వరంగల్, ఏప్రిల్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి): లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరంగల్ నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోడ్షో ముగిసేవరకూ అడగడుగునా వేలాది మంది జనం కిలోమీటర్ల దూరం కేసీఆర్ వెంటే నడిచారు. రోడ్డు పొడవునా జనం రోడ్డకు ఇరువైపులా జై కేసీఆర్.. సీఎం కేసీఆర్ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సుయాత్ర జనగామ, స్టేషన్ ఘన్పూర్ మీదుగా వరంగల్ మహానగరంలోకి చేరుకున్నది. రాంపూర్, మడికొండ, కాజీపేట, అదాలత్ సర్కిల్ మీదుగా బస్సులో కేసీఆర్ అంబేద్కర్ జంక్షన్ వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి జనప్రవాహం కేసీఆర్కు ఎదురేగి వచ్చి ఘనస్వాగతం పలికింది. భారీగా వచ్చిన జనం మధ్య నుంచి సభ జరిగే హనుమకొండ చౌరస్తా వరకు చేరుకునేందుకు చాలా సమయం పట్టింది. అంబేద్కర్ జంక్షన్కు రాత్రి 7.37 గంటలకు వచ్చిన కేసీఆర్ అక్కడి నుంచి కిలోమీటరు దూరంలోని హనుమకొండ చౌరస్తాకు వచ్చే వరకు రాత్రి 8.25 అయ్యింది. కిక్కిరిసిన జనంతో బస్సు ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. వరంగల్ నగరంలో కేసీఆర్ రోడ్ షో మొత్తం భారీ జనంతో ఉత్సాహంగా సాగింది. కేసీఆర్ రోడ్ షోకు ప్రజలు డప్పు చప్పుళ్లతో స్వాగతం కలిపారు. కేసీఆర్ను చూస్తూనే కిలోమీటర్ల దూరం బస్సు వెంట నడుస్తూ వెళ్లారు.
హోరెత్తిన నినాదాలు
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, పరకాల, వరంగల్ తూర్పు, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీగా జనం కేసీఆర్ రోడ్ షోకు వచ్చారు. అదాలత్ జంక్షన్, నక్కలగుట్ట, అంబేద్కర్ జంక్షన్, పెట్రోలు పంపు జంక్షన్, మిషనరీ హాస్పిటల్, అశోక జంక్షన్ వద్ద అన్నివైపులా రోడ్లు జనంతో కిక్కిరిపోయాయి. కేసీఆర్ ప్రసంగం వినేందుకు, ఆయనను చూసేందుకు గంటలకొద్ది వేచి ఉండి, ఓపికగా ప్రసంగం విన్నారు. కేసీఆర్ ప్రసంగానికి మధ్యలో నినాదాలతో మద్దతు తెలిపారు. తెలంగాణ మలి ఉద్యమంలో వరంగల్తో తనకున్న సంబంధాన్ని కేసీఆర్ వివరిస్తున్నప్పుడు ప్రజలు జై తెలంగాణ అని గట్టిగా నినదించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి, సాగు, తాగునీరు, కరెంటు సరఫరా, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం, ములుగు, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, నర్సంపేటలో మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి కేసీఆర్ చెప్పినప్పుడు జై కేసీఆర్, సీఎం కేసీఆర్ అన్న నినాదాలు హోరెత్తాయి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ తెచ్చుకున్నం అన్నప్పుడు ప్రజలు చప్పట్లతో ప్రతిస్పందించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ కాలువ నుంచి నీళ్లు రాలేదని, కాళేశ్వరం కట్టిన తర్వాతే పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాల్లో సాగునీరు అందిందని, పుష్కలంగా పంటలు పండాయని కేసీఆర్ వివరించినప్పుడూ జనం చప్పట్లతో మద్దతు పలికారు.
కాంగ్రెస్ అన్యాయం, బీజేపీ ద్రోహంపై రగిలిన జనం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ద్రోహంపై కేసీఆర్ వివరించినప్పడు ప్రజలు రగిలిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ఎలా ఉన్నదని కేసీఆర్ అడిగినప్పుడు ఏమీ లేదని, జనం చేతులెత్తి చెప్పారు. కల్యాణలక్ష్మితో తులం బంగారం అందుతున్నదా? రైతుబంధు అందరికీ వచ్చిందా? రుణమాఫీ జరిగిందా? మహిళలకు రూ.2,500 ఇస్తున్నారా? రైతుబీమా వస్తున్నదా? అని కేసీఆర్ రోడ్షోకు వచ్చిన ప్రజలను అడిగారు. కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రజలు చేతులెత్తి లేదు అంటూ ముక్తకంఠంతో చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరంగల్ ఉమ్మడి జిల్లాకు అన్యాయం చేసిందని కేసీఆర్ అన్నప్పుడు జనం బీజేపీకి వ్యతిరేకంగా స్పందించారు. కాజిపేటలో కోచ్ ఫ్యాక్టరీని, బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీని బీజేపీ ప్రభుత్వం ఇవ్వయలేదని కేసీఆర్ వివరించారు. ఇప్పుడు వరంగల్కు సాగునీటి ఆదెరువుగా ఉన్న గోదావరి నీటిని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరిస్తున్నదని కేసీఆర్ చెప్పినప్పుడు జనం బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కడియం ద్రోహి.. అంటూ నినదించిన ప్రజలు
బీఆర్ఎస్ తరఫున స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి పేరు లేకుండానే కేసీఆర్ ప్రసంగంలో ప్రస్తావించగానే.. రోడ్ షోకు వచ్చిన జనం ‘కడియం ద్రోహి’ అంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కడియం శ్రీహరి ఎమ్మెల్యే పదవి పోతుందని, స్టేషన్ ఘన్పూర్కు ఉప ఎన్నిక వస్తుందని, రాజయ్య గెలుస్తాడని కేసీఆర్ మాట్లాడినప్పుడు జనం ఈళలు, చప్పట్లతో హనుమకొండ చౌరస్తా జంక్షన్ మార్మొగింది. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన రోడ్ షో భారీ జనంతో విజయవంతం అయ్యింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో కేసీఆర్ రోడ్ షో ఉత్సాహాన్ని పెంచింది.