భద్రాచలం, ఆగస్టు 12 : యూబీ రోడ్డులోని పద్మావతి హాస్పిటల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. క్లబ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, సెక్రటరీ ప్రశాంత్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డితో పాటు పవర్ బాయ్స్ యూత్ సభ్యులు, స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మల్లంపాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుండి నిత్యం అనేక మంది గిరిజనులు భద్రాచలం ఆస్పత్రులకు వైద్యం కోసం వస్తుంటారన్నారు. సమయానికి రక్తం అందక ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న వారిని ఆదుకోవాలనే మానవతా దృక్పథంతోనే ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన వివరించారు. ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, భవిష్యత్లోనూ ఇటువంటి సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలిపారు.

రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సైడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం