కట్టంగూర్, ఆగస్టు 12 : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం కట్టంగూరు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కంప్యూటర్ సైన్స్ ల్యాబ్, పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పాఠశాలలోని సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలని, మెనూ ప్రకారం భోజనం అందేలా చూడాలని సూచించారు. పాఠశాలలో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సైన్స్ ల్యాబ్ను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఇన్చార్జి ఎంఈఓ అంబటి అంజయ్య ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు.
కట్టంగూర్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సందర్శించిన సందర్భంగా స్థానిక సర్పంచ్ ముక్కాముల శ్యామల శేఖర్ మండల కేంద్రంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సాగర్ వాటర్ లైన్లు సక్రమంగా లేకపోవడంతో నీటి సరఫరా సరిగా జరగడం లేదని, ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండడం లేదని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న పైప్లైన్ పనులను పూర్తి చేయాలని కోరారు. అలాగే కట్టంగూర్ పట్టణంలో విద్యుత్ లైన్లు, దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల సమస్యతో పాటు లో-వోల్టేజ్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సమస్యల పరిష్కారానికి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, విద్యుత్ శాఖ ఎస్ఈలను ఫోన్లో సంప్రదించి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలపై కలెక్టర్ తక్షణమే స్పందించడంతో సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.