Police Recruitment | హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలకు ఎంపికయ్యామని ఆనందపడిన వారికి వైద్య పరీక్షలు, పెట్టీ కేసుల రూపంలో తీరని నిరాశ ఎదురైంది. వింతైన వైద్య పరీక్షలతో ఎందరో కొట్టుమిట్టాడుతున్నారు. కేసులు కొట్టివేసినా వారికి కనికరం చూపడం లేదు. ఇలా ఒకరు, ఇద్దరు కాదు.. వందలాది మంది అభ్యర్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బాధితులు సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్నగర్ జిల్లా నుంచే ఉండటం గమనార్హం. తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన వివిధ పరీక్షల్లో తుది దశలో ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో మెడికల్ టెస్టులను ఆదరాబాదరాగా చేయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అప్పటికే సివిల్, ఏఆర్ వంటి విభాగాలకు ఎంపికైనట్టు బోర్డు నుంచి లేఖలు అందాయి. ఫిబ్రవరి మొదటివారం నుంచే మెడికల్ టెస్టులకు రావాలని అభ్యర్థులకు సందేశాలు పంపారు. చాలామందిని పరీక్షించకుండానే వైద్యులు ముఖం చూసి మెడికల్ టెస్టులు పాస్ చేయించారని విశ్వసనీయ సమాచారం. కొందరిని కాళ్లు, కండ్లు చూసి పరీక్షలు నిర్వహించకుండా వెరికోస్ వీన్స్, లో సైట్, మైల్డ్ హైడ్రోసిల్ పేరుతో ‘అన్ఫిట్’ అని రాసి ధ్రువీకరించారు. దీంతో కంగారుపడిన ఆయా అభ్యర్థులు వివిధ ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఎలాంటి లోపాలు లేవని తేలింది. ఆ రిపోర్టులతో తమకు రీచెకప్ చేయాలని ఎస్పీకి, టీఎస్ఎల్పీఆర్బీకి లెటర్లు పెట్టుకున్నా కనికరించే నాథుడే లేరు. అయితే, కొన్ని జిల్లాల్లో కొందరు అభ్యర్థులకు మూడోసారి కూడా రీచెకప్కు అవకాశం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కేసులపై విచారణలో అధికారుల అలసత్వం!
రాష్ట్రవ్యాప్తంగా సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ స్వీయ ధ్రువీకరణ పత్రంలో తమపై రకరకాల కారణాలతో నమోదైన సివిల్,క్రిమినల్,బైండోవర్,కరోనా, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన కేసులు ఉన్నట్టు పోలీసులే ధ్రువీకరించారు. వీరిపై నమోదైన కేసుల్లో వారు విద్యార్థి దశలో చేసిన ఉద్యమ కేసులు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే కుటుంబ తగాదాలతో కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా నమోదైన కేసులే అత్యధికం. ఎంపికైన అభ్యర్థులపై నమోదైన చాలా కేసుల్లో ఇప్పటికే కొందరు అభ్యర్థులు కోర్టు ల్లో నిర్దోషులుగా బయటపడ్డారు. స్పెషల్ బ్రాంచి అధికారుల తుది పరిశీలనలో కూడా అభ్యర్థులు ఆయా కేసులకు సంబంధించిన పూర్తి వివరాలతోపాటు,కేసుల్లో నిర్దోషిగా తేలి న కోర్టు జడ్జిమెంట్ కాఫీలను అభ్యర్థులు స్పెషల్ బ్రాంచి అధికారులకు, బోర్డుకు అందించినా అలసత్వం వహిస్తున్నారు.
156 మందికి క్లియరెన్స్?
పోలీసు ఉద్యోగాలకు అర్హత సాధించి స్థానికత ధ్రువపత్రం, నేరచరిత్ర, సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, వర్టికల్/హారిజాంటల్ రిజర్వేషన్ల అర్హత, మెడికల్ ఫిట్నెస్ తదితర అంశాల్లో సమస్యలను గుర్తించి సుమారు 700 మందిలో 326 మందిని తుది దశకు తీసుకొచ్చారు. అందులో న్యాయమైన వారిని ఎంపిక చేసే బాధ్యతను స్క్రీనింగ్ కమిటీకి అప్పగించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి, డీజీపీ ప్రతినిధితోపాటు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ సభ్యులుగా ఉన్న స్క్రీనిం గ్ కమిటీ నుంచి ఇప్పటికే 156 మందికి క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది. మిగిలిన వారిలో సాధారమైన పెట్టీ కేసులు ఉన్నవారు, వైద్యుల ద్వారా అన్యాయానికి గురైన వారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. ఇప్పటికనా సీఎం రేవంత్రెడ్డి చొరవ తీసుకొని తమపై కనికరం చూపాలని వారంతా వేడుకుంటున్నారు.
నా కాళ్లను చూసి ‘వెరికోస్ వీన్స్’ అని రాసి అనర్హత వేటు వేశారు. వైద్యులే అలా చేయడంతో భయపడి వెంటనే ఓ ప్రైవేటు దవాఖానలో పరీక్షలు చేయించుకున్నా. నాకు ఎలాంటి వెరికోస్ వీన్స్ లేవని తేలింది. ఆ రిపోర్టులు తీసుకొని రీ చెకప్కు అవకాశం ఇవ్వాలని జిల్లా ఎస్పీకి, బోర్డుకు లేఖలు రాసినా స్పందన రాలేదు. 13 ఏండ్లుగా హోంగార్డుగా చేస్తున్నా.
– టీ రాములు, గాలిగూడ గ్రామం,బాలానగర్ మండలం, మహబూబ్నగర్ జిల్లా