తెలుగు ఆటగాడు ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన త్రయం.. 5-1 (57-57, 57-55, 55-53) తేడాతో ఒలింపిక్ చాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చింది.
ఈ విభాగంలో భారత్ చివరిసారిగా 2010లో స్వర్ణం గెలవగా.. నాడు పసిడి గెలిచిన జట్టులో ఉన్న తరుణ్దీప్ 2024లోనూ ఆడటం గమనార్హం. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ దీపికా కుమారి ఫైనల్లో 0-6 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ లిమ్ సిహ్-యోన్ (కొరియా) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఈవెంట్లో భారత ద్వయం అంకిత-ధీరజ్లు కాంస్యం నెగ్గారు. ఈ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 8 పతకాలు సాధించింది.